17, ఏప్రిల్ 2016, ఆదివారం

తృప్తీ దేశాయ్

తృప్తీ దేశాయ్  మహారాష్ట్రలో లంచగొండితనం, స్త్రీల అసమానత, గృహహింస, అధికార దుర్వినియోగం మొదలగు సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్న సామాజిక ఉద్యమకర్త. పదవ తరగతిలోనే సామాజిక సమస్యలపై పోరాటం మొదలుపెట్టిన ఆమె, ఇటీవల శనిసింగణాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశం ఉదంతంతో మరింత వెలుగులోకి వచ్చింది. తృప్తీ దేశాయ్ కుటుంబం మహారాష్ట్రలో సరిహద్దు ప్రాంతమైన నిపానీలో ఉండేవారు. దేశాయ్ ఎనిమిదేళ్ళ వయసులో కుటుంబం పుణెకు తరలివచ్చింది.

సామాజిక ఉద్యమ ప్రస్థానం
తృప్తీ పదవ తరగతి చదువుతున్నప్పుడే 'క్రాంతివీర్ జోప్దీ వికాస్ సంఘ్ ' కలిసి మురికి వాడల్లో ప్రజల స్థితిగతుల మెరుగై పాటుపడింది. వారికందాల్సిన నిత్యావసరాల సరుకులు దళారుల పాలు కాకుండా చూసింది. పేదలకు ఉపాధి అవకాశాలు దక్కేలా వారికి వివిధ అంశాలలో నైపుణ్య శిక్షణను ఇప్పించింది. తృప్తీ శ్రీమతినాథ్ బాయి దామోదర్ థాకర్సే మహిళా విశ్వవిద్యాలయంలో హోం సైన్స్ విద్యార్థిగా ఉన్న సమయంలో, అజిత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ దివాళా తీసింది. దాంతో ముప్పై ఐదు వేల మంది ఖాతాదారుల జీవితాలు రోడ్డున పడ్డాయి. 20 ఏళ్ళ యువకురాలైన తృప్తీ ఖాతాదారుల పక్షం వహించి ఉద్యమించింది. చంపుతామని ఆమెకు హెచ్చరికలు వచ్చాయి. కాని వాటిని లెక్క చేయకుండా పోరాడింది. ఆమె పోరాటం ఫలించి ఇరవై తొమ్మిది వేల మంది ఖాతాదారులు తిరిగి తమ సొమ్మును తాము దక్కించుకోగలిగారు. 2015 నవంబర్ 29 వ తేదిన అహ్మద్ నగర్ లోని శనిసింగణాపూర్లో ఓ మహిళ 400 ఏళ్ళనాటి ఆచారాన్ని కాదని ఒక దేవాలయంలోకి ప్రవేశించి ఆలయంలోని ప్రధాన విగ్రహాన్ని పూజించడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై ఆమె ఉద్యమించి, హైకోర్టు సహాయంతో నాలుగు వందల మందితో కలిసి ఆలయ ప్రవేశం చేసింది. కొల్హాపూర్ ఆలయంలోకి స్త్రీలు చీరతోనే ప్రవేశించాలన్న నియమాన్ని నిరసిస్తూ, కమీజ్‌తో ప్రవేశించడానికి ప్రయత్నించి, స్థానికుల దాడిలో గాయపడింది. ఆస్పత్రిలో చేరింది. అయినా ఉద్యమాన్ని ఆపనని ప్రకటించింది.
;భూమాత బ్రిగేడ్: ఏ కులంలో పుట్టినా స్త్రీకి సమానత్వం తప్పని సరి అన్న లక్ష్యంగా 40 మంది సభ్యులతో మహారాష్ట్రలో 'భూమాత బ్రిగేడ్ ' సంస్థను స్థాపించింది. దీనిద్వారానే లంచగొండితనం, రైతు ఆత్మహత్యల నివారణ, అధికార దుర్వినియోగం మరికొన్ని సామాజిక సమస్యలపై పోరాడుతుంది. ప్రస్తుతం ఆ సంస్థలో నాలుగు వేల మంది సభ్యలు ఉన్నారు.
 విమర్శలు 

అజిత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ దివాళా తీసిన సందర్భంలో ఆమె ఉద్యమించడానికి కారణం రాజకీయాలలో చేరాలనుకోవడమేనని విమర్శలు వచ్చాయి. అది నిజమేనేమోననుకొనేలా ఆమె ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. ఓ జాతీయ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేశారు కూడా. ఆ ఎన్నికలలో ఓటమి చవిచూసిన తృప్తీ దేశాయ్ తన లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి రాజకీయాలు ఆటంకంగా మారడాన్ని గమనించి వాటికి దూరం జరిగింది. అనేక హిందూ సంస్థలు ఆమె కార్యకలాపాలను తీవ్రంగా దుయ్యబట్టాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి