17, ఏప్రిల్ 2016, ఆదివారం

తృప్తీ దేశాయ్

తృప్తీ దేశాయ్  మహారాష్ట్రలో లంచగొండితనం, స్త్రీల అసమానత, గృహహింస, అధికార దుర్వినియోగం మొదలగు సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్న సామాజిక ఉద్యమకర్త. పదవ తరగతిలోనే సామాజిక సమస్యలపై పోరాటం మొదలుపెట్టిన ఆమె, ఇటీవల శనిసింగణాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశం ఉదంతంతో మరింత వెలుగులోకి వచ్చింది. తృప్తీ దేశాయ్ కుటుంబం మహారాష్ట్రలో సరిహద్దు ప్రాంతమైన నిపానీలో ఉండేవారు. దేశాయ్ ఎనిమిదేళ్ళ వయసులో కుటుంబం పుణెకు తరలివచ్చింది.

సామాజిక ఉద్యమ ప్రస్థానం
తృప్తీ పదవ తరగతి చదువుతున్నప్పుడే 'క్రాంతివీర్ జోప్దీ వికాస్ సంఘ్ ' కలిసి మురికి వాడల్లో ప్రజల స్థితిగతుల మెరుగై పాటుపడింది. వారికందాల్సిన నిత్యావసరాల సరుకులు దళారుల పాలు కాకుండా చూసింది. పేదలకు ఉపాధి అవకాశాలు దక్కేలా వారికి వివిధ అంశాలలో నైపుణ్య శిక్షణను ఇప్పించింది. తృప్తీ శ్రీమతినాథ్ బాయి దామోదర్ థాకర్సే మహిళా విశ్వవిద్యాలయంలో హోం సైన్స్ విద్యార్థిగా ఉన్న సమయంలో, అజిత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ దివాళా తీసింది. దాంతో ముప్పై ఐదు వేల మంది ఖాతాదారుల జీవితాలు రోడ్డున పడ్డాయి. 20 ఏళ్ళ యువకురాలైన తృప్తీ ఖాతాదారుల పక్షం వహించి ఉద్యమించింది. చంపుతామని ఆమెకు హెచ్చరికలు వచ్చాయి. కాని వాటిని లెక్క చేయకుండా పోరాడింది. ఆమె పోరాటం ఫలించి ఇరవై తొమ్మిది వేల మంది ఖాతాదారులు తిరిగి తమ సొమ్మును తాము దక్కించుకోగలిగారు. 2015 నవంబర్ 29 వ తేదిన అహ్మద్ నగర్ లోని శనిసింగణాపూర్లో ఓ మహిళ 400 ఏళ్ళనాటి ఆచారాన్ని కాదని ఒక దేవాలయంలోకి ప్రవేశించి ఆలయంలోని ప్రధాన విగ్రహాన్ని పూజించడం వివాదాస్పదమైంది. ఈ అంశంపై ఆమె ఉద్యమించి, హైకోర్టు సహాయంతో నాలుగు వందల మందితో కలిసి ఆలయ ప్రవేశం చేసింది. కొల్హాపూర్ ఆలయంలోకి స్త్రీలు చీరతోనే ప్రవేశించాలన్న నియమాన్ని నిరసిస్తూ, కమీజ్‌తో ప్రవేశించడానికి ప్రయత్నించి, స్థానికుల దాడిలో గాయపడింది. ఆస్పత్రిలో చేరింది. అయినా ఉద్యమాన్ని ఆపనని ప్రకటించింది.
;భూమాత బ్రిగేడ్: ఏ కులంలో పుట్టినా స్త్రీకి సమానత్వం తప్పని సరి అన్న లక్ష్యంగా 40 మంది సభ్యులతో మహారాష్ట్రలో 'భూమాత బ్రిగేడ్ ' సంస్థను స్థాపించింది. దీనిద్వారానే లంచగొండితనం, రైతు ఆత్మహత్యల నివారణ, అధికార దుర్వినియోగం మరికొన్ని సామాజిక సమస్యలపై పోరాడుతుంది. ప్రస్తుతం ఆ సంస్థలో నాలుగు వేల మంది సభ్యలు ఉన్నారు.
 విమర్శలు 

అజిత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ దివాళా తీసిన సందర్భంలో ఆమె ఉద్యమించడానికి కారణం రాజకీయాలలో చేరాలనుకోవడమేనని విమర్శలు వచ్చాయి. అది నిజమేనేమోననుకొనేలా ఆమె ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించారు. ఓ జాతీయ పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేశారు కూడా. ఆ ఎన్నికలలో ఓటమి చవిచూసిన తృప్తీ దేశాయ్ తన లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి రాజకీయాలు ఆటంకంగా మారడాన్ని గమనించి వాటికి దూరం జరిగింది. అనేక హిందూ సంస్థలు ఆమె కార్యకలాపాలను తీవ్రంగా దుయ్యబట్టాయి.

2, ఏప్రిల్ 2016, శనివారం

హల్‌ధార్ నాగ్

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని చెప్పటానికి చక్కటి ఉదాహరణ హల్‌ధార్ నాగ్. అతి సాధారణ జీవితం నుండి విశ్వ విద్యాలయ విద్యార్థులు తన రచనలపై పరిశోధనలు చేసే స్థాయికి ఎదిగిన కృషీవలుడు.  పశ్చిమ ఒడిశా ప్రాంతానికి చెందిన హాల్దార్ నాగ్  కోస్లి భాషాకవి. 1950లో ఒడిశాలోని బార్‌గఢ్ జిల్లాలో జన్మించాడు. పదేళ్ళ వయసులోనే తండ్రి మరణించాడు. దానితో చదువు ఆగిపోయింది. మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగాడు. చదువుకు స్వస్తి చెప్పిన పిదప ఓ మిఠాయి దుకాణంలో పాత్రలు కడిగే పనికి కుదిరాడు. ఆ తర్వాత కొద్ది కాలం పాటు ఓ బడిలో వంట పనివాడిగా పనిచేశాడు. అక్కడా కుదురుకోలేకా బ్యాంక్‌లో అప్పు చేసి పుస్తకాల దుకాణం తెరిచాడు. ఆ పుస్తకాల దుకాణమే అతని జీవితాన్ని మార్చి వేసింది.  అతనికి సాహిత్యంపై మక్కువ కలిగేలా చేసింది. ఆవిధంగా సాహిత్య రచనలు  చేయడం ప్రారంభించాడు. ఆయన రాసిన తొలి పద్యం ధోడో బార్‌గజ్ (పెద్ద మర్రిచెట్టు) ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. 1990లో స్థానిక పత్రికలో ఈ రచన ప్రచురించబడింది. ఆ తర్వాత నాగ్ సాహిత్య రచనలో అంచెలంచెలుగా ఎదిగాడు. ఉన్నత స్థితికి చేరుకున్నాడు. ఒడిశాలో 'లోక్‌ కవిరత్న 'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈ కవి రచనలపై విశ్వవిద్యాలయాల్లో ఐదుగురు విద్యార్థులు పి.హెచ్.డి. పట్టా కొరకు సిద్ధాంత గ్రంథాలను సమర్పించారంటే ఎంతటి గొప్ప సాహిత్య కారుడో మనం ఉహించవచ్చు.  అతని సాహిత్య కృషికి గుర్తింపుగా  ఇటీవల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా నాగ్ పద్మశ్రీ పురస్కారాన్ని కుడా  అందుకున్నాడు. ఒడిశాలోని సంబల్ వర్సిటీ హల్‌ధార్ రచనలను గ్రంథబలీ-2 పేరుతో రూపొందించిన విశ్వవ్విద్యాలయ పాఠ్యప్రణాళికలో భాగం చేసింది. తెల్లటి పంచె, బనీను నిత్య వస్త్రధారణగా కలిగి అతి సాధారణ జీవితం గడిపే హల్‌ధార్ నాగ్ ఎందరికో ఆదర్శప్రాయుడు. కవిత్వం గురించి నాగ్ మాట్లాడుతూ...'' నా దృష్టిలో కవిత్వానికి నిజ జీవితంతో సంబంధం ఉండాలి. ప్రజలకు ఓ సందేశాన్ని అందించాలి అంటాడు.''  నిజమే కదా! ఇప్పటి తరం కవులెంత మంది ఈ ప్రాతిపదిక మీద కవిత్వ రాస్తున్నారంటే చెప్పడం కష్టమే.

 

 

11, ఫిబ్రవరి 2016, గురువారం

వీరుడా! హనుమంతూ!


 
 
 
 
 
 

వీరుడా! హనుమంతూ!
నీవు నా కులమన్నా కాకపోతివి

కాక పెట్టి కల్లోలం సృష్టించటానికి
నీది నా మతమన్నా కాకపాయే

ఎదుటి మతంపై విషం విరజిమ్మటానికి

 నీవు నా పార్టీ అయినా కాకపోతివి

మొఖం జూపి మొసలి కన్నీళ్ళు కార్చడానికి
అయినా వీరుడా!

ఎండలో ఎండుతూ

వానలో తడుస్తూ

మంచులో కూరుకపోయి

నా దేశానికి గోడైనావ్!

 నా దేశం కోసం నీ దేహాన్ని

నా ప్రజల కోసం నీ ప్రాణాన్ని

అనాయసంగా అర్పించావు

నీకన్నా వీరుడెవరు?

నిన్ను మించిన ధీరుడెవడు?

అందుకే అందుకో

నా కన్నీళ్ళను నీ కోసం

అక్షరాలుగా అర్పిస్తున్నా

నీ పాదాలను అభిషేకిస్తున్నా

జై జవాన్! జై జై జవాన్!!

 
-నాయుడుగారి జయన్న

 

12, డిసెంబర్ 2015, శనివారం

మరుగున పడుతున్న మన ఆటలు - పులి జూదం

పులి జూదం అనునది విశేష ఆదరణ గల ఒక గ్రామీణ క్రీడ. ఇది చదరంగం వలె ఆడు ఆట. ఒకనాడు పల్లెల్లో మేధావి తనానికి నిరూపణగా ఆటను ఆడేవారు. గ్రామీణ ప్రాంతాలలో, విరామ సమయాలలో నేటికీ ఆటను ఆడటాన్ని చూడవచ్చు. గ్రామ కూడలిలో, రచ్చబండ దగ్గరో, మరో చెట్టుకిందో, దేవాలయపు కట్టల మీదో, ఇంటి అరుగుల మీదో, ఎక్కడో ఒక ఇద్దరు కూర్చోవడానికి వీలుగా ఉండే ప్రాంతంలోనైనా ఆట ఆడుతూ పల్లెల్లో జనాలు కనిపిస్తారు.
1:3 పులి జూదం
ఆట ఆడుటకు కావలసినవి...
1. పులి జూదం చిత్రం
2. నాలుగు గచ్చకాయలు.
3. పద్దెనిమిది చింత బిచ్చలు.
    పులి జూదం చిత్రం రెండు  అభిముఖ లంబకోణ త్రిభుజాల సమ్మేళనం. దీనిలో రెండు దీర్ఘచతురస్రాలు అడ్డంగా అమరి ఉంటాయి(విశేష ఆదరణ పొందిన 3 వ రకం ఆట గురించి...)  పులి జూదం చిత్రాన్ని కొందరు లావుపాటి అట్ట మీద గీసుకొని ఆడుతారు. ఎక్కువమంది పరిచిన బండలపై పులి జూదం చిత్రాన్ని గీసి, ఆడుతారు. గచ్చకాయలకు, చింత బిచ్చలు(చింతపిచ్చలు) బదులుగా వాటి పరిమాణంలోని రాళ్ళతో కూడా ఆడుతారు. గచ్చకాయలు, చింత బిచ్చల సంఖ్య కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉండటాన్ని గమనించ వచ్చు. గచ్చకాయలను పులులుగా, చింత బిచ్చలను మేకలుగా వ్యవహరిస్తారు.


 ఆటగాళ్ళ సంఖ్య 
ఆట ఇద్దరు మాత్రమే ఆడే వీలు ఉంటుంది. ఇద్దరికి పక్కవాళ్ళు మద్దతుదారులుగా సలహాలు ఇవ్వవచ్చు.

3:15  పులి జూదం
 ఆట నియమాలు 
1.పులి జూదం ఇద్దరు మాత్రమే ఆడాలి.
2. ఆటగాళ్ళలో ఒకరు గచ్చకాయల(పులుల)తో, మరొకరు చింతబిచ్చల(మేకల)తో ఆడాలి.
3. త్రిభుజాకారంలోని మధ్య గీతపై నాలుగు పులులు ముందుగానే పెట్ట బడి ఉంటాయి.

4. ముందుగా మేకలతో ఆడే వ్యక్తి పులలకి అన్ని వైపుల సమీపంలోని బిందువలను వదిలిపెట్టి, తరువాతి బిందువు స్థానంలో ఒక మేకను ఉంచుతాడు.

5. పులలతో ఆడే వ్యక్తి తరువాత ఒక పులిని మేక సమీపానికి దగ్గరలోని బిందువు దగ్గరకు జరుపుతాడు.
మేకలతో ఆడే వ్యక్తి మరో మేకను పులలకు దూరంగా ఇంకో చోట ఉంచుతాడు.

6. ఈ విధంగా 18 (18:4;15:3;1:3)మేకలు అయిపోయెవరకు మేకలతో ఆడేవాడు పెడుతూ పోతే, పులతో  ఆడేవాడు  జరుపుతూ పోతాడు.

7.తదుపరి ఆట రసకందాయకంలో పడుతుంది. పులికి సమీపంలో ఏదేని మేక ఉండి దాని తరువాత బిందువు ఖాలిగా ఉంటే మేకను, పులి చంపుతుంది.
8. ఆవిధంగా మేకలను ఎక్కువగా పులులు చంపుతూ పోతే పులులతో ఆడేవాడు గెలిచినట్లు. పులులు ఎక్కడకు కదలటానికి వీలులేకుండా మేకలతో బందిస్తే మేకలతో ఆడేవాడు గెలిచినట్లు.

4:18 పులి జూదం


పులి జూదం రకాలు

పులి జూదంలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఆటను ఆడే చిత్రాన్ని బట్టి, ఆడే గిల్లల సంఖ్యను బట్టి రకాలు ఉన్నాయి.

) 1 పులి పులి జూదం: ఆడటానికి తక్కువ సమయం ఉన్నప్పుడు ఆటను ఆడుతారు. చాలా తక్కువ సమయంలో ఆట ముగుస్తుంది. మూడు మేకలతో పులిని కట్టడి చేస్తారు. చేయలేకపోతే పులితో ఆడేవారు గెలిచినట్లు. ఆట తెలుగు ప్రాంతాలు అన్ని చోట్లా ఆడిన దాఖాలాలు ఉన్నాయి.

) 3 పులులు పులి జూదం: ఆటను 3 పులులు, 15 మేకలతో ఆడుతారు. ఆటను ఉత్తర సర్కారు జిల్లాలలో ఆడుతారు.

) 4 పులుల పులి జూదం: ఆటలో 4 పులులు, 18 మేకలతో ఆటను ఆడుతారు. ఆట దక్షిణ తెలంగాణాలోను, రాయలసీమలోనూ చూడవచ్చు

ఆట ప్రాచీనత:
  ఆటలు కాకతీయుల కాలం నాటివని తెలియుచున్నది. ( సురవరం ప్రతాప రెడ్డి: ఆంధ్రుల సాంఘీక చరిత్ర, ఓరియంట్ లాఙ్మ్న్ ప్రచురణ, 1996, పుట-130). తరువాత రెడ్డి రాజుల పాలనలో మరింత విస్త్రుతంగా వ్యాప్తిలోకి వచ్చాయి. ప్రజలకు వినోద వ్యాపకాలుగా మారాయి.      

కొరవి గోపరాజు రాసిన సింహాసన ద్వాత్రింశికలో ఒక చోట ...

"తగులు విరివియైన కడుమెచ్చుగ నాడుదు, పులుల మూట, జూదంబులలో మిగులగ నేర్పరి బాగిడి తిగుటన్ సాగటాల నే నతి ప్రౌఢుండన్.(కొరవి గోపరాజు: సింహాసన ద్వాత్రింశిక, రెండవ భాగం, పుట-85./ ఆంధ్రుల  సాంఘీక చరిత్ర, పుట-132 )
  పుస్తకంలో కవి మూడు రకాల పులి జూదములు కలవని గోపరాజు పేర్కొన్నట్టు ప్రతాపరెడ్డి చెప్పాడు.(పుట-132). అవి ఒక పులి జూదం, నాలుగు పులల జూదం. మూదవది స్పస్టంగా పేర్కొనలేదని ప్రతాపరెడ్డి చెప్పాడు. అయితే మూడవ ఆటపై సందిగ్థతలో ఉన్నప్పుడు రెడ్డికి సికింద్రాబాద్లోని మారేడుపల్లి వాసి తాడేపల్లి కృష్ణమూర్తి 3 పులుల ఆటను  సూచించినారు.  
మారుతున్న కాలంలో విడియో గేంస్, సెల్ ఫోన్లతో కాలక్షేపం చేసే పిల్లలకు మరుగున పడుతున్న మన ఆటలను పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. చదరంగానికి విధంగానూ తీసిపోని ఆట పిల్లల ఆలోచనా నైపుణ్యాన్ని పెంచుతుదనుటలో ఎలాంటి సందేహం అక్కర్లేదు


29, నవంబర్ 2015, ఆదివారం

ఒక కాలువ కథ - కన్నీటి వ్యథ


      ఇటిక్యాలపాడు దగ్గర  కాలువ    

  ఇది 44 వ జాతీయ రహదారిపై ఉన్న ఓ ప్రాజెక్టుకు 
సంబంధించిన ప్రధాన కాలువ. ఈ కాలువకు ఉత్తరాన, దక్షిణ భారతదేశంలో రెండవ అతి పెద్ద నది అయిన కృష్ణానది 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంచుమించు అంతే దూరంలో దక్షిణాన  తుంగభద్రానది ప్రవహిస్తుంది.  ఈ ప్రాంతపు అవధి ఉన్నంత మేర రెందు నదులను చుట్టుకొని, నడుముకు జూరాల                                                                                                 
  వడ్డాణం పెట్టుకొని ఈ కాలువ నిర్జీవంగా పడి ఉంది. కంపలతో నిండి ఉంది. 

        ఈ కాలువ ఇప్పుడే కాదు, సరాసరి రెండు దశాబ్దాల సంది ఇలాగే పడి ఉంది. ఇక్కడ ఇదొక్కటే కాదు.  ఈ కాలువ మొదలుకొని, మీరు నిత్యం దర్శించుకోవడానికి వచ్చే అలంపూరు జోగులాంబాదేవి గుడివరకు ఇలాంటివి లెక్కలేనన్ని నిర్జీవమైన కాలువలు మీకు దర్శనమిస్తాయి.
                                                                                                                                                                                ఉండవెల్లి దగ్గర కాలువ

  బతుకంతా ఈ కాలువలది ఇదే పరిస్థితిలా  ఉందే! అని నిర్ఘాంతపడిపోకండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నీళ్ళకై నోళ్ళు తెరిచిన నల్లరేగడి బీళ్ళను, ఒకనాడు మడులుగా చేసి నిండా నీటితో నింపి ముద్దాడిన కాలువలివి. నాటొడ్లతో పచ్చని పైరు చీరలతో కలకలలాడే భూములను చూసి మురిసిన కాలువలివి. గజఈతగాళ్ళమని ఇప్పుడు మీసాలు మెలేసే నడివయసు వాళ్ళకు బాల్యంలో ఈత నేర్పిన కాలువలివి. నీళ్ళ అమ్మకం గురించి, ట్యాంకులు , కొలాయిలు మొదలగు మాటలు పల్లెళ్ళో విని, వినబడని రోజుల్లో ఇక్కడి పల్లెలకు కడుపు నిండా నీటిని తాపిన కాలువలివి. 140 కిలోమీటర్ల దూరం ప్రవహించి, లక్ష ఎకరాలకు నీరందించిన కాలువలు.  అప్పటి కాలువలను చూస్తేనే కడుపు నిండేది. అట్లాంటి కాలువను ఇప్పుడిలా చూస్తూంటే కడుపు మండిపోతుంది. ఈ దారి వెంట వెళ్ళిన ప్రతిసారి జాలితో ఈ కాలువలు, నిస్సహయతతో నేను చూసుకుంటాం. మౌనంగా మాట్లాడుకుంటాం. ఒకరి బాధలనొకరం వెల్లబోసుకుంటాం. ఈ కాలువలను చూసినప్పుడల్లా, ఎంకన్న పెద్ద వాగు పాట, విశ్వం పెన్నేటి పాట గుర్తుకొస్తూనే ఉంటాయి. ఈ కాలువలకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమేమిటి?     

                  భైరాపూర్ దగ్గర కాలువ

            నిజాం రాష్ట్రంలో అప్పటి రాయచూరు జిల్లా అవసరాలను దృష్టిలో ఉంచుకొని తుంగభద్రపై రాజోలిబండ దగ్గర  ఈ కాలువల తల్లి  ప్రాజెక్ట్ గా  పురుడోసుకుంది. తరువాత స్వాతంత్ర్యం సిద్దించటం, నిజాంపాలనా విముక్తి, భాషా ప్రతిపాదికన విశాలంధ్ర అవతరణ ఇవీ పరిణామాలు. రాయచూరు జిల్లాతో  గద్వాల, అలంపూరు తాలుకాలకు సంబంధాలు తెగిపోవడం కర్ణాటకకు ఈ ప్రాంతాలపై శీతకన్నుకు బీజావాపనం తొడిగింది.                                                                                                                         ఇమాంపూర్ దగ్గర కాలువ
      కాలక్రమంలో ఈ ప్రాంతంలో సాగు, తాగు నీటి అవసరాల కొరకు కృష్ణానదిపై జూరాల ప్రాజెక్టు రూపుదిద్దుకొంది. ఈ కాలువలపై గుదిబండ పడింది. చిత్రంగా ఉంది కదూ! నిజమే. క్రమంగా విశాలాంధ్రలో, తుంగబధ్రకు ఆవల, దక్షిణాన ఉన్న వారి పెత్తనం పెరగడం, దేన్నో చూసి ముంతొలక బోసుకున్నట్లు, జూరాలను చూసి, ఈ ప్రాజెక్టుపై ఇక్కడి నాయకులకు క్రమంగా ఉదాసీనత పెరగడం, కర్ణాటక పట్టనితనం ఇక్కడి ప్రాంత ప్రజలకు, కాలువలకు, పొలాలకు శాపంగా పరిణమించింది. కర్ణాటకలో అక్కడి రైతులు తోడేసుకోవలసినవన్ని తోడేసుకున్నాకా, అక్కడి నేలలో మరమ్మత్తులకు నోచుకోని 40 కిలోమీటర్ల పరిధిలో కాలువలను దాటి, తెలుగు ప్రాంతంలో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావలసిన నీరు రానే లేదు. జూరాలా ఆయుకట్టు కిందకైనా ఈ ప్రాంతం చేరనే లేదు. ఇది ఒక విషాదం.         
     అలంపూర్ దగ్గర కాలువ
      ఈ జిల్లాలోని భీమా ప్రాజెక్టు, సరళా సాగర్, కోయిల్ సాగర్, నెట్టెంపాడ్, రంగసముద్రం, రామన్‌పాడ్ వంటి చిన్నచితకా సాగు, తాగు నీటి ప్రాజెక్టులెన్నిటికో ఊపిరిలూదటమే కాకా, పక్కనున్న రంగారెడ్డి,నల్గొండ జిల్లాలనే కాకా, అనంత దూరంలో ఉన్న పాకాల దాకైనా పారే సామర్థ్యమున్న జూరాలకు, గద్దెల మీది నాయకులకు, ప్రాజెక్టు ప్రణాళికలు రచించే ఏసీ గది మేధావులకు..  పక్కన అత్యంత సమీపంలో నిర్జీవంగా, నిస్తేజంగా ఉన్న ఈ కాలువలు,కాలువలకై నోరు తెరిచిన బీళ్ళు, బీళ్ళ మీద ఆధారపడిన బతుకులు కనిపించకపోవడం మరో విషాదం.  

ఇన్నాళ్ళ అంతర్మధనం, అనంత శోష, అఖండ గోష ఇప్పటికైనా చూపించటానికి, వినిపించటానికి కారణం లేకపోలేదు..ఇటీవలే వీటిని మళ్ళీ ఓ సారి చూసి వచ్చి రెండు రోజులన్న గడవకముందే ఓ సంఘటన జరిగింది. .ఈ కాలువల మీద ఆధారపడిన ఓ బతుకు ఊపిరితీసుకోవడానికి ప్రయత్నించి, విఫలమై, చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతుంది. ఇది ప్రారంభమూ కాదూ, ఇదే ఆఖరూ కాకపోవచ్చు కూడా. అందుకే ఇప్పటికైనా నేతలు కళ్ళు తెరువాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ఇక్కడి ప్రజలే తెరుస్తారు-మూడో నేత్రం. ఇక దానికెవ్వడైనా మాడి మసవ్వల్సిందే.    


                                                               బూడ్దిపాడు క్యాంపు దుస్థితి  


                                                                                                       
                                                                            ---నాయుడుగారి జయన్న     
  

6, నవంబర్ 2015, శుక్రవారం

అసహనం

అసహనం! అసహనం!
అసహనం! అసహనం!!

వాణ్ణి చూస్తే వీడికి
వీణ్ణి చూస్తే వాడికి
వీళ్ళను చూస్తే నాకు
నన్ను చూస్తే మీకు
అసహనం! అసహనం!
అసహనం! అసహనం!!

మన కులం
మన మతం
మన ప్రాంతం
మన భాష
మన పార్టీ
మన రంగు
కాకుంటే అసహనం!
కాదంటే దహనం!!

మన మాట కాదంటే
మన బాట రానంటే
అంతులేని అసహనం!
అదుపులేని అసహనం!
అర్థం లేని అసహనం!

నాలో అసహనం
నీలో అసహనం
అందరిలో అసహనం


అసహనం! అసహనం!
అసహనం! అసహనం!!


 అందని కందిపప్పు
తీరని రైతు అప్పు
అన్నార్తుల ఆకలి కేకలు
అభాగ్యుల దరిద్రపు గీతలు
ఎండుతున్న పైరులు
రాలుతున్న రైతులు
నిరుద్యోగుల నిస్పృహలు
అబలలపై ఘోరాలు
నేతల నేరాలు
మూలుగుతున్న నల్లధనం
ముసుగేసిన వైనం
కనపడవా?
వినపడవా?

ఎందుకింత అసహనం?
ఎవరి మీద అసహనం?

తూ తూ అసహనం
చీ చీ అసహనం
పో పో అసహనం
అగుపడకు అసహనం