25, ఏప్రిల్ 2025, శుక్రవారం

ఆధునిక సమాజాన్ని అద్దంలో చూపిన శతకం.


 ఆధునిక సమాజాన్ని అద్దంలో చూపిన భక్తిపూర్వక నివేదన శతకం.                              

          తన మనోభావాలను అక్షరరూపంలో వ్యక్తంచేసి సమాజంలో చైతన్యాన్ని నింపేవాడే నిజమైన  కవిగా పరిగణింపబడతాడు. ఎందరో కవులు వివిధ ప్రక్రియలలో రచనలు చేశారు. కాలం ఎంత మారినా మంచి పునాది గల పద్యరచన ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాజిక దృక్పథంతో భక్తిపూర్వక నివేదనగా పండితపామర ప్రశంసల నందుకొన్న చక్కని గ్రంథం శ్రీ నాయుడుగారి జయన్నగారు రచించిన పవనపుత్ర శతకం.                                         

        ఈ కవి జోగులాంబ గద్వాల జిల్లా జల్లాపురం అను గ్రామంలో శ్రీమతి లక్ష్మీదేవి, శ్రీయుత గోపాలనాయుడు దంపతులకు జన్మించి , పెద్దమ్మ శంకరమ్మ కడ పెరిగి శ్రద్ధా భక్తులతో విద్యనభ్యసించి ఎం.ఏ., బి.యిడి., పట్టాపుచ్చుకొని  ఉత్తమఉపాధ్యాయుడుగా పేరుపొందారు.  దృక్కోణం(వ్యాసములు),నడిగడ్డ(దీర్ఘ కవిత)  వంటి రచనలతో సాహితీ లోకంలో ప్రశంసలు పొందారు. వీరి బాల్యం పెద్దమ్మ గారి ఊరయిన పల్లెపాడులో గడిచింది. ఆ ఊరిలో గల ఆంజనేయస్వామి గుడిప్రాంగణంలో మిత్రబృందంతో తిరిగినందువలనను, కొత్త ఊరిలోను, ఉద్యోగము చేసిన బీచుపల్లిలోను ఆంజనేయుని గుడులు ఉన్నందువల్ల వీరికి ఆంజనేయస్వామిపై భక్తి కుదిరింది. అనంతరకాలంలో తనకు కలిగిన అనుభవాలు , ఆవేదనలూ, సమాజంపట్ల తనకున్న అభిప్రాయాలను ఆంజనేయస్వామికి చెప్పుకోవాలని భావించి చక్కని ఆటవెలది పద్యములతో ఒక శతకాన్ని రచించారు. తను పెరిగిన ఊరిపేరును కలిపి 'పల్లెపాటి వాస పవనపుత్ర ' అనే మకుటంతో ఆ స్వామికి తన భావాలను నివేదించి దీవెనలు కోరుతూ సామాజిక మార్పును అభిలషించారు.                        

          ఈ శతకంలో సామాజిక అంశాలు చక్కగా ప్రస్తావించబడ్డాయి. పేద ధనికులమధ్యగల వ్యత్యాసాలు పేర్కొంటూ ఉన్నవారు లేనివారికి సహాయపడాలని సలహా ఇచ్చారు. కులాలు మతాల పేరుతో నేటి పాలకులు ప్రజలను వంచించి గద్దెనెక్కుతున్నారని, కూటికి లేని వాణ్ణి గమనించడంలేదని బాధపడ్డాడు. చదువు రాని మొద్దులకు రాజకీయం రాచబాట  అయ్యిందని, కాసులున్నవాడు ఏదిచేసినా చెల్లుతూ ఉన్నదని నేటిసమాజాన్ని చూచి బాధపడతాడు.                     

 "కులము పేరు జెప్పి బలము పెంచుకొనుచు            

మతము పేరు జెప్పి మాయజేసి                     

గద్దె నెక్కి కులుకు మొద్దులున్నరు జూడు' అని నివేదిస్తూ,

  

కూడు లేక నొకడు కూలిపోవుచునుండె                  

రాజులాగ నొకడు రాలుచుండె        

రాత దులిపి మంచిగీతగీయవ సామి! (34,35 పద్యాలు) అని పేదలబతుకులనుమార్చుమని స్వామిని అభ్యర్ధించారు.                  

     ఉన్న ఊరును వలె మాతృభాషను గూడ చక్కగా ప్రశంసించారు.                           

అమ్మ పాలలోని కమ్మదనంబును                     

 తేనెకన్న మించు తియ్యదనము                         

తెలుగు బాస గాక దేనిలో నుండురా                            

పల్లె పాటి వాస పవన పుత్ర  (3)      

అని కమ్మగా మాతృభాషయైన తెలుగును   వర్ణించాడు.  

  

 పద్యకవితయైనా, గద్యకవితయైనా సమానంగా ఆదరించాలని కవి పాఠకులకు సందేశమిచ్చాడు.    "పద్యమనుచు కవులు పలుచజేయ వలదు                   

వచన కవిత యనుచు వంత వద్దు                                            

 దేని ఘనత జూడ  దానిదే లోకాన"  అని పద్యగద్యములకు సమాన ప్రాధాన్యత   నిచ్చారు.   

      లోకంలో నేడు మంచివారికంటె చెడ్డవారు అధికంగా ఉన్నారని చెబుతూ మంచినీటికంటె ఉప్పునీరు ఎక్కువగా ఉంటుంది గదా అని దృష్టాంతం తో సమర్థించారు.(4) కోపం గర్వం పనికిరానివని, చింత మనిషిని దహిస్తుందని, త్రాగుడుకు బానిసకావద్దని, బాలల్లో బ్రహ్మ ఉన్నాడని,ధనంకంటె గుణంగొప్పదని వ్యక్తిత్వవికాసలక్షణాలను పేర్కొన్నాడు.                         వ్యావహారిక పదాలను ప్రయోగిస్తూ భాషను సామాన్యజనులకు చేరువజేశాడు. సంపద ఉన్నపుడు భగవంతుడుగుర్తుకురాడని  తెలుపుతూ ఈ సమాజాన్ని మార్చిఅందరినీ చల్లగా చూడు స్వామీ! అని ఆ పవనపుత్రుణ్ణి అభ్యర్థించాడు.                 

      మొత్తమ్మీద ఈ శతకం సమాజహితాన్ని కాంక్షిస్తూ నీతి బోధకంగా అలరారుతూ ఉంది. 

           ఈ గ్రంథమును చదివి, ముందు మాటవ్రాసి, ఆశీర్వదించి,  ముద్రణకు తోడ్పడిన ప్రముఖ పద్యకవులు అవధానులు శ్రీ కోట రాజశేఖర్ గారికి ధన్యవాదములు సమర్పిస్తూ ఈ కవి, భక్తిపూర్వకంగా ఈ కృతిని వారికి అంకితమియ్యడం హర్షించదగ్గ విషయం.

             ఆంజనేయస్వామి వర్ణముఖచిత్రంతో, ఆటవెలది సొగసులతో, అందమైన పలుకుబళ్ళతో ఆకర్షణీయంగా ఉంది. ప్రతి ఒక్కరు దీనిని చదివి, ఆనందించి, ఆచరించగలరని ఆశిస్తున్నాను. 

         రచనలో ఈ కవి మరింత ముందుకు సాగాలని ఆశీర్వదిస్తున్నాను.           


                                                                                              - డాక్టర్ చీమకుర్తి వేంకటేశ్వరరావు,      

                                                                                             విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, నెల్లూరు

పవనపుత్ర శతకంపై డా. చీమకుర్తి సమీక్ష


 నెల్లూరు నుండి వెలువడే లాయర్ వారపత్రికలో నా పవనపుత్ర శతకంపై డా. చీమకుర్తి వేంకటేశ్వరరావు గారి  సమీక్ష.

3, ఏప్రిల్ 2025, గురువారం

వారణాసి నాగేశ్వరాచార్యులు

    వారణాసి నాగేశ్వరాచార్యులు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన శతక కవి. ఇతను 1962 సంవత్సరంలో జన్మించాడు. జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం మల్దకల్ వీరి స్వగ్రామం. తల్లిదండ్రులు సుభద్రమ్మ, వెంకట్రాములు. ప్రస్తుతం గద్వాలలో నివసిస్తున్నారు. 

విద్యాభ్యాసం

బాల్యంలో మల్దకల్ లోని కోమటి జయన్న గారి దగ్గర ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు.   మల్దకల్ ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. అకాడమిక్ చదువు ఏడవ తరగతితోనే ఆగిపోయినా, సాహిత్యం పట్ల, పద్యరచన పట్ల మక్కువతో గద్వాలలోని జయతీర్థాచార్యలు, సీతారామశాస్త్రి, పార్థసారథిశాస్త్రి, వెల్దండ సత్యనారాయణ వంటి పండితుల దగ్గర ఛందస్సు పాఠాలు, పద్యరచన మెలుకువలు నేర్చుకున్నారు. వారి సలహా, సూచనలతో పద్యరచన చేశారు. 

రచనలు 

పలువురి పండితుల శిష్యరికంచే పలు పద్య మెలకువలు నేర్చుకున్న నాగేశ్వరాచార్యులు ఇప్పటి వరకు 6  శతకాలు రాసి ముద్రించారు.


1. శ్రీ మల్దకల్  తిమ్మప్ప శతకం (2015)

2. శ్రీమల్దకల్ రాయుని శతకం (2017) 

3. శ్రీ  జోగులాంబ దేవి శతకం (2019 )

4. శ్రీ మెల్దకంటయ్య శతకం (2022) 

5. శ్రీ సోమనాద్రి శతకం (2023)

6. శ్రీ జములమ్మ శతకం (2024) 


శ్రీ జోగులాంబాదేవి శతకం జూలై 2019 వ సంవత్సరంలో వెలువడింది. కందంలో రాయబడిన ఈ శతకంలో 111 పద్యాలు ఉన్నాయి. ఇందులో మకుటం - జోగులాంబాదేవి 

శ్రీ గణనాథుని మ్రొక్కియు

వేగముగా శారదాంబ వినుతులతోనే 

నీగతి శతకము చేయగా

సాగితిని జోగులాంబ సన్నుతి జేయన్  అను పద్యంతో ఈ శతకం ప్రారంభమవుతుంది.

ఇందులో ఒక పద్యం -

 నీ దయ శుభంబు గూర్చును 

నీ దయ నిత్యము నిల్ప నేర్పరితనమౌను 

నీ దయ నాపై చూపవె 

యాది పరాశక్తి జోగులాంబా దేవి  అని కీర్తిస్తాడు

2022లో వెలువడిన మొల్దకంటయ్య శతకం తేటగీతిలో రాయబడినది. ఈ శతకంలో 113 పద్యాలు ఉన్నాయి. ఇందులో మకుటం -ఘనుడు శ్రీ మల్దకంటయ్య కరుణజూపు. 


ఇందులో ఒక పద్యం-

సత్యభాషణంబులు నిల్పి సాగునపుడు

 భయము లేదు భువిని వైభవంబుగల్గు

 పుణ్యకార్యంబు చేయగా బూని నడువ

ఘనుడు శ్రీ మల్దకంటయ్య కరుణజూపు 

సోమనాద్రి శతకం ఆటవెలదిలో రాయబడినది.   ఈ శతకంలో 111 పద్యాలున్నాయి. భీమ కదనధీర సోమనాద్రి అనునది మకుటం. 

ఇందులో ఒక పద్యం- 

 రాజరాజులెల్ల  రారాజువని నిన్ను 

వేగ పొగడి నారు వినుతి జేసి

గద్ద వ్రాలె కోట ఘనత గొప్పననంగ

 భీమ కదనధీర సోమనాద్రి 


శ్రీ జమ్ములమ్మ శతకం తేటగీతిలో వ్రాయబడిన శతకం. 111 పద్యాలతో కూడిన ఈ శతకంలో శరణు శరణమ్మ మాయమ్మ జమ్ములమ్మ అనునది మకుటం.  ఈ శతకాన్ని తల్లిదండ్రులకు అంకితం ఇస్తూ కవి ఈ పద్యం చెప్పాడు.

జమ్ములమ్మ పేరున చేసి శతక మిద్ది

 పితరులకు నంకితమునిచ్చి ప్రీతితోడ

 గురువు మెప్పును బొందితి  గొప్పగాను

 శరణు శరణమ్మ మాయమ్మ జములమ్మ అంటూ రాసుకు వచ్చారు

ఈ శతకంలోప్రధానంగా  జంతుబలిని నిరసించారు. 


ఇవేకాక ఇతరుల సంపాదకత్వంలో వెలువడిన పలు సంకలనాలలో కూడా  వీరి రచనలు ముద్రితమైనవి.

శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి షష్టిపూర్తి సన్మాన సంచిక, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున వైభవం కవితా సంకలనం, తెలంగాణ జల కవితోత్సవం, జడకందములు, అక్షరార్చన ద్వానాశాస్త్రి సప్తతి పూర్తి, జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర స్వరూపం, ద్వాదశ పుణ్యక్షేత్రాల విశిష్టత, పద్య ప్రభంజనం  మొదలగు సంకలనాలలో వీరి రచనలు ప్రచురితమయ్యాయి.

మూలాలు 

శ్రీ జోగులాంబ దేవి శతకం వారణాసి నాగేశ్వరాచార్యులు శ్రీరామ పబ్లిషర్స్ పాలమూరు, జూలై 2019 

శ్రీ మంద కంటయ్య శతకం మల్దకంటయ్య శతకం వారణాసి నాగేశ్వరాచార్యులు శ్రీ రామ పబ్లిషర్స్ పాలమూరు జూన్ 2022 

శ్రీ సోమనాద్రి శతకం వారణాసి నాగేశ్వరాచార్యులు శ్రీరామ పబ్లిషర్స్ పాలమూరు జనవరి 2023 

శ్రీ జమ్ములమ్మ శతకం వారణాసి నాగేశ్వరాచార్యులు శ్రీరామ పబ్లిషర్స్ పాలమూరు మార్చి 2024

1, ఏప్రిల్ 2025, మంగళవారం

కొత్తకలాలు

కొత్తకలాలు (కవిత్వ సంకలనం) 👈 Download


 భాషా బోధన ప్రధానమైన లక్ష్యాలలో సృజనాత్మకత ఒకటి. విదాార్థులలో దాగున్న సృజనాత్మకతని వెలికితీయడం, పిల్లలని సృజనకారులుగా తీర్చిదిద్దడం భాషోపాధ్యాయుల కర్తవ్యం. పిల్లల సృజనాత్మకతను గుర్తించడానికి, పదును పెట్టడానికి ఉపాధ్యాయుడు కూడా సృజనకారుడై ఉండాలి. ఎప్పటికప్పపడు ఉపాధాాయులు తమ సృజనాత్మకతను అభివృద్ది చేసుకోవాలి. అందులో భాగంగానే మా కాంపెాక్స్ భాషోపాధ్యాయులు తమలోని సృజనాత్మకతకు  అక్షర రూపాన్నిస్తూ,  తొలి ప్రయత్నంగా ఈ కవితల  పుస్తకాన్ని  తీసుకువస్తున్నారు. రానున్న కాలంలో ఇది మరింత విస్తృతమై, పలు కోణాలలోా ఉపాధ్యాయులు తమ సృజనాత్మకతను  వ్యక్తీకరిస్తారని, తద్వారా విద్యార్థులను  సృజనకారులుగా తీర్చిదిద్దగలరని ఆశిస్తూ, అభినందనలు తెలుపుతున్నాను. 

 -కె. పరమేశ్వర్ రెడ్డి,

   కాంపెక్స్ ప్రధానోపాధాాయులు 

31, మార్చి 2025, సోమవారం

మూణ్ణెళ్ళ చదువు

      ఏటికేడు కంటిచూపు మందగిస్తుంది.  గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడమో.  చేతిలో ఫోన్ చూస్తూ గడపడమో దీనికి కారణమవుతుంది. కంటి చూపు మందగించినప్పుడల్లా  కంటిడాక్టర్ని కలవడం, కళ్లద్దాల గాజు మందం సైజు పెంచుకొని కళ్ళకు తగిలించుకోవడం ఇది పరిపాటి అయింది. అందుకని ఈ తతంగం నుంచి కొంతైనా దూరం అవ్వడానికి మళ్లీ పుస్తకాలకు దగ్గర అవడం మేలనిపించింది.  అందుకనే ఈ సంవత్సరం - చదవకుండా ఇంట్లో పోగు పడ్డ పుస్తకాలలో కొన్నైనా చదివేయాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా గడిచిన మూడు నెలల్లో  కింద కనబరిచిన  పుస్తకాలని చదివేశాను.  ఇందులో చదువమని తమ రచనల్ని కానుకగా ఇచ్చిన రచయితల పుస్తకాలు ఉన్నాయి. ఇష్టంతో కొని తెచ్చుకున్న పుస్తకాలు ఉన్నాయి. అవే ఈ జాబితా...

జనవరి , 2025 

1.టిట్ బిట్ (నవల)- రిషిత

2. పెందోట వైభవం (శతక సాహిత్యం, మరికొన్ని పద్యరచనలు) - సం. డాక్టర్ నాగేశ్వరాచారి

3. గుల్మొహర్ (అనువాద కవిత్వం)- వెన్నెల సత్యం

4. వెన్నెలమ్మ శతకం (శతకం) - వెన్నెల సత్యం 

5. సితపుష్ప మాల (ముత్యాల సరాలు) రంగినేని సుబ్రహ్మణ్యం

6. వెన్నెల మణిపూసలు (మణిపూసలు)- వెన్నెల సత్యం 

7. వెన్నెల తొడిగిన రెక్కలు (రెక్కలు)- వెన్నెల సత్యం 

ఫిబ్రవరి 2025

1. నాన్న నానీలు (నానీలు)- వెన్నెల సత్యం 

2. అమ్మ నానీలు (నానీలు) - వెన్నెల సత్యం 

3. సోమనాద్రి శతకం (శతకం)- వారణాసి నాగేశ్వరాచార్యులు

4. ముక్తి పథం (శతకం)- ఊర  ఈశ్వర్ రెడ్డి

5. సుందర రామ శతకం (శతకం) -మేడిచర్ల హరి నాగభూషణం 

మార్చి 2025 

1. ఆరె కటిక మొగ్గలు (మొగ్గలు)- మంగళగిరి శ్రీనివాసులు

2. జమ్ములమ్మ శతకం (శతకం) - మేడిచర్ల హరినాగ భూషణం 

4. బతుకు చెట్టు (వచన కవిత్వం)- వెన్నెల సత్యం

5. స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవహారతి (పద్య కావ్యం)- సం. కోడిహళ్లీ మురళీమోహన్

6. వీరనాగ శతకం (శతకం)- చిక్కొండ్ర రవి 

7. దృశ్యాంతరం (సాహిత్య విమర్శావ్యాసాలు)- డాక్టర్ కే నాగేశ్వరాచారి

18, మార్చి 2025, మంగళవారం

స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి

 


స్వతంత్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని నాటి సమరవీరుల పోరాట తెగువను త్యాగాలను కీర్తిస్తూ, స్మరిస్తూ శతాధిక కవుల పద్యాలతో మూడేళ్ల కిందట వెలువడిన గ్రంథమే స్వాతంత్ర్య భారతికి అమృతోత్సవ హారతి. కవి, రచయిత, అనువాదకులు, వికీపీడియన్ అయిన కోడీహళ్లి మురళీమోహన్ గారు ఈ పుస్తకం సంపాదకులు.  ఈ పుస్తకం ముక్తపదగ్రస్త అలంకారంతో, సీస పద్యాలలో రాయబడినది.  వంద మంది కవుల పద్యాలతో కూడిన సంకలనం తేవాలనుకోవడమే ఒక సాహసం అయితే, అది ముక్త పదగ్రస్త విధానంలో తేవడం మరి సాహసమే.  ఒక కవి ఒక పద్యం రాసి ఇచ్చేదాకా ఎదురు చూసి, ఆ రాసిన పద్యం చివరి పదం ఆధారంగా మరొక కవికి పద్యం ప్రారంభించే పని అప్పగించడం, ఇలా వంద మందికిపైగా కవులకు పని అప్పగించటం, ఆ పని స్వీకరించటం సహనంతో కూడుకున్న పనే.  శ్రమించే తత్వం, సాహిత్య పట్ల మక్కువ లేకపోతే ఇలాంటి రచన వెలువడడం అసాధ్యమే.    ముక్తపదగ్రస్త విధానంలో సాగిన పద్యాల పరంపరలో మరో వైచిత్రి ఏమిటంటే ఏ పదంతో అయితే ఈ పుస్తకంలోని మొదటి పద్యం ప్రారంభమైనదో అదే పదంతో చివరి పద్యం చివరి పదంగా ముగుస్తుంది.  అంటే ముక్తపదగ్రస్తం తిరిగి పునరావృతం కావడం అన్నమాట.  సంపాదకులు గ్రంథాన్నే ముక్తపదగ్రస్తంలో తీసుకొస్తున్నప్పుడు, కనీసం ఒక పద్యాన్నైనా అట్లా రాసి అప్పగించకపోతే ఏం బాగుంటుందని భావించారో ఏమో జొన్నలగడ్డ మార్కండేయులు గారు దాదాభాయ్ నౌరోజీ మీద ముక్తపదగ్రస్త పద్యం రాసి, సంకలనానికి మరింత అందాన్నిచ్చారు. ఒక పద్యాన్ని ఇవ్వడమే కాకుండా ప్రతి పద్యానికి తగిన బొమ్మలను  కోడీహళ్లి ఫణిప్రసన్న కుమార్ గారు అందించటం  ఈ పుస్తకానికి గల మరో అదనపు ఆకర్షణ. పద్యప్రియులకు ఇదో చక్కని బహుమతి.

ఈ పుస్తకం  గురించి సంపాదకులు తన ముందుమాటలో ప్రస్తావిస్తూ... నిత్య స్మరణీయులతో పాటు, విస్మృతిలో పడిన స్వాతంత్ర్య సమరవీరులను వెలుగులోకి తేవడం, ఛందోబద్ద పద్యాలను సజీవంగా నిలుపుకుని భావితరాలకు అందించడం అనే రెండు ప్రధాన బాధ్యతలతో  ఈ పుస్తకాన్ని తెస్తున్నామని, మా ఈ ప్రయత్నాన్ని ఏ కొద్దిమంది మెచ్చినా మా ప్రయత్నం సఫలమైనట్లేనని చెప్పుకొచ్చారు.

 

ప్రతులకు...కోడీహళ్లి మురళీమోహన్ -9701371256