25, జనవరి 2015, ఆదివారం

నా యాత్రానుభవాలు-5, బేలూరు

                                                                                                                                                 హోస్పేట్,
                                                                                                                                                13.10.2013.

     మా యాత్రలో బాగంగా, నేను, నా మిత్రులు బషీర్, గిరి హంపిని సందర్షించి ఆ రాత్రి హోస్పేట్‌కు చేరుకున్నాం. బస్టాండ్‌కు దగ్గరలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో భొజనాలు కానిచ్చి, బస్టాండ్‌కు వచ్చాం. మా మిత్రుడు గిరికి ఇంటి నుండి పిలుపు రావడం వలన, మాకు వీడ్కోలు పలికి గద్వాల దారి పట్టాడు. నేను, బషీర్ ఆ రాత్రి 11 గం.లకు బేలూరుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. చిక్మగ్లూర్ వెళ్లే బస్సెక్కాం. అర్ధరాత్రి  దాటాకా చిక్మగ్లూర్లో బస్సు మారి, బేలూరుకు ప్రయాణమయ్యాం. మరుసటి రోజు సూర్యోదయానికి ముందే బేలూరు చేరుకున్నాం.
                                                                                                                                           బేలూరు ,
                                                                                                                                          14.10.2013.
    బేలూరును  పూర్వం  వేలా పురీ అనే వారు. క్రమంగా వేలూరుగా చివరికి  బేలూరు గా మారింది. ఇది యాగాచి నది ఒడ్డున ఉన్న ఓ చిన్న పట్టణం. హాసన్ జిల్లాలో జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. బేలూరు ఒకనాడు హొయసల రాజుల రాజధాని. 
     బస్టాండ్ నుండి కాలి నడకన గుడి వైపు వెళ్ళాం. అల్లంత దూరం నుండే గుడి గోపురం స్వాగతం పలుకుతున్నటుగా కనిపించింది. గుడి బయట సత్రాల్లో స్నాదికాలు కానిచ్చి, గుల్లోకి వెళ్లాం.   ఆలయ రాజగోపురం బహు సుందరమైనది. గుడి హొయసలులు నిర్మించినదే అయినా రాజగోపురాన్ని విజయనగర రాజులు నిర్మిచారు.  రాజగోపురం దాటి లోపలికి వెళ్తే, ఎదురుగా మధ్యలో చేన్నకేశావాలయం  ఉంది. ఇది తూర్పుకు అభిముఖంగా ఉంది. గోపురానికి కుడివైపు పుష్కరిణి, కేశవాలయానికి చుట్టూ  రంగనాయకి ,కప్పే చేన్నగరాయ ఆలయాలు ఉన్నవి. చెన్నకేశవాలయంలో రోజూ పూజాదికాలు నిర్వహిస్తారు.  ఇక్కడ  ఆంజనేయస్వామి, నరసింహస్వామి విగ్రహాలను చూడవచ్చు.  ఆలయ ప్రవేశ మార్గం దగ్గర హొయసలుల రాజముద్ర కనిపిస్తుంది
          ఇక్కడి ప్రధాన దైవం చెన్నకేశవుడు.  ఇతనిని విజయ నారాయణుడు అని కూడా అంటారు. స్వామి వారి దర్శనం చేసుకున్నాం. ఇక్కడి స్వామి ముక్కుకు ముక్కెరతలపై పూలు ఉండటం విశేషం. అందుకే ఇక్కడి వారు స్వామిని మోహిని అవతారంగా భావిస్తారు.  స్వామి  నాలుగు హస్తాలతో శంకు ,చక్ర గద ,పద్మాలతో  మనోహరంగా దర్శనం ఇస్తాడు. .విగ్రహం పై భాగాన చుట్టూ దశావతారాలు అతి సూక్ష్మం గా చెక్కబడి ఉన్నాయి.  లోపల కళా సంపదతో విలసిల్లె స్తంభాలు న్నాయి .గోడలలో గాలి, వెలుతురు లోపలికి రావాటానికి వీలుగా నక్షత్రం ఆకారపు ఖాళీలను చెక్కారు. దర్శనానంతరం గుడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలించాం. ఆ శిల్పాలు, వాటి కళాత్మక  సౌందర్యం చెప్పనలవికానిది. ఈ ఆలయం ఎత్తైన పీఠంపై నిర్మిచబడింది. ఈ పీఠాన్ని జగతి వేదిక అంటారు. ఆలయ ప్రదిక్షణకు వీలుగా  ఉంటుంది. హోయసల రాజు విష్ణువర్ధనుడి కాలంలో ఈ  ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది.  హోయసల అనగా సింహాన్ని ఒంటి చేతితో చంపినవాడు అని అర్థమట. ఆ పని చేసినవాడు వీరి వంశమూలపురుషుడు సాలుడు. ఆ వంశస్తులకు అదే పేరుగా స్థిరపడిపోయింది. హోయసలులు చాళుక్య ,చోళ, పాండ్యలను  ఓడించి హోయసల సామ్రాజ్యాన్ని విస్తరించారువీరిలో విష్ణు వర్ధన మహారాజు చాళుక్యులను ఓడించి సామ్రాజ్య సుస్థిరతకు బాట వేశాడు.  క్రీ.శ. 1117లో పశ్చిమ చాళక్యులపై విజయ సూచికగా ఈ ఆలయాన్ని నిర్మిచినట్లు తెలుస్తుంది. చోళులపై తాలకాడ్ యుద్దవిజయంగా నిర్మిచినట్లు మరికొన్ని ఆధారాలు ఉన్నాయి. వైష్ణవ మత ప్రాశస్త్య ప్రచారానికై జగద్గురు రామానుజాచార్యుల ప్రబోధానుసారం నిర్మించాడని మరో వాదన కూడా ఉంది.

ఈ ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఈ ఆలయాన్ని సబ్బురాతి(Chloritic Schist )తో నిర్మించారు. ఇది తేలిక అకుపచ్చ రంగులో ఉంటుంది.   ఈ శిల సబ్బు వలె అతి మెత్తగా ఉండి, కావలసిన తీరుగా మలచడానికి అనువుగా ఉంటుదట. అందుకే ఈ దేవాలయంపై గల శిల్పాలు అతి సూక్ష్మంగా ఉండి, అద్భుత సౌందర్యంతో అలరారుతాయి. దేవాలయ గోడలపై, పై కప్పు భాగంలో, వివిధ రకాలైన పక్షులు, జంతువులు, లతలు, వివిధ భంగిమలలోని నర్తకిల శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఆకట్టుకుంటాయి. దర్పణ సుందరి, భస్మ మోహిని అనునవి చెప్పుకోదగిన  ఆకర్షణీయ శిల్పాలలో  కొన్ని.
ప్రధాన ఆలయం అయిన చెన్న కేశవ స్వామి ఆలయానికి దక్షిణాన కప్పే చెన్నగ రాయావిగ్రహాన్ని  హొయసాల రాజు విష్ణువర్ధనుడి పెద్ద భార్య, గొప్ప నర్తకి అయిన  రాణి శాంతలా దేవి ప్రతిష్టించింది .దీన్నే కప్పు చెన్న  కేశవ ఆలయం అంటారు   ఈ ఆలయానికి ఈ పేరు రావటానికి వెనుక  ఓ జానపద గాథ ఉంది.  ప్రసిద్ధ శిల్పి జక్కనా చార్యుడు తన స్వగ్రామం కైదల నుంచి ఇక్కడికి వచ్చాడు .అతని కుమారుడు దంకనా చార్యుడు తండ్రిని వెతుక్కొంటూ ఇక్కడికి వచ్చాడు .ఒకరికొకరు తెలియదు .జక్కన చెన్న కేశవ విగ్రహం చెక్కాడు  .కొడుకు ఆ శిల్పంలో  లోపం ఉందన్నాడు. లేదని వాదించాడు తండ్రి. లోపం చూపిస్తే కుడి చేయి నరుక్కుంటానని శపథం చేశాడు . విగ్రహానికి  నీళ్ళతో కలిసిన గంధం పట్టించారు. గంధం అంతా యిట్టె ఆరిపోయి బొడ్డు దగ్గర మాత్రం ఆర లేదు. అక్కడ ఒక ఖాళీ కనిపించింది . అందులో ప్రాణం తో వున్న  ఒక  కప్ప బయట పడింది. ఇచ్చిన మాటకు నిలబడి జక్కనా చార్యుడు  చేయి నరుక్కున్నాడు. అందుకనే ఈ విగ్రహాన్ని కప్ప చెన్నగ రాయ అంటారు .దేవుడు కలలో కన్పించి స్వగ్రామ రమ్మన్నాడట .తండ్రి కొడుకులు అక్కడికి చేరి భగవంతుని ఆజ్ఞగా చెన్న కేశవ ఆలయాన్ని కట్టారు .జక్కన చేయి మళ్ళీ తిరిగి వచ్చిందట. .ఆలయం బయట  నలభై రెండడుగుల  ధ్వజస్తంభం ఉంది. దీని  విశేషమేమిటంటే  ఈ స్తంభం ఓక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది.  రాజగోపురానికి కుడివైపు పుష్కరిణి ఉంది.  నేటికీ భక్తులు  ఉపయోగిస్తుంటారు. హొయసల శైలి కట్టడాలకు ఈ ఆలయం ఓ మచ్చుతునక. హోయసలుల శిల్పకళారీతులకు కాణాచిగా పేరొందిన బేలూరు ఆలయ శిల్ప సౌందర్యాన్ని మనసు నిండా నింపుకొని, బయటకు వచ్చాం. గుడికి దగ్గరలోని ఓ టిఫిన్ సెంటర్‌లో  టిఫిన్ చేసి హాళేబీడు వైపు బయలు దేరాం.








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి