14, జనవరి 2014, మంగళవారం

మా పాలమూరు కోటలు - చంద్రగఢ్ కోట


మహబూబ్ నగర్ జిల్లా లోని గిరిదుర్గాలలో '''చంద్రగఢ్ కోట ''' ఒకటి. ఇది జిల్లాలోని నర్వ మండలం లో చంద్రగఢ్ అనే గ్రామ సమీపంలో ఉంది.

ఉనికి

ఈ కోట గద్వాల కు వాయువ్యాన 20 కిలోమీటర్ల దూరంలో, ఆత్మకూరు పట్టణానికి పశ్చిమాన 12 కిలోమీటర్ల దూరంలో,  పర్యాటక ప్రాంతమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ కు ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ధర్మాపూర్, చిన్న కడుమూరు, బెక్కెరపల్లె, ప్రియదర్శిని మొదలగునవి దీని చుట్టుపక్కల గ్రామాలు. ధర్మాపూర్, చంద్రఘడ్ ఒకే పంచాయతీ గ్రామాలు.

కోట నిర్మాణం

చంద్రఘడ్ గ్రామానికి ఉత్తరదిశలో ఎత్తైన కొండ ఉంది. ఆ కొండ మీద రెండు అంచెలుగా ఈ కోటను నిర్మించారు. చుట్టు పక్కల పది కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ నుండి చూసినా ఈ కొండ, కొండ మీది కోట కనిపిస్తాయి. ఈ కోట మొత్తం నిర్మాణమంతా రాతితోనే ఉండటం విశేషం. ఈ నాటికి చెక్కుచెదరని రాతికట్టడం చూపరులను ఆకట్టుకుంటుంది. దీనిని 18 వ శతాబ్ధిలో మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో,  ఆత్మకూరు సంస్థానంలో పన్నుల వసూలు కొరకు నియమించబడిన చంద్రసేనుడు ఈ కోటను నిర్మించాడంటారు. కొండపై మొదటి భాగంలో విశాలమైన  ఆవరణాన్ని చుట్టి రక్షణగోడ ఉంది. దానిని దాటి మరింత పైకి వెళ్తే, మరింత ఎత్తులో అద్భుత నిర్మాణంతో కూడిన రాతికోట కనిపిస్తుంది. దీనికి రెండు ద్వారాలు ఉన్నాయి. ఒకటి పశ్చిమం వైపు ప్రధాన ద్వారం, ఉత్తరం వైపు మరో ద్వారం. ఉత్తర ద్వారం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కాని ఇక్కడ ప్రవేశం లేదిప్పుడు. ఒకప్పుడు ఇది అత్యవసర ద్వారం లాగా ఉండేదేమో! కోట వెనుకంతా కొండ మీద ఏక శిలలా కనిపించే బండ ఉంది. ఆ బండమీదే కోట వెనుక భాగపు గోడను నిర్మించారు. పై కోట ఎక్కడా శిథిలమైనట్టు కనిపించదు.
కోట లోపల  శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. అలయం చుట్టూ 8 ఊట బావులున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ స్వచ్ఛమైన నీటి ఊటతో తాగునీరును అందిస్తున్నాయి. శ్రీరామలింగేశ్వరస్వామికి ప్రతి శివరాత్రికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం నాగుల చవితి నాడు కొండపై జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కబడ్డీ పోటీలను నిర్వహిస్తుంటారు.
పర్యాటకులకు సూచనలు
* గద్వాల నుండి, ఆత్మకూరు నుండి బస్సు ప్రయాణం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఏ ప్రాంతం నుండి వచ్చినా చంద్రగఢ్ స్టేజి దగ్గరో, లేదా  ప్రియదర్శిని కాలనీ కూడలి దగ్గరో దిగితే సరిపోతుంది. అక్కడి నుండి రెండు కిలో మీటర్లు ఆటోలలో ప్రయాణించి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.
* లోపలి కోట ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఆ సమయాలలో చేరుకోవటం ఉత్తమం.
* ఒకవేళ పగలు ఏ వేళలో అయినా గ్రామానికి చేరినా, ముందు గ్రామంలోని పూజారి నర్సప్ప ఇంటిదగ్గర తాళం తీసుకవెళ్ళి కోటను దర్శించవచ్చు.

Youtubeలో చంద్రఘడ్ కోట













4, జనవరి 2014, శనివారం

మా పాలమూరు కవులు - ఏదుట్ల శేషాచలం



ఏదుట్ల శేషాచలం మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి సమీపంలోని  ఖిల్లాఘనపురం వాసి. ఒకనాటి వనపర్తి సంస్థానంలో ఆస్థాన కవి. ఇతను సంగీత సాహిత్య భరతశాస్త్రాది కళాప్రవీణుడు. ఇతని తండ్రి నాగేశం, తాత చెన్నయ్య. ఇతని వంశస్తుల్లో చాలా మంది సంగీత సాహిత్యాలలో ఆరితేరినవారు. ఇతనికి ఆ సంపదే వారసత్వంగా వచ్చిందంటారు. వీరి పూర్వికులు ఒకనాటి జటప్రోలు సంస్థానం సమీపంలోని ఏదుట్ల  గ్రామస్తులు. ఈ కవి జటప్రోలు సంస్థానాన్ని వదిలి, వనపర్తి సంస్థానాన్ని ఆశ్రయించటం కొంత విడ్డూరమైనా, అప్పటికే ఏదుట్లను వదిలి ఖిల్లాఘనపురంలో స్థిరపడి ఉండం ఒక కారణం కావచ్చు. ఈ కవి ' జగన్నాటకం ' అను యక్షగాన నాటక కావ్యాన్ని రచించాడు. దీనివెనుక ఓ పెద్ద కథే ఉంది. దాని గురించి ఆరుద్ర గారి మాటల్లో..." మన సాహిత్యంలో కల రాని కవి, దేవుడు కనిపించి ఆజ్ఞాపించని కావ్యం లేదు. అయితే మన కవులు రిపోర్టు చేసిన తమ కలలో ఏ ఒక్కటి తలాతోకా లేనివి లేవు. వాస్తవానికి కలలో అన్నీ కలగాపులగంగా ఉండాలి.  స్వప్న చిత్రాల మాంటేజ్ విచిత్రంగా ఉంటుంది. ఇటువంటి కలవచ్చినవాడు మన సాహిత్యంలో ఏదుట్ల శేషాచలం ఒక్కడే కనిపిస్తాడు.'' అటువంటి విచిత్రమైన కలలో ' హరే రామా గోవిందా ' అంటూ అర్థనారీశ్వరుడు వచ్చి అజ్ఞాపిస్తే రాసిన రచనే ' జగన్నాటకం ' అని కవి చెప్పుకున్నాడట. ఈ కవి ఈ రచనను ఆధ్యాత్మ విద్యానుసారంగా, భరతశాస్త్రానుసారంగా రచించాడు. పరబ్రహ్మ నుండి ప్రకృతి, జీవుడు జన్మించడం, ప్రపంచనాటకం ఆరంభించటం మొదలగు విషయాలన్ని ఇందులో వర్ణితాలు.  ముక్తికాంతా పరిణయం, రాజ రంజన విద్యావిలాస నాటకం మొదలగు ఆధ్యాత్మిక యక్షగానాల కోవలోకి ఈ యక్షగానం కూడా చేరుతుందని పండితుల అభిప్రాయం.  ఇందులో అడుగడుగున భక్తిరసైక నిష్ట కలదందురు.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*