3, మార్చి 2024, ఆదివారం

నేనూ - గొరుసు - గజఈతరాలు

                                                                                                                                                             హాజనిత కల్పిత కథాజగత్తును దాటి వాస్తవ జీవితాలను చిత్రించిన కథలను చదవడం మొదలుపెట్టి అప్పటికి చాలా కాలమే అయ్యింది. కానీ వాటిలోనూ తెలియని మనుషులు, తెలియని భాష, తెలియనిఊర్లూ, వీధులూ అన్ని పరాయివే. ఎవరో తెలియని మనుషుల జీవితాలు చదువుతున్నట్లూ, చూస్తున్నట్లూ ఉండేది. మొదటిసారి 1998 మార్చిలో ఆంధ్రప్రభ వార పత్రికలో ‘ఉసుళ్ళు ‘ పేరుతో ఓ కథ కంటపడింది. ఆ తర్వాత 1999 డిసెంబర్లో ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో మరో కథ ‘గజఈతరాలు’ చూశాను. అంతవరకు మావి అనిపించిన కథలను చూడని నాకు ఈ రెండు కథలు ఆ లోటును తీర్చేశాయి. ఈ కథలు మావే. ఈ భాషా మాదే. ఈ కథల్లో ప్రస్తావించబడిన మహబూబ్ నగర్, గద్వాల, ఉప్పేరు,పెబ్బేరు, బీచుపల్లి, రంగాపురం, వనపర్తి, దేవునిపాలెం, గుడ్లనర్వ అన్నీ మా ఊర్లే. వల్లభనగర్, రాయిగడ్డ, మర్రికుంట అన్నీ మా వీధులే. సాయమ్మ, బాలామణీ, పూర్ణమ్మ అందరూ మా మనుషులే అన్పించింది. ఈ కథలు మనుసుకు ఎంతో దగ్గరైపోయాయి. 

              ‘గజఈతరాలు’ పూర్ణమ్మ అయితే మా అత్తలాగా, ఆమె వెంట తిరిగాడిన పిల్లల్లో నేనొకడినై ఉన్నానేమో! ఆ అనుభవాలన్నీ మావేనేమో! ఆ భాషా మా నోటి నుండి రాలిపడితే ఏరి, రచయిత ఈ కథలో పొందుపర్చాడేమోననిపించింది. అందుకే ఆ కథ నన్ను నేను చూసుకోవడానికి మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు చదివానో! గజఈతరాలైన పూర్ణమ్మ, వందమందికి ఈత నేర్పిన పూర్ణమ్మ, కష్టాలని, జీవితాన్ని ఒంటరిగా, ధైర్యంగా ఎదుర్కొని బతుకు సాగించిన పూర్ణమ్మ చివరికి బావిలో పడి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో! చెపుతుందీ కథ. సహజ సంఘటనలకు, సున్నితమైన హాస్యాన్ని జోడించి, సమకాలీన సమస్యలు బతుకులను ఎట్లా చిందరవందర చేస్తాయో, చావులకు కారణం ఎలా అవుతాయో చెప్పిన కథ. చాలా కాలం నన్ను వెంటాడిన కథ. ఇప్పటికీ మరిచిపోని కథ. ఎన్ని కథలు చదివినా, ఎప్పటికీ మనసులో ప్రథమ స్థానంలో పదిలపరుచుకున్న కథ.


       ‘ఉసుళ్ళు’ అడుక్కుతినే మనషులను, వారి ఆర్తనాదాలను అల్లంత దూరంలోనే ఉంచి, కుక్కలకు మాంసం ముక్కలు పెడుతూ సంతోషించే సమాజాన్ని ఓ పార్శ్వాన చూపిన కథ. అంతకుమించి, ఎలాగోలా ఆకలిని జయించాలని నానా అవస్థలు పడే బతుకుల్ని, మరో రకమైన ఆకలి ఎట్లా బలితీసుకుందో హృదయ విదారకంగా చెప్పిన కథ. కథ చదివాకా ‘తుమ్మ ముళ్ళు దిగబడిన తూనీగలాగా’ హృదయాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తాం. 

     ఉసుళ్ళు, గజఈతరాలు మా కథలు, మా ఊరి కథలు. మా మనుషుల కథలు. మరి ఈ కథలు రాసిన ఈ రచయిత ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఎలా కలవడం? చాలా కాలం ఈ ప్రశ్నలు వేదించాయి. అన్వేషణ మొదలైంది. 

      ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగంలో కొత్త పుస్తకాల కొరకు వెతుకుతుంటే ఏదో సంవత్సరానికి సంబంధించిన కథావార్షిక ఒకటి కంటపడింది. దాని సంపాద వర్గంలో వీరి పేరు కనబడింది. పుస్తకం చివర్లో వీరి చిరునామా దొరికింది. ఇక నా ఆనందానికి అవధులు లేవు. పుస్తకం తీసుకోలేదు కానీ చిరునామా తెచ్చుకున్నాను. ఈ రెండు కథలపైన నా అభిప్రాయాలను, స్పందనలను తెలియజేస్తూ సుదీర్ఘంగా ఒక ఉత్తరం రాశాను. అప్పుడు ఏం రాశానో! ఎట్లా రాశానో! తెలియదు. తిరిగి జవాబు రాలేదు. చేరిందో! లేదో! కూడా తెలియదు. ఒక రచన చదివి, స్పందించి, దాని రచయితకు ఉత్తరం రాయడం నా వరకు నాకు అదే మొదలు, అదే ఆఖరు కూడా. 

     ఆ తర్వాత మరికొంత కాలానికి ఈ రెండు కథలతో పాటు వలసపక్షులు, చీడ, వాల్తేరత్త, ఖాయిలా బతుకులు మొదలగు మరో ఎనిమిది కథలను కలిపి నాకెంతో ఇష్టమైన ‘గజఈతరాలు’ కథ పేరుతోనే కథా సంపుటిని వెలువరించారు రచయిత. మళ్ళీ చిరునామా సంపాదించి, మనియార్డర్ చేసి, పుస్తకం పంపమని ఉత్తరం రాశాను. పుస్తకం వచ్చింది. దానితోపాటు మనియార్డర్ కూడా తిరిగి వచ్చింది. 

     ఉసుళ్లు, గజఈతరాలుతో పాటు నాకు బాగా నచ్చిన మరో కథ ఖాయిలా బతుకులు. ప్రభుత్వరంగ సంస్థల్లో జరిగే మోసాలు, లీలలు మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. పరిశ్రమలో పెద్ద తలకాయలు, వాటిని బటటి నుండి నడిపే శక్తులు పరిశ్రమల మూతకు ఎలా కారణమవుతాయో, తత్ఫలితంగా వాటి మీద ఆధారపడిన బతుకులు ఎలా చిద్రమవుతాయో! చూపిన కథ. ఈ పుస్తకంలోని కథలన్నీ ఆకట్టుకునే కథలే. అన్నీ వాస్తవజీవిత చిత్రణలే. ఈ రచయితకు పాలమూరు మాండలికం మీద ఎంత పట్టు ఉందో, ఉత్తరాంధ్ర మాండలికం మీద కూడా అంతే పట్టు ఉంది. ఈ రచయిత ఈ పుస్తకం తప్ప మరో పుస్తకం వెలువరించినట్లు కనపడదు. అయితేనేం ఇవి తెలుగు కథాసాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోదగ్గ కథలు.

       గొరుసు జగదీశ్వరరెడ్డి గారు ఆదివారం ఆంధ్రజ్యోతికి ప్రముఖుల ఇంటర్వ్యూలు చేసి పెడుతున్నప్పుడు వారి ఫోన్ నెంబర్ దొరికింది. తీరిక దొరికిన ఒకరోజు ఫోన్ చేశాను. ఆనందంగా మాట్లాడారు. నేను రాసిన ఉత్తరం గురించి చెప్పారు. మా ప్రాంతంతో పెనవేసుకున్న వారి బాల్యం, జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ పంచుకున్నారు. చాలా కాలం తీరిక దొరికినప్పుడల్లా ఫోన్లో పలకరించేవారు.

       ఒకసారి ఉద్యోగరీత్యా ఓ 12 రోజుల పాటు వృత్త్యంతర శిక్షణార్థమై హైదరాబాదులో ఉండవలసి వచ్చింది. ఆ సందర్భంలో నగరంలోనే ఉన్నానని వారికి ఫోన్ చేస్తే, అమీర్పేటలోని సారథి స్టూడియోకి వచ్చేయమన్నారు. అక్కడి ప్రివ్యూ థియేటర్లో ఆరోజు సాయంత్రం, పేరు గుర్తుకు లేదు కానీ ఏదో ఇరానీ సినిమాను చూపించారు. సినిమా అయిపోయాకా బయట కేఫ్ లో ఇరానీ చాయ్ తాగుతూ. చాలాసేపు మాట్లాడుకున్నాం. అది నా జీవితంలో అత్యంత ఆనందాన్ని ఇచ్చిన రోజులలో ఒకటి. ఒక అభిమాన రచయితను అట్లా ప్రత్యక్షంగా కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. తను బాల్యమంతా గడిపిన ఈ ప్రాంతాలలో, ఈ వీధులలో తనతో కలిసి తిరుగాలని, చూడాలని ఉందని, అందు కోసం ఓ రెండు రోజులు నాకు కేటాయించాలని కోరాను. వారు ఇచ్చే రోజు కోసం ఎదురుచూస్తూ.... 
- నాయుడు గారి జయన్న
      03.03.2024

20, జనవరి 2024, శనివారం

నడిగడ్డ చరిత్రే - కె. నాగేశ్వరాచారి 'గద్వాల్జాతర కథలు'


క మొక్క వృక్షమై ఆకాశం వైపు ఎంత ఎదిగినా, దాని కొమ్మలు దిక్కుదిక్కులకు ఎంత విస్తరించినా,  మూలాన్ని, తాను మొలకెత్తిన నేలను విడిచి ఏ వృక్షమైనా నిలబడగలదా?. అట్లా మూలాన్ని వదలని వ్యక్తిత్వం కె. నాగేశ్వరాచారి గారిది.  నడిగడ్డలో జన్మించి, ఉన్నత విద్య కోసం, ఉద్యోగం కోసం అనంతపురం వెళ్లి, అక్కడే ఉండిపోక,  తనకు జన్మనిచ్చిన నేల సమీపానికి రావడం, తన నేల మీద కథలు రాయడం, తన నేలకు సంబంధించిన వ్యక్తులను వెతుక్కోవడం, ఆ వ్యక్తులు దొరికితే అమాంతం హత్తుకపోవడం ఈ రచయిత వ్యక్తిత్వం.  ఇట్లాంటి హృదయమార్దవం కలిగిన రచయిత కలం నుండి ఎట్లాంటి కథలు రాగలవో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదనుకుంటా!

  అయితే ఈ కథలు చదివిన ఏ విమర్శకుడైనా ఇవి కథలా?, కథనాలా? అనే ప్రశ్నవేయవచ్చు. దానికి ఈ సంకలనంలోని 'బీజం" లాంటి కథలు  కూడా ఊతం ఇవ్వవచ్చు. కానీ నేనైతే, ఇవి జీవితాలంటాను. మట్టి మనుషుల వెతలంటాను.  ఒక ప్రాంతపు చరిత్ర, వాళ్ళ బతుకులు, కష్టాలు, కన్నీళ్లు అమాయకత్వం, అన్ని కలగలిపి రాసిన చరిత్రంటాను, ఒక్కమాటలో చెప్పాలంటే ఇది యాభై, అరవై ఏళ్ల కిందటి నడిగడ్డ చరిత్ర.

 రచయిత ఈ కథలనెందుకు రాశాడు

  పాలమూరు కవి కోట్ల వేంకటేశ్వర్ రెడ్డి తన 'నూరు తెలంగాణ నానీలు' పుస్తకంలో... ఒక నానీలో, "పచ్చగున్న కాడ / పక్షివై వాల్తివి, నా నేలను/ నాక్కాకుండా చేస్తివి" అన్నట్లు ... అరవై ఏళ్ల  కిందట, ఆర్డీఎస్ వచ్చి అప్పుడప్పుడే పచ్చ పచ్చగా మారుతున్న నడిగడ్డను పసిగట్టిన కొన్ని వలస గద్దలు ఇక్కడ వాలి ఎంత సామాజిక, సాంస్కృతిక, భాషా విధ్వంసాన్ని సృష్టించాయో విడమర్చి చెప్పడానికే ఈ రచయిత ఈ కథలు రాశాడనిపిస్తుంది.

కథలు

  ఈ పుస్తకంలో మొత్తం 11 కథలు ఉన్నాయి. ఇవన్నీ కాలువ కథలు. ఆర్డీఎస్ కథలు.  మనిషి దేహం నిండా రక్తనాళాలు పరుచుకొని, ప్రతి అవయవానికి, ప్రతి కణానికి ప్రాణవాయువును అందించినట్లు, ఈ కథల నిండా కాలువలు,  వాటి మీద ఆధారపడిన బతుకులు పరుచుకున్నాయి.

    ఉన్న ఊర్లో జీవనాధారం లేక నగరానికి వలసెల్లిన ఓ కుటుంబానికి చదువుల తల్లి లాంటి బిడ్డను కోల్పోవడం ఎట్లా శాపంగా పరిణమించిందో తెలియజేసే కథ చంద్రమ్మ కథ. కథ సగ భాగం వరకు చంద్రమ్మ మరణం, కుటుంబ నేపథ్యం గురించి చర్చించి, ఆ తర్వాత  కాల్వ తెచ్చిన మార్పులు, ప్రజల జీవితాల్లో ఖర్చులు పెరిగిన వైనం, కాల్వల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష వైఖరులను ఈ కథ చర్చిస్తుంది. సేతుల్ల పెరిగి, పెద్దదైన పిల్లను పోగొట్టుకుంటే ఎవరి పానమైన ఎట్లుంటది. ఆ బాధ మన వరకొస్తే గాని అర్థం కాదనడం అక్షరసత్యం. కాల్వొచ్చినాక ప్రజల కూడు, గూడు, గుడ్డ విషయాల్లో కొంత మార్పొచ్చిన మాట వాస్తవమే అయినా, అంతకు మించి లాభపడిందెవడు?  మేడలు కట్టిందెవడు? విదేశాల్లో చదువులు లాంటి లాభాలు వొనగూడిందెవరికి? ఈ దేశభవిష్యత్తును బాధ్యతగా ముందుకు తీసుకపోగల విద్యార్థులు అర్థాంతరంగా తనువులు చాలిస్తుంటే కారణమెవరిదనాలి? అంటూ రచయిత ఈ కథ ద్వారా సంధించిన ప్రశ్నలు మన ఆలోచనల్ని మెలిపెడతాయి.

    ఆర్డీఎస్ పెద్దకాలువ పూర్తి కాగానే, సిన్న కాలువలు మొదలవుతుండగానే వచ్చిన బెజవాడ వాళ్లు ఊర్లల్ల పెద్ద మనుషులను, సావుకార్లను బుడుక్కొని వారిని మధ్య మనుషులుగా పెట్టుకొని,  అమాయకుల పొలాల నెట్లా కొన్నారో, ఆస్తిని అమ్ముకున్న కూడా వచ్చిన డబ్బెట్లా మాయమైపోయి, పేదల కండ్లల్లో కష్టమెట్లా కన్నీళ్లుగా రూపుదాల్చనో '18 వ కాలువ కథ' మనకు విడమర్చి చెపుతుంది. ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటర్ల లెక్కలు, కాలువ ప్రయాణ దూరాలు తెలియాలన్న, కాల్వ బుట్టిన కాడ్నుంచి కాల్వ ముగిసే వరకు ప్రయాణంలో ఎన్నెకరాలు ఎవరి పాలయ్యిందో తెలవాలన్న మనం ఈ కథను చదవాల్సిందే.

    'గద్వాల్జాతర కథ'... గద్వాల రథశాల దగ్గర మొదలై , గుండు కేశవ స్వామి, లింగం బాయి. చొక్కం బాయి, మీదుగా కోటలోకి ప్రవేశించి, గుడులు, భవనాలు వాటి సౌందర్యాలు, దాని వెనుక దాగిన శ్రమజీవుల కష్టాన్ని వివరిస్తూ కోట దాటుతుంది.   రథశాల నుండి కోట వరకు హనుమప్ప నాయుడు వెంట కథకుడు వెళ్లినట్లే, మనం కూడా తిరుగాడుతాం. దానితోపాటు ఒక సందేహాన్ని మోసుకతిరుగుతాం. సోమప్ప కాలం నాటి హనుమప్ప సీతారాంభూపాల్ కాలానికి ఎట్లొచ్చె, వర్తమాన కాలానికి చెందిన ఈ కథకుడితో ఎట్లా జత కలిసే అని, అదే ఈ కథలో ట్విస్ట్. కథాంతానికి చేరితే గాని మన సందేహాం పటాపంచలు కాదు. అది నేను చెప్పదలుచుకోలేదు. మీరు చదివి తీరాల్సిందే. చదివి సందేహాన్ని తీర్చుకోవాల్సిందే. కాల వైవిధ్యమైన పాత్రలను ఒక చోట చేర్చి, కథ నడిపిన విధానం బాగుంది. ఈ కథా సంపుటిలోని మంచి  కథల్లో ఇది ఒకటి.  ఈ సంపుటికి ఈ పేరు పెట్టటం సరైనదే.

   సమయ పాలన, క్రమశిక్షణ ఉండకూడదని కాదు గాని, విద్యాచైతన్యం లేని చోట అవి మరీ ఎక్కువైతే విద్యార్థుల చదువుకు అవే ఆటంకం కాగలవని తెలియజెప్పే కథ 'సూర్రెడ్డి జమానా'. "భయం విద్యార్థిని ఎదగనీయదు. టీచర్ విద్యార్థికి మధ్య నిరంతరం చర్చలు జరగాలి. విద్యార్థి తలనిండా ఉన్న ప్రశ్నలని బయటికి రానీయాల" అంటూ మనకు దిశానిర్దేశం చేస్తుందీ కథ.

 పైడి చంద్రలత 1997లో  నడిగడ్డ నేపథ్యంగా వెలువరించిన నవల - రేగడి విత్తులు. ఈ నవల నడిగడ్డ (పాలమూరు) భాషా, సంస్కృతులను అవహేళన చేసి,  అటు వైపు నుండి ఎంత  ఎత్తుకు ఎదిగిందో, ఇటు వైపు నుండి ఎంతటి తిరస్కరణకు, ధిక్కారానికి, విమర్శలకు గురైందో తెలుగు నవలా సాహిత్యలోకానికి విదితమే. ఆ నవలకు హీరో రామనాథం.  అదే రామనాథాన్ని ఆ నవలకు భిన్నమైన కోణంలో  ప్రత్యక్ష జీవితంలోనూ చూసిన ఈ రచయిత చూపించిన కథే 'ఎల్లెమ్బీ రామనాథం'. సహాయం చేసిన వారిని మోసం చేయడం, తిన్నింటి వాసాలను లెక్కించే వీళ్ల వ్యక్తిత్వాన్ని రామనాథం పాత్ర ద్వారా మనకు చూపిస్తారు రచయిత. ఈ కథలు వెలువడడానికి ప్రధానమైన అంశాలలో రేగడి విత్తులూ ఒక కారణమే.  

  టీవీలు, సెల్లు ఫోన్లు ఊర్లల్లోకి జొరబడని కాలంలో ప్రతి ఊర్లో రాత్రేల గుడికాడో, రచ్చబండ కాడో ముచ్చట్లు సర్వసాధారణం. అట్లాంటి ముచ్చట్లతోనే రచయిత  'నెనరు' కథను నడిపిన విధానానికి మనం ముచ్చటపడతాం. కాని కథలోని పాత్రలు బతకడానికి ఎన్నెన్ని పడవాట్లు పడ్డారో తెల్సుకొని విచారిస్తాం. జీవనాధారాన్ని పోగేసుకొని, అవరోధాలని అధిగమించే ప్రయత్నంలో శ్రమంతా చెల్లాచెదురై ఏట్లో కొట్టుకపోతుంటే బరువెక్కిన బతుకుల వేదనెంత దుర్భరంగా ఉంటుందో కథగా చూపి, మన కండ్లు తడిబారుస్తాడు రచయిత.

ఇట్లా ఈ కథల నిండా నడిగడ్డ బతుకులు, వాటి వెతలు మనకు కళ్లకు కట్టినట్లు చూయించారు రచయిత.

మాండలిక భాషా ప్రయోగం

 మానవ జీవితంలోని వివిధ దశలను, వాటి అనుభవాలను కథలుగా మల్చడంలో గాని,  కథావస్తువు స్వీకరణలో గాని, కథన విధానంలో గాని వైవిధ్యం ఉండవచ్చు. గాని ఆయా ప్రాంతాల మాండాలికాన్ని చక్కగా తమతమ కథల్లో పొందుపరిచిన సుప్రసిద్ద కథారచయితలు వంశి, స.వెం. రమేశ్, నామినిలతో నాగేశ్వరాచారి గారిని పోల్చడం అతిశయోక్తి కాకపోవచ్చు. నాగేశ్వరాచారి గద్వాల్జాతర కథల్లో నడిగడ్డ స్థానిక భాషను, యాసను అట్లే ప్రయోగించారు.

  బడి పలుకుల భాషలో కొట్టుకపోయిన మన పలుకుడుల భాషను వెతికిపట్టి, ఇక్కడ పొందుపరిచినట్లు మనకు కనిపిస్తది.

 ఈ కథలు చదివతే కాలప్రవాహంలో కొట్టుకపోయిన అనేక పదాలని మళ్లీ దొరకబుచ్చుకోవచ్చు.

సిన్నేటి సెంప లాంటి పద ప్రయోగాలు పాఠకుడికి ఈ ప్రాంత భౌగోళిక స్పృహ ఉంటే గాని అర్థం కావు.

జౌరి కట్టు , బుడుక్కొని, పురిబెట్టి, అమ్మడిపొద్దు, డబ్బిగిన్నె, కువాడం, వల్కలు, గప్పున, బుగులు, బుడ్డలు, బెరినా లాంటి అనేక పదాలు నడిగడ్డ భాషాసంపదను పట్టి చూపుతాయి.

కథనవిధానం

ప్రజల జీవనాన్ని వాళ్ల భాషతో సహా పట్టడానికి, వాళ్ల జీవితపు అనుభవాల లోతులను చూడటానికి ఒక అసక్తే గాక, వాళ్లను ప్రేమించే మనస్తత్వం కూడా ఉండాలిఅని హరగోపాల్ గారు చెప్పినట్లు ఈ కథకుడిలో ఆ గుణం మెండుగా ఉంది కాబట్టే ఇంత మెరుగైన కథలు మన ముందుకొచ్చాయి.

పాత్రలు

లచ్చుమన్న, మారెప్ప, మల్దకల్, పక్కీర, బతుకన్న, పెద్దయ్య, బడేసావు, మొదలుగు ఈ కథల్లోని పాత్రలు కల్పనలు కావు. అవి దేవలోకం నుండి దిగివచ్చినవి కావు.  అతి సామాన్యమైనవి. మన చుట్టూ ఉండే మనుషులు. కష్టం తప్ప మరో మార్గం తెలియని మట్టి మనుషులు.  మన తాతో, మామో, బావో, చిన్నాన్నో, పెదనాన్నో అన్నట్లే అనిపిస్తాయి. మనతో బంధాన్ని పెనవేసుకున్న మన ఊరి వాళ్లలాగే అనిపిస్తాయి. ఇట్లాంటి పాత్రలతో , నడిగడ్డ విషయాలతో, విశేషాలతో  కథావస్తువులను ఎంపిక చేసుకొని, వాటికి తగిన భాషను ఎంచుకొని ఈ కథలను విలువైన సాహిత్యంగా మనకందించిన పెద్దలు నాగేశ్వరాచారి గారికి ధన్యవాదాలు. 

                                                                                      - నాయుడి గారి జయన్న

***

5, డిసెంబర్ 2023, మంగళవారం

కుర్చికై కుస్తీ

 దీనమైన స్థితిలో ఉంటే

దిక్కు కొకడు పోతిరి

గోడ మీద పిల్లులై

దూకనీక చూస్తిరి,

దూకి మళ్ళి వస్తిరి

ఒక్కడై పోరుతుంటే

ఓరకంట చూస్తిరి

విజయతిలకం దిద్దగానే

వీరులమంటు వస్తిరి

సిగ్గులేని బతుకు నొదిలి

బుద్దిగ మరి బతుకండ్రా!

లోకం దృష్టిలోన

లోకువ మరి కాకండ్రా!

కుర్చి కొరకు కొట్లాడి 

కుక్కలమని చెప్పకండి

చెమటోడ్చి నోడికే

కుర్చి నప్పగించండి

- ఎన్. జయన్న





4, డిసెంబర్ 2023, సోమవారం

కుక్క- తోక

 కుక్కకు కన్ను ముఖ్యమే

చెవులు ముఖ్యమే 

వీటన్నిటికన్నా 

గతకడానికి నోరు మరీ ముఖ్యమే

కాదనలేని సత్యమే

కానీ... 

వెనుకుందని తోక 

అవసరం లేదా?

అన్నిటిలాగే అది కూడా భాగమే కదా!

కుక్క సంతోషానికి,

ఒదిగి ఉండే విధానానికి,

చూపే ప్రేమకు,

నిస్సహాయతకు,

తోకే కదా సంకేతం.

కుక్క నడకకు, పరుగుకు

తోకే కదా సంతులనం

అసలు కుక్కకు అందమే తోక


తోకంటివి

ఆడించకూడదంటివి

బస్సు చక్రాల కింద నలిపేస్తివి

ఒక చోట పెరికి,

మరో చోట అతికిస్తివి

కదపకుండా దశాబ్దం కట్టేస్తివి

నీ పతనకారకుల్లో

తోకకూ భాగమిస్తివి.

తోక కడ వాలమే కాదు

కరవాలం కూడా.

-ఎన్. జయన్న




5, డిసెంబర్ 2022, సోమవారం

పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు

 *🏵️పన్ను చెల్లింపు ఉద్యోగులకు సూచనలు*

•••••••••••••••••••

ఫిబ్రవరి లో కట్టబోయే పన్ను(టాక్స్) రూ12000 లకు మించితే  మీరు   


అడ్వాన్స్ పన్ను చెల్లింపు లోకి వెళతారు.


అడ్వాన్స్ టాక్స్ క్రింది విధాలు గా (ఫిబ్రవరిలో కట్టే మొత్తం పన్ను లో)  ఉంటుంది


March-May  15%


Jun-Aug 45%


Sep-Nov  75%


Dec-Feb 100%


అడ్వాన్స్ టాక్స్ కట్టకపోతే పై నెలల్లో


కట్టాల్సిన టాక్స్ కి  1%-2% ఇంట్రెస్ట్ లెక్కిస్తారు. దీన్ని ఈ-ఫైలింగ్ చేసినప్పుడు చెల్లింపు చేయమంటారు.


ఒకవేళ అధికంగా టాక్స్ ముందస్తు కట్టిన దానికి 1%-2% ఇంట్రెస్ట్ కలిపి  రిఫండ్ రూపంలో మీకు అందిస్తారు.


ఉద్యోగి టాక్స్ ను తన జీతం లో నుండి cut చేసినప్పటికీ TDS చేయించకపోతే Income టాక్స్ డెఫిర్ట్మెంట్ దృష్టిలో పన్ను చెల్లించనట్లే లెక్క.మనం టాక్స్ కట్టినా కట్టని కిందికి వస్తాము.


 కావున ప్రతి ఉద్యోగి తమతమ DDO ని అడిగి TDS చేయించుకొనుటకు బాధ్యత తీసుకొని సహకరించుకోవాలి.


ప్రతి ఉద్యోగి జూన్ 31 లోపు తమ ఈ-ఫైలింగ్ చేయాలి. లేనిచో


ఆలశ్య రుసుము క్రింద రూ 1000/5000 లు చెల్లించాలి.


*DDO లకు సూచనలు*

DDO తన పరిధి లొ గల ఉధ్యోగులు ఎవరు అడ్వాన్స్ టాక్స్ చెల్లించు కోవలోకి వస్తారో గుర్తించి తగు సూచనలు ఇచ్చి టాక్స్ కట్ చేయాలి .(అడ్వాన్స్ స్లాబ్ వారీగా)


DDOలు క్వార్టర్ వారీగా TDS క్రమం తప్పకుండా డ్యూ DATE లోపు చేయించాలి.


లేట్ ఫైల్ చేసిన చో (ఏ క్వార్టర్ లో చేయాల్సిన TDS అదే క్వార్టర్ లో DDO TDS చేయించలేకపోయిన చో)


DDO కి పెనాల్టీ రూపంలో ప్రతి రోజు కి రూ200లు చెల్లింపు చేయాలి(ఎంత టాక్స్ కట్ చేస్తే అంతకు మించకుండా). దీని కొరకు DDO కి నోటీసులు INCOME టాక్స్ డిపార్ట్మెంట్ వస్తాయి.DDO రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.


TDS అమౌంట్  తక్కువగా cut(టాక్స్) చేయడం వలన  ఆ కాలానికి ఇంట్రెస్ట్ క్రింద DDO కూడా చేయించవలసి ఉంటుంది.


లేట్ ఫైల్ చేయడం వలన .లేట్ ఫీ  బాటుగా ఇంట్రెస్టు ను కట్టాలి. తప్పు జరిగినచో తిరిగి మళ్ళీ ఫైలింగ్ అవకాశం ఇవ్వరు


ఒక్కోసారి రిఫండ్ కూడా పొందలేము.


TDS అనే ప్రక్రియ లో టాక్స్ కట్టిన అందరూ ఉద్యోగులకు ఒకే సారి కలిపి TDS చెయ్యవలసి ఉంటుంది . ప్రతి ఉద్యోగికి ఒకసారి TDS చేయలేరు.


ఈ-ఫైలింగ్ ని ఏ ఉద్యోగికి వారు వేరు వేరు గా ఈ-ఫైలింగ్ చేయించుకోవాలి.


పై సూచనలు ఆధారంగా DDO/EMPLOYEE సకాలంలో తమ టాక్స్ మరియు TDS.ఈ-ఫైలింగ్ చేసుకోగలరు.

10, ఏప్రిల్ 2022, ఆదివారం

కొత్త పుస్తకం – జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం

 

కొత్త పుస్తకం – జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలనాపర సౌలభ్యం కోసం పాత 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసిన విషయం విదితమే. కొత్తగా ఏర్పాటు చేయబడిన జిల్లాల భూభాగాన్ని పరిధిగా నిర్ణయించుకొని గతంలో తెలంగాణ సాహిత్య అకాడమీ సాహిత్య చరిత్రలను రాయించింది. అవి కొంత మేరకు ప్రయోజనాన్ని కలిగించడమే కాకుండా ముందు ముందు జరగాల్సిన కృషికి బాటలు వేశాయి. ఆ కోవలోనే ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్తు నూతన జిల్లాల ప్రాతిపదికన కేవలం సాహిత్యంతోనే ఆగిపోకుండా, జిల్లాలకు సంబంధించిన సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించాలని సంకల్పించింది. ఆ  ప్రయత్నంలో భాగంగా తెలంగాణ 33 జిల్లాల నుండి వెలువడిన మొదటి గ్రంథమే జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం.  ఇందులో జిల్లా భౌగోళిక స్వరూపం, చరిత్ర, సంస్కృతి, కళలు, పర్యాటకం, జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉద్యమాలు – ఉద్యమకారులు, జిల్లా పద్య, గేయ, వచన కవిత్వాలు, కథ, నవల, నాటక వికాసాలు వంటి    ప్రాచీన, ఆధునిక సాహిత్యం, సంస్థానాలు – చరిత్ర, సాహిత్య పోషణ వంటి అనేక విషయాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. ఇవన్నీ ఎవరో రాజధానిలో కూర్చొని ఉద్దండులైన రచయితలు రాసిన వ్యాసాలు కావు. ఆయా జిల్లాల సమగ్ర చరిత్రను ఆయా జిల్లాల రచయితల చేతనే రాయించాలనే ఓ గొప్ప ఆశయానికి అక్షరరూపం ఈ గ్రంథం.  జోగులాంబ గద్వాల జిల్లా విషయాలు, విశేషాలు తెలుసుకోవాలనే ఉత్సహం కలిగిన ప్రతి ఒక్కరు చదవదగిన పుస్తకం.

ప్రతులకు...

తెలంగాణ సారస్వత పరిషత్తు

తిలక్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ -500 001.

పోన్. 24753754

- నాయుడు గారి జయన్న