22, మే 2025, గురువారం

సమాజహితకారకం-పవనపుత్ర శతకం

 

సమాజహితకారకం-పవనపుత్ర శతకం 

           సహృదయులు, ఉత్తమోపాధ్యాయులు, ధర్మపరులు, పరోపకారపరులు, దైవభక్తిపరులు, కవివరులు అగు శ్రీ నాయుడు గారి జయన్న గారు ప్రస్తుతం పవనపుత్ర శతకాన్ని సామాజిక అంశాలతో ఆటవెలది పద్యాలలో రమణీయంగా రచించి పద్యశతకకర్తగా కూడా కీర్తిని గడించారు.

          శతకం అంటే వంద పద్యాలతో ఉండే గ్రంథం. ప్రతిపద్యం ఒక ముక్తకంగా ఉంటుంది. పద్యాలకు అన్నింటికీ చివర ఒక పదం గానీ లేక కొన్ని పదాలు గానీ మకుటంగా ఉండటం శతక పద్యాలలో ఉండే నియమం. ఈ నియమాలను అనుసరించి రచింపబడిన ఈ పవనపుత్ర శతకం శ్రీ పవనకుమార….” అని దైవప్రార్థనతో ప్రారంభించబడింది. నేను కవిత చెప్పలేను…..” అని వినయంగా విన్నవించుకొంటూ, పవనపుత్రుడైన ఆంజనేయస్వామివారి దీవెనలను కోరుకోవడం ద్వారా శ్రీ జయన్న కవిగారు తన వినయాన్ని, హనుమద్భక్తిని ప్రకటించుకోవడం ఒక విశేషం. 

         ఈ శతకంలో జయన్న గారు ప్రధానంగా సామాజిక అంశాలను ప్రస్తావించారు. ధర్మమార్గాన్ని అనుసరిస్తూ ఉన్న తాను లోకం పోకడను చూచి ఆవేదనను వ్యక్తం చేశారు. సమాజ సంక్షేమాన్ని కోరుకొన్నారు. ప్రతియొక్కరూ తాము ఉన్న స్థితినుండి ఉన్నతస్థితికి చేరుకొనేందుకు యథాశక్తి ప్రయత్నం చేసేందుకోసం కొన్ని సూచనలను తమ పద్యాల ద్వారా తెలియజేశారు.  శ్రీ జయన్న గారి పద్యాలను చదువుతూ ఉంటే పాఠకులకు వేమన పద్యాలు తప్పనిసరిగా గుర్తుకు వస్తాయి.

       వేమన మహాకవి తాను రచించిన ఆటవెలది పద్యాలలో ఒకటవ, రెండవ పాదాలలో లోకస్థితిని వివరించి, మూడవపాదంలో పైపాదాలలో చెప్పిన విషయమునకు సంబంధించిన ఒక సామెత వంటి సూక్తిని తెలియజేసి, నాలుగవ పాదంలో మకుటాన్ని ఉంచి లోకప్రసిద్ధిని పొందినారు.

          శ్రీ జయన్న గారి పద్యరచన కూడా తేట తెలుగులో, అలతి అలతి పదాలతో ఉంటూ వేమన పద్య ధోరణిని కలిగి యుండడాన్ని మనం గమనించవచ్చు. 

     ఉదాహరణలు

                 వేమన పద్యం-

తల్లిదండ్రలందు దయలేని పుత్రుండు

పుట్టనేమి వాడు గిట్టనేమి

పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా?

విశ్వదాభిరామ వినుర వేమ!

 

               జయన్న పద్యం-

తాను యెదుగు వరకు తల్లిదండ్రులు మేలు

యెరుక రారు వార లెదుగగానె

తలపగ నిటువంటి తనయులు భారమే

పల్లెపాటివాస! పవనపుత్ర!                  (62 వ పద్యం)

 

               జయన్న పద్యం -

వక్రబుద్ధి నీయ వద్దు తండ్రీ నాకు

మాట బడుదు నేను మంది చేత

మాట బడుట కన్న మరణంబె మేలుగా

పల్లెపాటివాస! పవనపుత్ర!             (92 వ పద్యం)

 

ఓ పవనపుత్రా!

కోరికలే లేని మనసును కానుకగా ఇయ్యవయ్యా! అని

కాంక్ష లేని మనసు కానుకగా నివ్వుఅని అంటూ 44 వ పద్యంలో కోరుకొన్న శ్రీ జయన్న కవి,  సిరి సంపదలను నాకు ఇవ్వవద్దు. విద్యను మాత్రం ప్రసాదించవయ్యా! చాలు అని 7 వ పద్యంలో

విద్య నొకటి నాకు విడువుమయా దయన్అని అర్థించారు.

        కామము క్రోధము లోభము అనే దుర్గుణాలకు వశమాపోయినవాడు మంచి మనిషి కాలేడు. అందువలన కరుణతో ఆ దుర్గుణాలను కాల్చివేయి అని

కరుణ జూపి వాటి కాల్చివేయుము తండ్రిఅని అంటూ 45 వ పద్యంలో ఆంజనేయస్వామిని ప్రార్థించారు. 53 వ పద్యంలో కూడా కోపం వలన కలిగే నష్టాన్ని విశదీకరించారు.

       లోకంలో ప్రస్తుత కాలంలో నీతి నియమాలను ఎక్కడా చూడలేకపోతున్నాము అని 55 వ పద్యంలో వర్ణించిన కవిగారు ఓ పవనపుత్రా! ఆనాడు సీత జాడను కనుగొన్నావు. ఈనాడు నీతి జాడను కనుగొనగలవా? నీతిని మాకు చూపగలవా? అని అంటూ

నేటి కాలమందు నీతి జూపగలవా?” అని 98 వ పద్యంలో ప్రశ్నిస్తూ ఉన్నారు.

      మద్యం తాగి వాగే వారికి అన్ని విధాలా దెబ్బలు పడగలవు అని

తాగి వాగి నాక తబల గాదా మేనుఅని అంటూ 58 వ పద్యంలో సెలవిచ్చారు.

        ప్రక్కనున్నవాడి బాధలను పంచుకోవాలి. వారికి సుఖాన్ని పంచాలి. అటువంటివాడే నిజంగా గొప్పవాడు అని

పక్కవాడి బాధ పంచుకొనెడివాడు

పరులకింత సుఖము పంచువాడు

నిజము గొప్పవాడె నిఖిల జగమ్ముల

అని అంటూ

69 వ పద్యంలో వివరించారు.

       పద్యకవిత, గద్యకవిత అనే రెండు కవితలలో దేని గొప్పదనం దానికి ఉంది. ఏదీ తక్కువైనది కాదు అని

దేని ఘనత జూడ దానిదే లోకానఅని 70 వ పద్యంలో నిష్పక్షపాతంగా తెలియజెప్పినారు.

             ప్రతి మనిషిలోనూ ఏదో ఒక గొప్పదనం తప్పనిసరిగా ఉంటుంది అని

మహిమ యుండు నేదొ మనుషులందరిలోనఅని అంటూ 73 వ పద్యంలో వివరించారు.

         నడక మేలు చేయు నరుని కద్భుతముగఅని 8 వ పద్యంలో నడక మనకు చేసే మేలును విశదీకరించారు

        అపనిందతో జీవింపగలమా? అని

నిందయగ్ని యందు నిలువగ తరమౌనె?” అని అంటూ

11 వ పద్యంలో ఆవేదన చెందినారు.

యముడి బాధకన్న నధికమ్ము గద నిందఅని అంటూ 21 వ పద్యంలో వాపోయారు.

        మనం చేసే పనులను బట్టి తిరిగి ఫలితం లభిస్తుంది అని

పనిని బట్టి తిరిగి ఫలిత ముండును గదా!అని అంటూ 12 వ పద్యంలో హితవు పలికినారు.

      కరుణతో పేదలను కాపాడు అని

కరుణ జూపి వాని కనులు తుడ్చుము దేవ!అని అంటూ 14 వ పద్యంలో పవనపుత్రుని ప్రార్థించారు.

              మంచితనము, కరుణ లేని మానవుడు శవంతో సమానము అని

మనిషి గాడు అతడు మాటాడు శవమేనుఅని అంటూ 18 వ పద్యంలో నిష్ఠూరమాడినారు.

       మంచిని పంచే మానవులు కొందరే అని

మంచి నట్లు పంచు మనుషులు కొందరేఅని అంటూ 27 వ పద్యంలో స్పష్టం చేశారు.

     గుడి బయట భిక్షాటన చేస్తున్న నిరుపేదలకు సహాయం చేయి. సముద్రానికి నీళ్లను ఇవ్వడం వృథా అని

గుడి బయలున నిలిచె గ్రుడ్డిఁ జూడు

నీటి నివ్వ నేమి నిండు సంద్రమునకు

అని అంటూ 31 వ పద్యంలో ఉపదేశం చేశారు.

        కుల మతాల చిచ్చు కాలకూట విషం కంటే భయంకరంగా ఉన్నది అని

కనగ కులము మతము కాలకూటవిషముఅని 32 వ పద్యంలో విశదీకరించారు.

       ఇంటి భవిత యంత యిల్లాలి మీదుండుఅని 38 వ పద్యంలో తెలియజేసిన కవిగారు ఆ ఇల్లాలిని కట్న కానుకలకోసం కష్టపెట్టే వాడు భర్త అనే పదానికి తగడు అని

ఒగుడు గాక వాడు మొగు డనంగనురాదు

అనిఅంటూ 82 వ పద్యంలో పరుషపదాలతో విశ్లేషించారు.

       ప్రస్తుత రాజకీయ నాయకులలో ధర్మాన్ని వెదకడం వృథా అని తెలుపుతూ

రవిని వెదికి నటుల రాతిరి సమయానఅని అంటూ 89 వ పద్యంలో వివరించినారు.

           ఓ ఆంజనేయ స్వామీ! మేము సుఖంగా ఉన్నామంటే అది మీ దయాఫలం. మేము కష్టంలో ఉన్నామంటే అది మా కర్మఫలం అని

సుఖము యేది కలుగ చూపు మీదే స్వామిఅని అంటూ 99 వ పద్యంలో తన దైవభక్తిని ప్రకటించారు.

       రూపము ధనము లేకున్నా ముఖంలో బాధను వ్యక్తం చేయకుండా, ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఆనందయోగంలో ఉండగలగడమే ఉత్తమం అని

హాసముంటె చాలు నంద మదేగదా!అని అంటూ 100 వ పద్యంలో అందరికీ హితాన్ని ఉపదేశించారు. ఈ విధంగా తన పవనపుత్ర శతకాన్ని పూర్తిచేసిన శ్రీ నాయుడుగారి జయన్న గారు ధన్యులు.

       ముఖపరిచయం కూడా లేని నేను వ్రాసిన రోజుకోపద్యం-శంకరాభరణం అనే గ్రంథంలోని సమస్యాపూరణ పద్యాలలో 100 పద్యాలకు, శ్రీ సీతారామకల్యాణం అనే గ్రంథంలోని పద్యాలలో ఇప్పటికి 200 పద్యాలకు ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వీడియో చిత్రీకరణ చేసి తన రామభక్తిని ప్రకటించుకొన్న శ్రీ నాయుడుగారి జయన్న కవివర్యులు ధన్యాత్ములు.

 

        శ్రీ నాయుడుగారి జయన్న గారికి 5-4-1975 తేదిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మీదేవి, శ్రీ గోపాలు నాయుడు దంపతులు ధన్యాత్ములు. శ్రీ జయన్న గారి జన్మస్థలం జల్లాపూర్, మానోపాడు మండలం, జోగులాంబ గద్వాల జిల్లా ధన్యమైనవి. పెంచిన తల్లిదండ్రులు శ్రీమతి శంకరమ్మ, శ్రీ గుండ్లకొండ నడిపి శేషన్న కృతార్థులు. ఎం. ఏ, బి. ఇడి విద్యార్హతలతో ఉత్తమ ఉపాధ్యాయుడుగా వృత్తి ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తూ, ప్రవృత్తి పరంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని సమర్థవంతంగా నడుపుతూ, దృక్కోణం (వ్యాససంపుటి) రచించి ముద్రించి, నడిగడ్డ (దీర్ఘకవిత), శ్రీ గడియారం రామకృష్ణశర్మ జీవితం-వ్యక్తిత్వం, కథలు, వచన కవితలు మొదలైన ఎన్నో రచనలను చేసి సమాజ శ్రేయస్సును కాంక్షించే మీ కలంనుండి ఇంకా ఎన్నో ఉత్తమ రచనలు వెలువడాలని, మీకు పరిపూర్ణంగా దైవానుగ్రహం సదా కలగాలని ఆకాంక్షిస్తున్నాను.

          శ్రీ నాయుడుగారి జయన్న కవివరా! సహధర్మచారిణి శ్రీమతి రామేశ్వరి గారు మీకు తోడుగా నీడగా ఉండగా, పుత్రికారత్నములు గౌతమి, ఆద్య సుగుణమణులై మహదానందమును కలిగించుచుండగా, శ్రీరామదూతయైన పవనపుత్రుడు మీకు ఆయురారోగ్య భోగభాగ్యములను అక్షయకీర్తి సంపదలను కలిగింపగా సమాజసేవలో యథాశక్తి తరిస్తూ నిండునూరేండ్లు వర్ధిల్లుదువు గాక! శ్రీరామజయం.

                                                                                                   శుభాశీస్సులతో

14-1-2025,                                                                                     భవదీయుడు

కోవూరు, నెల్లూరు జిల్లా.                                                               అవధాని కోట రాజశేఖర్

                                                                                          విశ్రాంత సంస్కృతోపన్యాసకులు                                                                                      

                                                                                               

 

దృక్కోణం - ముందుమాట

 

దృక్కోణంలోని మనోవీచికలు

 

     మిత్రులు నాయుడు గారి జయన్న రాసిన దృక్కోణంలో  21 వ్యాసాలు ఉన్నాయి. వీటిని వ్యాసాలు అనడం కన్నా వారి దృక్కోణంలోని మనోవీచికలు అనడం సబబు. ఈ వ్యాసాల్లో సమగ్రత, విశాల దృష్టి కనిపిస్తుంది. ముఖ్యంగా తాను నివసిస్తున్న పరిసర ప్రాంతాలలోని కవులు ప్రచురించిన కవితా సంకలనాల్ని పరిచయం చేశారు. కొన్ని కథలు తులనాత్మకంగా పరిశీలించారు. గద్వాల్జాతర కథా సంకలనాన్ని సమీక్షించారు. ఇంకా సాహిత్య భావనలను, సాహిత్యకారుల అభిలాషల్ని పరామర్శించారు.

          గద్వాల, అలంపూరు తాలూకాల ప్రాంతాన్ని నడిగడ్డ అని అలా పిలుస్తారు. ఈ ప్రాంతాలలోని నవల, కవిత్వ చరిత్రను సమగ్రంగా విశ్లేషించారు. నిజానికి ఈ రెండు వ్యాసాలు పరిశోధనాత్మకమైనవి. నవలలోని కథల్ని, కథా నిర్మాణాన్ని, కథా నేపథ్యాల్ని వివరించగల శక్తి జయన్న సంతరించుకున్నారు. అలాగే కవిత్వ చరిత్రను కూడా సమగ్రంగానే వివరించారు. కవిత్వ నేపథ్యపు చరిత్ర వివరించి ఉంటే ఇంకా బాగుండేది. ఈ వ్యాస సంకలనంలో గద్వాల సంస్థానం – సాహిత్య పోషణ అను వ్యాసం ఉన్నది. ఈ వ్యాసంలో జయన్నకు స్థానిక గద్వాల సంస్థానం పట్ల అవ్యాజమైన అనురాగం, ప్రేమ కనిపిస్తుంది. వీటి ప్రవాహంలో ఈ వ్యాసంలో కొంత విశ్లేషణ కొరవడింది. ఆయా రాజుల కాలంలో జరిగిన సాహిత్య కృషిని గొప్పగా వివరించారు. ఈ చరిత్ర ఈనాటి సాహిత్యకారులకు తెలియవలసిన అవసరం గుర్తించారు. అందుకే క్లుప్తంగా నైనా ఆయా రాజుల కాలంలోని సాహిత్య కృషిని పరిచయం చేశారు. నిజానికి కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన కవుల నేపథ్యాన్ని వివరించాల్సి ఉండింది. బ్రిటిష్ కాలంలో అక్కడ సంస్థానాలు పల్చబడి పోవటం, కవులకు, కళాకారులకు ఆదరణ తగ్గిపోవడం వలన వారంతా ఆనాటి నైజాం పరిపాలనలోని సంస్థానాలలోకి బాట పట్టారు. ఆ విధంగా వచ్చిన కవులలో విశ్వనాథ, జాషువా వంటి ఉద్దండ పండితులు, కవులు, అక్కినేని నాగేశ్వరరావు వంటి కళాకారులు ఈ సంస్థాన సత్కారాన్ని పొందిన వాళ్లే. స్థానిక చరిత్ర తెలుసుకోకపోతే రచయితకు గానీ, పాఠకులకు గాని  భవిష్యత్తులో వర్తమానం అవగాహన కాదు. కాబట్టి ఈ వ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. జయన్న గారికి కేవలం కవిత్వం, కథ, చరిత్ర మీద ప్రేమనే కాకుండా ఈనాటి వాగ్గేయకారులపై కూడా మమకారం ఉంది. పల్లె కన్నీరు పెడుతుందో/ కనిపించని కుట్రల అన్న గేయం ప్రసిద్ధమైనది. ఈ గేయ రచయిత గోరటి వెంకన్నను, ఆయన గేయాల్ని జయన్న విశ్లేషించగలిగారు. అలాగే ఇంకా చరిత్ర గమనించని వాగ్గేయకారుడు కొండన్నను విశ్లేషించడం గమనించదగ్గది.

        ఈ వ్యాసాలలో వైవిధ్యం కూడా కనిపిస్తుంది. జయన్న గారు ఉపాధ్యాయులు. విద్యా రంగాన్ని గురించి రాసినటువంటి వ్యాసం ఒకే ఒక్కటి ఉంది. అది రామయ్య పాఠాలు గురించి. ఇందులో విద్యా విధానం ఏ కారణాలవల్ల కుంటుపడుతుందో. పాఠ్యాంశాలు ఏ విధంగా ఉంటే విద్యార్థిలో మనోవికాసం చెందుతుందో వివరించిన తీరును పాఠకులకు పరిచయం చేశారు. ఈ వ్యాసాలు ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి పనికొచ్చేవి. ఇందులో రామయ్య గారు వివరించిన అంశాల్లోని పాక్షికతను విశ్లేషించాల్సి ఉండింది. జయన్న గారు వివాదాస్పద అంశాల వైపు దృష్టి మళ్లించినట్లు లేదు.

   జయన్నలో విశాల దృష్టి ఉంది అని చెప్పడానికి ఈనాడు ఫేస్బుక్లో వస్తున్న కవిత్వాన్ని కూడా గమనిస్తున్నారని చెప్పడానికి ఇందులో ఒక వ్యాసం ఉంది. విమర్శకులైన వారికి చుట్టూ ఏం జరుగుతుందో గమనించే శక్తి కూడా ఉండాలి. ఆ శక్తిని ఆయన కలిగి ఉన్నారు. జయన్న దృష్టి వైశాల్యాన్ని ఈ వ్యాసాలు పట్టిస్తాయి. కవుల బిరుదునామాలను గురించి ఒక వ్యాసం ఉంది. ఈ వ్యాసం సీరియస్ గా గమనించదగింది. రచయితలు, కవులు  బిరుదుల కోసం ఎలా తాపత్రయపడతారో విశ్లేషిస్తాడు. నిజానికి ఇవాళ ప్రతి జిల్లాలో నాలుగైదు సాహితీ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు కవితా సంకలనాలకు, కథా సంకలనాలకు అవార్డులు ప్రకటిస్తున్నాయి. ఈ సందర్భంగా అపాత్ర దానం, అపరిగ్రహం అన్న రెండు భావనలను మనం గుర్తు చేసుకోవాలి. దానం ఇచ్చేవాడు, అలాగే గ్రహించేవాడు కూడా పాత్రులై ఉండాలని భావన. ఈ స్పృహ లేని రచయితలకు, సామాజిక బాధ్యత ఉంటుందని, ఇటువంటి సంస్థలకు ఉత్తమ సాహిత్యాన్ని, ఉత్తమ విలువల్ని ప్రోత్సహించాలన్న తపన ఉంటుందని ఊహించలేము. ఇటువంటి భావనల్ని ఎవర్ని గాయపరచకుండా, అతి సున్నితంగా విశ్లేషించటం జయన్న కుండిన సున్నిత మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. తనకు నచ్చని విషయాన్ని రచయితను గాయపరచకుండా అతి సున్నితంగా అందులోని అనౌచిత్యాన్ని వివరించి, తన మర్యాదను, ఎదుటి వ్యక్తి మర్యాదను నిలబెడతారు.

ఈ వ్యాసాల్లో శైలి చాలా అందంగా ఉంది. అన్వయ కాఠిన్యం లేదు. సూటిదనం ఉంది. రచయితల మీద రాసిన వ్యాసాల కంటే స్వతంత్ర వ్యాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇతని ప్రతిపాదనలు, అభిప్రాయాలు గమనించదగ్గవి, గౌరవించదగ్గవి. ఈయనకు విమర్శనా బలం, విశ్లేషణాశక్తి రెండు ఉన్నాయి. లేనిదంతా నిరంతరం రాయకపోవడమే. నడిగడ్డ ప్రాంతం నుండి ఒక మంచి విమర్శకుడిగా, విశ్లేషకుడిగా ఎదగదగిన హంగులన్ని ఇతనిలో ఉన్నాయి.

 

ఇతనిలో ఒక ఆలోచన పరుడు ఉన్నాడని, ఆ ఆలోచనలకు ఒక శాస్త్రీయత ఉందని ఒక విశ్వాసం, భరోసా ఈ వ్యాసాలు అందిస్తున్నాయి. ఇంతకంటే కావలసింది ఏముంది?  నడిగడ్డ ప్రాంతం నుంచి ఒక గొప్ప విమర్శకుడు ముందుకొస్తున్నాడని అభినందిస్తున్నా. ప్రస్తుతానికి ఇంతకంటే ఏం చెప్పినా అది పొగడ్తవుతుందని నా భావన.


-        కె. నాగేశ్వరాచారి

కథకులు, విమర్శకులు

కర్నూలు

03-12-2024

పవనపుత్ర శతకం

 

 పవనపుత్ర శతకం 

         రచన : నాయుడు గారి జయన్న

   ప్రథమ ముద్రణ: ఫిబ్రవరి, 2025

                     పేజీలు: 48

                         వెల  :  రూ. 50/- లు.


ఆవిష్కరణ ఆహ్వానవీడియో

ఆవిష్కరణ చిత్రాలు

పుస్తకపరిచయ సభ ఆహ్వానం

అవధాని శ్రీకోట రాజశేఖర్ గారి ముందుమాట

లాయర్ పత్రికలో సమీక్ష

డా. చీమకుర్తి వేంకటేశ్వరరావు గారి సమీక్ష

ఎం.డి. ఉస్మాన్ గారి సమీక్ష

దృక్కోణం

 

     దృక్కోణం (సాహిత్య విమర్శావ్యాసాలు)

         రచన : నాయుడు గారి జయన్న

   ప్రథమ ముద్రణ: డిసెంబర్, 2024

                     పేజీలు: 104

                         వెల  :  రూ. 150/- లు.

 


                   @   దృక్కోణం - ముందుమాట

               @  ఆవిష్కరణ ఆహ్వానపత్రం 

               @   ఆవిష్కరణ వార్తావిశేషాలు

               @  ఆంధ్రజ్యోతిలో దృక్కోణం





ప్రస్తావన

       నేను చేయి తిరిగిన సమీక్షకుడిని కాను, చలం చెప్పి నట్లు సాహిత్యాన్ని తూచే తూకపు రాళ్ళు నాతోనూ లేవు. కాకపొతే ఇవన్నీ నాకు ఇష్టమైన పుస్తకాలు. నేను చదివిన పుస్తకాలు. వాటిపై నాకు కలిగిన అభిప్రాయాలు అంతే. నచ్చిన పుస్తకాలు వెతుక్కోవడం, వీలున్నప్పుడల్లా చదువుకోవడం, చదువు తున్నపుడు కలిగిన స్పందనలను రాసి పెట్టుకోవడం  ఒక అలవాటు . అట్లా రాసి పెట్టినవే ఈ వ్యాసాలు. ఇష్టమైన కవులు, రచయితలు, గాయకులపై రాసిన వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో కొన్ని ఉపాధ్యాయుల మాస పత్రికల్లో, దిన పత్రికల సాహితీ పేజీల్లో, వెబ్ మేగజైన్లలో, నా బ్లాగ్ లో ప్రచురించినవి ఉన్నాయి. మరి కొన్ని ఆ పుస్తకాలకు ముందు మాటలుగా రాసినవి కూడా ఉన్నాయి.  అన్ని కలిపి ఒక పుస్తకంగా తీసుకొస్తే బాగుంటుందన్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ పుస్తకం.  చదివి ఆదరిస్తారని ఆశిస్తూ...

                                                                                             - నాయుడు గారి జయన్న

 

విషయ సూచిక  

 

 

1.      పాలమూరు నేలలో పూసిన రేలపూతలు 

2.      తెలంగాణకై కత్తి నూరిన నూరు తెలంగాణ నానీలు

3.      కరువు జిల్లానే కాదు కవుల జిల్లా కూడా

4.      కాల్వ మింగిన ఊరు

5.      గద్వాల సంస్థానం – సాహిత్య పోషణ

6.      సామాన్యుడి బతుకు జెండాలో అశోక చక్రం - మట్టిగంప

7.      విద్యారంగానికి దిక్సూచి- రామయ్య పాఠాలు

8.      కొత్త సాహిత్య ప్రక్రియలు వద్దా?

9.      మసక కన్నుల్ని వెలిగించే నిప్పురవ్వ - మెర్సీ కవిత్వం

10.  సప్త వర్ణ సమ్మిళితం - యశస్వి తెల్ల కాగితం

11.  ప్రకృతిచ్చిన  పాటగాడు

12.  ఆంధ్ర సాహిత్యములో బిరుదనామములు

13.  ఇక్బాల్ కవిత్వం ఒక విప్లవ సేద్యం

14.  జీవితానుభవ సారం అవనిశ్రీ కవిత్వం

15.  అక్షరాగ్నికణం  అలిశెట్టి

16.  కొన్ని ఆయుధాలు... కొన్ని కన్నీళ్లు...

17.  అవనిశ్రీ – ఆపతి

18.  నడిగడ్డ - నవలా సాహిత్యం

19.  జోగులాంబ గద్వాల జిల్లా – వచన కవిత్వం

20.  నడిగడ్డ చరిత్రే గద్వాల్జాతర

21. నేనూ, గొరుసు, గజఈతరాలు

                                              ---***---


 

నా పుస్తకాలు






         1. దృక్కోణం 

(సాహిత్య విమర్శా వ్యాసాలు) -            డిసెంబర్,2024




2. పవనపుత్ర శతకం -           ఫిబ్రవరి, 2025

20, మే 2025, మంగళవారం

పవనపుత్ర శతకం - వెనుక మాట

                                                                      పవనపుత్ర శతకం - వెనుక మాట                                                                               

                                                        -ఎం.డి. ఉస్మాన్, 
                                                   ఎస్.ఏ. (ఆంగ్లం), నల్గొండ 


వెనుకమాట. వినడానికి ఎబ్బెట్టుగా ఉంది కదా! నాకు కూడా అలానే అనిపించింది. కానీ it's a spontaneous word that arose in my mind immediately after reading the poetry. Moreover the great poet William Wordsworth said that "poetry is a spontaneous overflow of poets emotions", like wise, I got this word spontaneously. కాబట్టి ఈ పదాన్ని వాడా..! మన జయన్న  కూడా ఈ శతకంలో అన్నారు "వచన కవిత యనుచు వంత వద్దు" అని, కాబట్టి నేను కరెక్టే... అని నా భావన. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది అదేమంటే "ముందుమాట" రాసే అవకాశం, అదృష్టం నాకు రాదేమో ఎందుకంటే అది అంత అలవోక కాదు మరియు నేను అంత అర్హుడిని కూడా కాదు.


జయన్న శతకం మొదటి పద్యం చదవగానే , వేమన శతకం కోసం google లో చూడాలనిపించింది శతకానికి కూడా invocation ఉంటుందా అని? A great English poet Milton the "Paradise Lost" (an epic)  ప్రారంభంలో అంటాడు.. "I invoke Thy aid to my adventurous song"అని. మన జయన్న గారు కూడా తన శతక ప్రారంభంలో " దీన కవికి తమ దీవెనలొసుగుము" అన్న మాటలు తనప్రభు భక్తికి వినమ్రతకు నిదర్శనం. 


ఇక పద్యాల విషయానికొస్తే... బాగున్నాయి... చాలా బాగున్నాయి.... అద్భుతంగా ఉన్నాయి... ఇలా ఏమన్నా, మీ పదాలను, పద్యాలను తక్కువ చేసినట్లు అవుతుందేమో. ఎందుకంటే those are not simply words.. those are your deepest thoughts which were adorned with grammar and syntax.

"సిరుల కంటే విద్య గొప్పదనే" విషయాన్ని మీరు వర్ణించిన తీరు అద్వితీయం."ఎదుటివాడి గుణము నెంచవలదు" కూడా బాగా నచ్చింది ఎందుకంటే మనకు నచ్చనిది ఎదుటివారికి కూడా నచ్చకపోతే దాని గురించి చర్చిస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. గురువులను గౌరవించడానికి రెండు చేతులు ఉంటే చాలు అన్న మాట, అక్షలారా నిజము . "కడుపు నిండిన వాడి మాట కడుపు మండిన వాడి మాట"ల మధ్య వ్యత్యాసం బాగా వర్ణించారు. 


 "I know your simplicity and sensibility." "యముడి బాధ కన్నా నదికమ్ముగదనింద".. చదవగానే మీతో నేను గడిపిన రోజులలో చూసిన మీ వ్యక్తిత్వం  గుర్తుకు వచ్చింది."కష్టమేది కలుగ కనిపించదరు మీరు"..

నిజమే.. కష్టాలు వచ్చినప్పుడు మనిషికి దేవుడు గుర్తుకొస్తాడు. ఇది చదివినప్పుడు చిన్నప్పుడు పరీక్షల సమయంలో "మసీదు"కు వెళ్లడం గుర్తుకొచ్చింది. "కులము పేరు చెప్పి బలము పెంచుకొనుచు" ప్రస్తుత పరిస్థితిని ,రాజకీయ నాయకులకు కుస్తీ ని తెలియజేస్తుంది.


"రాతదుడిచి గొప్ప గీత గియ్యవ స్వామి".. as teachers we teach  all the students at  the same valume,  ఎవరెట్లా స్వీకరిస్తారు అనేది వారిపై ఆధారపడి ఉంటుంది in the same way , a mother looks after her all children with the same love and affection, కానీ ఆ సామి అందరి గీతలు ఒకే రకంగా ఎందుకు గీయడో... సమాధానం దొరకని ప్రశ్న. 


"కలల యందు మనకు కానిదేముందిరా" సాధారణ, మధ్యతరగతి ప్రజల ఆలోచనలకు ప్రతిబింబం."చదువుకొనగ రాదు చదువు"కొనగ"వచ్చు.. సరళ పదాలతో నేటి విద్యా దుస్థితి కి అద్దం పడుతుంది. ఇక నేటి రాజకీయ నాయకుల పరిస్థితిపై, రాజకీయ దుస్థితిపై  కవి ఎక్కుపెట్టిన బాణం గురి తప్పలేదు.


నిజమే.."పేద ఇంట ధనము పిసరైనా నిలవదు". ఈ పద్యం ద్వారా పునస్మరణ జరిగింది, కానీ కారణం దొరకలేదు."వాగులన్నీ గలసి వార్థి జేరువిధము" తో పోల్చడం జయన్న గారి సాహిత్య జ్ఞాన పరిపక్వతకు నిదర్శనం."రవిని వెతికినటుల రాతిరి సమయాన" మరొకటి. 


చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్న.. ఈ పుస్తకం ప్రారంభం నుండి చివరి వరకు ఒకే sitting లో చదివా. అంత ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఆలోచనలను రేకెత్తించింది ఈ పుస్తకం. వెనువెంటనే నా అభిప్రాయాన్ని రాస్తూ చదివిన పద్యాలను నెమరు వేసుకుంటున్న.. ఇలాంటి మరెన్నో ప్రతిష్టాత్మక సంకలనాలు మీ కలము వెంట జాలువారాలని మనసారా కోరుకుంటున్న..

                                                                                                                      -ఎం.డి. ఉస్మాన్,                     

                             ఎస్.ఏ. (ఆంగ్లం), నల్గొండ 

19, మే 2025, సోమవారం

పెద్ద దిన్నె - శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానము చరిత్ర

 పెద్ద దిన్నె - శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానము చరిత్ర

పరిశోధకులు - రచయిత

  ఊర ఈశ్వర్ రెడ్డి

కోవెల దిన్నె గ్రామము



ఓం నమో వేంకటేశాయ


ప్రార్థన

1.

శ్రీనివాస భక్త!శ్రితజనపరిపాల

ఆదిదేవనీకు!పాదసేవ

మదినిసల్పుదెపుడు!మరువకనేవేళ

వేగబ్రోవరావె! వేంకటేశ!


 2.

నీదుమహిమదెల్ప!నిఖిలలోకంబుల

సజ్జనులుగమార్చ!సన్నుతాంగ

కోరివెలసితీవు!కొంగుబంగారమై

పెద్దదిన్నెలోన!ప్రేమతోడ!


3.

గొంతుతెరచినిన్ను!గోవిందయనిపిల్వ

కూడిబాధలెల్ల!గూల్చినావు

నీదుమహిమనెన్న!నేనెంతవాడను

నిఖిలలోకరక్ష!నీరజాక్ష!


4. 

వేలవందనములు!విశ్వంభరానీకు

సాధుజననృపాల!సన్నుతింతు

దీనబంధుయింక!దిక్కెవ్వరికమాకు

జాగుచేయనేల!వేగరమ్ము!


5.

సీ,మా.

కరుణాలవాలనీ!కరుణజూపవదేమి

కానివాడననీకు!కమలనయన

అరవింద లోచనా!ఆశ్రితపరపాల

 యింతైనదయరాద!ఏలనీకు                         

సాగరంబనెడుయీ!సంసారచక్రంబు

దాటించరాగదే!దనుజవైరి

కష్టాలు కడతేర్చు!కల్పవృక్షమనీవు

దీవించి నాబాధ!దీర్చవేమి

దీనబాంధవనాకు!దిక్కునీవేయంటి!

వేగబ్రోవగరావె!వేంకటేశ 

ఎన్నికష్టములైన!యిష్టంబుగానిన్ను

భక్తితోపూజించు!శక్తి నిమ్ము


నీపాదపద్మముల్!నిరతంబుసేవించు

భాగ్యమ్మునొసగుమా!భవ్యచరిత

కలనైననీరూపు!కనులజూతమటన్న

కనిపించరావునా!కర్మయేమొ

కోరనునినునేను!కోట్లధనమ్మును

వరమివ్వుచేయనీ!పాదసేవ 

పలుమార్లునినునేను!ప్రార్థించిననుగాని

పలుకవేనామీద!పంతమేమొ


అఙ్ఞానినైనేను!యంధకారమునున్న

దిక్కుజూపగనాకు!దివ్వెనీవె

ఎన్నిజన్మలకైన!నిన్నువీడనునేను

దిక్కునేవేయంటి!దీనబంధు!


తే,గీ

భక్తజనపోష ఆశ్రిత పక్షపోష

విశ్వ కల్యాణ గిరిధరా వేంకటేశ

పరమ కారుణ్య జగదీశ పాపనాశ

పుడమి పెద్దదిన్నేగ్రామ! పురనివాస!


ఓం నమో వేంకటేశాయ


శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానము*చరిత్ర

  పెద్ద దిన్నె గ్రామము


శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే ఈగ్రామంలో సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం ఒక గొల్ల భక్తుడు ఉండే వాడట.

అతడు గోవుల గాచి జీవించే వాడట అలా ఉండగా ఒకరోజు స్వామి వారు కలలో కనిపించి నేను నీ ఆవుల పాలు త్రాగి జీవిస్తున్నాను. నేను మీ ఊరి పొలిమేరల్లోని కోట్ల బావి దగ్గర భూమిలో ఏ పూజ పునస్కారాలు లేక పడి ఉన్నాను నన్ను వెలికితీసి గ్రామంలో ప్రతిష్ఠ చేయమని చెప్పారట స్వామి వారు.   ఏదైనా గ్రామ ప్రజలకు చెప్పబోతే వెఱ్ఱి గొల్ల వాడు అని హేళన చేసేవారు .అయితే రానురాను అతడి ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు ఎర్పడి అతడు  నమ్మకం కుదిరింది.

అలా కొద్ది రోజుల తరువాత గ్రామము లోని పెద్దలయిన వెంకోబా గారికి తెలియజేయగా వారు కొందరు గ్రామస్థులు కలిసి ఆ గొల్ల భక్తుని పిలుచుకొని పొలిమేర లోని కోట్ల బావి దగ్గరకు వెళ్ళి ఆ భక్తుడు చూపిన చోట తవ్వి చూడగా దొరికిన ఆ వేంకటేశ్వర స్వామి విగ్రహం తెచ్చి అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని ఆ ఆలయ ప్రధాన కార్య నిర్వాహకులైన శ్రీ జయసింహయ్య గారి ద్వారా తెలిసింది.


అయితే అప్పటికి కేవలం గర్భగుడి మాత్రమే కట్టించి

నారు అలా కొంత కాలం తరువాత గద్వాల సంస్థానాధీశులైన రాజా పెద్ద సోమభాపాల్ దొర గారిని కలిసి సంప్రదించగా వారు ఒప్పుకుని దేవాలయం చుట్టూ ప్రహరీగోడ ముఖ మంటపం ఆ ముఖ మంటపంపై ముందు భాగాన ఆ యాదవ భక్తుని రూపం శిలా విగ్రహం చెక్కించి పెట్టడం జరిగింది అదేవిధంగా ముందు విమాన గోపురం దాని ముందు రెండు ఎత్తైన శిలా దీపస్తంభాలను మరియు ఒక ద్వజస్తంభాన్నీ కూడా ప్రతిష్ఠించడం జరిగింది.

అంతేకాకుండా ఆ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య సేవా కైంకర్యానికై సుమారు 480 ఎకరాల ఇనాం భూమిని కూడా సంస్థానాధీశులు సమర్పించడం జరిగింది.

అదేవిధంగా గ్రామంలోని శివాలయానికి కూడా70 ఎకరాల భూమిని సమర్పించినట్లు తెలిసింది

ఆ విధంగా గ్రామంలో అన్ని వృత్తుల వారు నేటికీ సేవలు చేస్తూనే ఉన్నారు.బ్రాహ్మణులు మరియు

శ్రీ వైష్ణవులు అర్చకులు తంబలి మంగలి వారు వాయిద్య కారులు అలాగే పోలీస్ రెడ్డి గారి ఇంటి నుండి పూర్ణ కుంభము తీసుకెళ్ళడం ఇలా రకరకాలుగా కురువ గొల్ల కమ్మరి కుమ్మరి సాలె గాండ్ల హరిజన అన్ని కులాల వారు స్వామి కైంకర్యంలో పునీతులౌతున్నారు.


ఇంత మొత్తం ఇనాం భూమి గల దేవస్థానం అలంపూర్ తాలుకాలో మరే గ్రామములోను లేదనేది నిస్సందేహం.

అయితే నాటినుండి అనగా దేవాలయం స్థాపించి నప్పటి నుండి ఇప్పటి వరకు నిరాటంకంగా స్వామి వారికి సేవలు జరుగుతూనే ఉన్నాయి.

అయితే ఈ ఆలయ సంరక్షణ ప్రతిష్టాపకులైనటువంటి వెంకోబా గారి కుటుంబీకులే చూసుకుంటున్నారు.

సుమారు 1840 నుండి1888 వరకు శ్రీ వెంకోబా గారు తరువాత1888నుండి 1935 వరకు శ్రీ రాఘప్ప గారు 1935 నుండి1941 వరకు శ్రీ వెంకోబా గారు1941నుండి1954 వరకు శ్రీ బలరామప్ప గారు అప్పటి నుండి శ్రీ బద్రి నారాయణ రావు గారు దినదినాభివృద్ధికై అలుపెరుగని పోరాటం సాగించారనేది నిర్వివాదాంశం.

అయితే ఈ గ్రామము గుండా రైలు మార్గము ఉన్నప్పటికీ ఈగ్రామంలో రైల్వే స్టేషను లేకుండేది అయితే రైల్వేస్టేషన్ కూడా

శ్రీ బద్రి నారాయణ రావు గారు ఏర్పాటు చేయించారనేది నాకు 20 సం"రాల వయసు ఉన్నప్పుడే తెలిసింది మాది వడ్డేపల్లి మండలం లోని కోవెల దిన్నె గ్రామము

మా ఊరికి పెద్ద దిన్నె గ్రామానికి బంధుత్వం కూడా ఉండడం వల్ల కొన్ని విషయాలు తెలుసు.

అదీకాక  2000 సం:ము నుండి మా గురువు గారైన శ్రీ బ్రహ్మయ్యాచార్యులు 

పోలీసు పటేల్ చిన్న సల్వారెడ్డి గారు అయిదు సెంట్ల స్థలం దానమివ్వగా అక్కడ శ్రీ నిర్భయానంద స్వామి ఆశ్రమం ఏర్పాటు చేయగా అప్పటి నుండి మేము అక్కడికి వస్తూ పోతూ ఉండడం వల్ల పై విషయాలన్నీ మాకు శ్రీ జయసింహయ్య ద్వారా తెలిశాయి.

అయితే ఇక్కడ విచారకరమైనదేమిటంటే ఆ యాదవ భక్తుని పేరు తెలియరాలేదు. అయితే ఆ స్వామి ప్రతిష్ఠకు మూల పురుషుడు యాదవ భక్తుడు అన్నది గ్రామస్థులకందరకు తెలుసన్నది జగద్వితము.

ఇకపోతే ఈ సంవత్సరం అనగా2022 లో దేవాదాయశాఖ శాఖ వారు గ్రామస్థులు 9లక్షల రూపాయలు డిపాజిట్ చేయగా రూ 36/-ల రూపాయలు దేవాదాయశాఖ వారు సర్వశ్రేయోనిధినుండి విరాళంగా ఇవ్వడం జరిగింది ఆ డబ్బుతో చుట్టూ ఉన్న కాంపౌండ్ మరమ్మత్తు చేయించి దానికానుకొని లోపల భాగాన సత్రాలు వినూత్నమైన రీతిలో నిర్మించి ధ్వజస్తంభం నూతనంగా తయారు చేసి 

ఎంతో వైభవంగా నిర్వహించారు గ్రామంలో

అన్ని కులాల వారు ప్రముఖంగా రెడ్ల కుటుంబాలు ధర్మకర్తలైనటువంటి జయసింహయ్య కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ దేవాలయాన్ని దినదినాభివృద్ధిగా తీర్చిదిద్దుతున్నారనేది నిర్వివాదాంశం.

స్వామి వారి సేవా విశేషాలు

ప్రతిరోజూ ఉదయం బిందెసేవ సాయంత్రం దివిటీ సేవ క్రమం తప్పకుండా జరగడం ఒక విశేషం. ప్రతి సంవత్సరం పుష్య శుద్ధ దశమి రోజున జాతర జరుగుతుంది ఆరోజు రథోత్సవం మొదలు కొని ఐదు ప్రధాన వరకు పాంచరాత్రాగమ సాంప్రదాయ పద్ధతిలో సేవలు జరగడం ఒక నియమం. అదేవిధంగా గ్రామంలో ఇంతకు ముందు యాదవ భక్తుని ఇల్లు ఉండేదట.స్వామి వారు అక్కడకు తీసుకు వెళ్ళమని కోరగా అక్కడ దశమి కట్ట కట్టించి స్వామి వారిని పల్లకిలో ఊరేగించి అక్కడ దించి పూజచేసి తిరిగి దేవాలయానికి తీసుకు రావడం ఇప్పటి వరకు అదే ఆనవాయితీగా వస్తోంది అదేవిధంగా ప్రతి నెల శ్రవణా నక్షత్రం రోజున స్వామి కల్యాణం ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. ఇంకొక విశేషమేమంటే వేంకటేశ్వర స్వామి దేవాలయం అయినప్పటికీ యాదవ భక్తుని వల్ల ప్రతిష్ఠ జరిగినందుకు గోకులాష్టమి రోజున ఉట్లు కొట్టే జాతర కూడా జరుగుతుంది. అయితే ఆ భక్తునికి స్వామి వారు ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకో అని అడుగగా ఆ యాదవ భక్తుడు నాకేమి వద్దు నీవు నాయింటికి వస్తే చాలు అన్నాడని అందుకు స్వామి కోపోద్రిక్తుడై నీ వంశం విఫలమౌగాక అని అన్నాడని అందుకు భయపడి వారి వంశస్థులు ఊరు వదిలి  కర్నూలు జిల్లా లోనిపోలుకల్లు గ్రామము కొందరు పెద్ద నాగటూరు గ్రామము కొందరు వలస పోయారని వారి వంశస్థులు తెలిపిన విషయం. ఇకపోతే ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆ రెండు గ్రామాల నుండి వారు ఇక్కడికి వచ్చి పుట్టు వెంట్రుకలను తీయించడం జాతరకు రావడం పశువులు ఈనిన నెయ్యిని తెచ్చి స్వామి వారికి సమర్పించిన తరువాతనే వారు తినడం ఆనవాయితీగా వస్తున్నదని పెళ్ళిళ్ళు చేసినా కొత్త జంట ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకుంటారని వారి ద్వారా తెలిసిన విషయము నేను ఇక్కడ ఉటంకించడం జరిగింది.

ఈవిధంగా ఈ దేవాలయ ప్రాశస్త్యాన్ని పదిమందికి తెలియజేసేలా అవకాశం కలిగి నందుకు నా అదృష్టంగా భావిస్తూ స్వామి వారి పాదపద్మాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ స్వామి వారి కృపా కటాక్షములు కోరుకుంటూ ముగిస్తున్నాను.


          ఇట్లు

      పరిశోధకులు

    ఊర ఈశ్వర్ రెడ్డి

కోవెల దిన్నె గ్రామము

వడ్డేపల్లి మండలం

జోగులాంబ గద్వాల జిల్లా

చరవాణి -7981497017