22, మే 2025, గురువారం

దృక్కోణం - ముందుమాట

 

దృక్కోణంలోని మనోవీచికలు

 

     మిత్రులు నాయుడు గారి జయన్న రాసిన దృక్కోణంలో  21 వ్యాసాలు ఉన్నాయి. వీటిని వ్యాసాలు అనడం కన్నా వారి దృక్కోణంలోని మనోవీచికలు అనడం సబబు. ఈ వ్యాసాల్లో సమగ్రత, విశాల దృష్టి కనిపిస్తుంది. ముఖ్యంగా తాను నివసిస్తున్న పరిసర ప్రాంతాలలోని కవులు ప్రచురించిన కవితా సంకలనాల్ని పరిచయం చేశారు. కొన్ని కథలు తులనాత్మకంగా పరిశీలించారు. గద్వాల్జాతర కథా సంకలనాన్ని సమీక్షించారు. ఇంకా సాహిత్య భావనలను, సాహిత్యకారుల అభిలాషల్ని పరామర్శించారు.

          గద్వాల, అలంపూరు తాలూకాల ప్రాంతాన్ని నడిగడ్డ అని అలా పిలుస్తారు. ఈ ప్రాంతాలలోని నవల, కవిత్వ చరిత్రను సమగ్రంగా విశ్లేషించారు. నిజానికి ఈ రెండు వ్యాసాలు పరిశోధనాత్మకమైనవి. నవలలోని కథల్ని, కథా నిర్మాణాన్ని, కథా నేపథ్యాల్ని వివరించగల శక్తి జయన్న సంతరించుకున్నారు. అలాగే కవిత్వ చరిత్రను కూడా సమగ్రంగానే వివరించారు. కవిత్వ నేపథ్యపు చరిత్ర వివరించి ఉంటే ఇంకా బాగుండేది. ఈ వ్యాస సంకలనంలో గద్వాల సంస్థానం – సాహిత్య పోషణ అను వ్యాసం ఉన్నది. ఈ వ్యాసంలో జయన్నకు స్థానిక గద్వాల సంస్థానం పట్ల అవ్యాజమైన అనురాగం, ప్రేమ కనిపిస్తుంది. వీటి ప్రవాహంలో ఈ వ్యాసంలో కొంత విశ్లేషణ కొరవడింది. ఆయా రాజుల కాలంలో జరిగిన సాహిత్య కృషిని గొప్పగా వివరించారు. ఈ చరిత్ర ఈనాటి సాహిత్యకారులకు తెలియవలసిన అవసరం గుర్తించారు. అందుకే క్లుప్తంగా నైనా ఆయా రాజుల కాలంలోని సాహిత్య కృషిని పరిచయం చేశారు. నిజానికి కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన కవుల నేపథ్యాన్ని వివరించాల్సి ఉండింది. బ్రిటిష్ కాలంలో అక్కడ సంస్థానాలు పల్చబడి పోవటం, కవులకు, కళాకారులకు ఆదరణ తగ్గిపోవడం వలన వారంతా ఆనాటి నైజాం పరిపాలనలోని సంస్థానాలలోకి బాట పట్టారు. ఆ విధంగా వచ్చిన కవులలో విశ్వనాథ, జాషువా వంటి ఉద్దండ పండితులు, కవులు, అక్కినేని నాగేశ్వరరావు వంటి కళాకారులు ఈ సంస్థాన సత్కారాన్ని పొందిన వాళ్లే. స్థానిక చరిత్ర తెలుసుకోకపోతే రచయితకు గానీ, పాఠకులకు గాని  భవిష్యత్తులో వర్తమానం అవగాహన కాదు. కాబట్టి ఈ వ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. జయన్న గారికి కేవలం కవిత్వం, కథ, చరిత్ర మీద ప్రేమనే కాకుండా ఈనాటి వాగ్గేయకారులపై కూడా మమకారం ఉంది. పల్లె కన్నీరు పెడుతుందో/ కనిపించని కుట్రల అన్న గేయం ప్రసిద్ధమైనది. ఈ గేయ రచయిత గోరటి వెంకన్నను, ఆయన గేయాల్ని జయన్న విశ్లేషించగలిగారు. అలాగే ఇంకా చరిత్ర గమనించని వాగ్గేయకారుడు కొండన్నను విశ్లేషించడం గమనించదగ్గది.

        ఈ వ్యాసాలలో వైవిధ్యం కూడా కనిపిస్తుంది. జయన్న గారు ఉపాధ్యాయులు. విద్యా రంగాన్ని గురించి రాసినటువంటి వ్యాసం ఒకే ఒక్కటి ఉంది. అది రామయ్య పాఠాలు గురించి. ఇందులో విద్యా విధానం ఏ కారణాలవల్ల కుంటుపడుతుందో. పాఠ్యాంశాలు ఏ విధంగా ఉంటే విద్యార్థిలో మనోవికాసం చెందుతుందో వివరించిన తీరును పాఠకులకు పరిచయం చేశారు. ఈ వ్యాసాలు ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి పనికొచ్చేవి. ఇందులో రామయ్య గారు వివరించిన అంశాల్లోని పాక్షికతను విశ్లేషించాల్సి ఉండింది. జయన్న గారు వివాదాస్పద అంశాల వైపు దృష్టి మళ్లించినట్లు లేదు.

   జయన్నలో విశాల దృష్టి ఉంది అని చెప్పడానికి ఈనాడు ఫేస్బుక్లో వస్తున్న కవిత్వాన్ని కూడా గమనిస్తున్నారని చెప్పడానికి ఇందులో ఒక వ్యాసం ఉంది. విమర్శకులైన వారికి చుట్టూ ఏం జరుగుతుందో గమనించే శక్తి కూడా ఉండాలి. ఆ శక్తిని ఆయన కలిగి ఉన్నారు. జయన్న దృష్టి వైశాల్యాన్ని ఈ వ్యాసాలు పట్టిస్తాయి. కవుల బిరుదునామాలను గురించి ఒక వ్యాసం ఉంది. ఈ వ్యాసం సీరియస్ గా గమనించదగింది. రచయితలు, కవులు  బిరుదుల కోసం ఎలా తాపత్రయపడతారో విశ్లేషిస్తాడు. నిజానికి ఇవాళ ప్రతి జిల్లాలో నాలుగైదు సాహితీ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు కవితా సంకలనాలకు, కథా సంకలనాలకు అవార్డులు ప్రకటిస్తున్నాయి. ఈ సందర్భంగా అపాత్ర దానం, అపరిగ్రహం అన్న రెండు భావనలను మనం గుర్తు చేసుకోవాలి. దానం ఇచ్చేవాడు, అలాగే గ్రహించేవాడు కూడా పాత్రులై ఉండాలని భావన. ఈ స్పృహ లేని రచయితలకు, సామాజిక బాధ్యత ఉంటుందని, ఇటువంటి సంస్థలకు ఉత్తమ సాహిత్యాన్ని, ఉత్తమ విలువల్ని ప్రోత్సహించాలన్న తపన ఉంటుందని ఊహించలేము. ఇటువంటి భావనల్ని ఎవర్ని గాయపరచకుండా, అతి సున్నితంగా విశ్లేషించటం జయన్న కుండిన సున్నిత మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. తనకు నచ్చని విషయాన్ని రచయితను గాయపరచకుండా అతి సున్నితంగా అందులోని అనౌచిత్యాన్ని వివరించి, తన మర్యాదను, ఎదుటి వ్యక్తి మర్యాదను నిలబెడతారు.

ఈ వ్యాసాల్లో శైలి చాలా అందంగా ఉంది. అన్వయ కాఠిన్యం లేదు. సూటిదనం ఉంది. రచయితల మీద రాసిన వ్యాసాల కంటే స్వతంత్ర వ్యాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇతని ప్రతిపాదనలు, అభిప్రాయాలు గమనించదగ్గవి, గౌరవించదగ్గవి. ఈయనకు విమర్శనా బలం, విశ్లేషణాశక్తి రెండు ఉన్నాయి. లేనిదంతా నిరంతరం రాయకపోవడమే. నడిగడ్డ ప్రాంతం నుండి ఒక మంచి విమర్శకుడిగా, విశ్లేషకుడిగా ఎదగదగిన హంగులన్ని ఇతనిలో ఉన్నాయి.

 

ఇతనిలో ఒక ఆలోచన పరుడు ఉన్నాడని, ఆ ఆలోచనలకు ఒక శాస్త్రీయత ఉందని ఒక విశ్వాసం, భరోసా ఈ వ్యాసాలు అందిస్తున్నాయి. ఇంతకంటే కావలసింది ఏముంది?  నడిగడ్డ ప్రాంతం నుంచి ఒక గొప్ప విమర్శకుడు ముందుకొస్తున్నాడని అభినందిస్తున్నా. ప్రస్తుతానికి ఇంతకంటే ఏం చెప్పినా అది పొగడ్తవుతుందని నా భావన.


-        కె. నాగేశ్వరాచారి

కథకులు, విమర్శకులు

కర్నూలు

03-12-2024

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి