14, జూన్ 2025, శనివారం

ఉమ్మడిశెట్టి లక్ష్మయ్య - తెలుగు తల్లి

 

విద్వాన్ ఉమ్మడిశెట్టి లక్ష్మయ్య రచించిన పద్య కావ్యం తెలుగు తల్లి.  లక్ష్మయ్య కడప జిల్లా కలసపాడు మండలం అక్కివారి పల్లి గ్రామానికి చెందినవారు.  గ్రేడ్ వన్ తెలుగు పండితులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.

 

  ఈ తెలుగు తల్లి పుస్తకంలో  నన్నయ్య నుండి చిన్నయ్య వరకు ప్రాచీన కవుల కవితా సుగుణాలను పొగుడుతూ  ఆధునిక కవులను కూడా ఆరాధిస్తూ వివిధ ఛందస్సులలో పద్యాలను రాసి ఈ కావ్యాన్ని ఉమ్మడిశెట్టి లక్ష్మయ్య రచించారు.

అంతర్జాల యుగములో తెలుగు భాషకు ఆదరణ తగ్గిందని, ఆంగ్ల భాషా ప్రవాహ ఉరవడి ఎక్కువైందన్న  బాధతో  తెలుగు వారికి తెలుగు గొప్పదనాన్ని ప్రబోధిస్తూ కవి ఈ తెలుగు తల్లిని రచించారు.

ఈ కావ్యంలో ‌కవి ముందు వివిధ దేవతా ప్రార్థనలతో ప్రారంభం చేసి, తెలుగు కవులందరినీ  స్మరిస్తూ ఈ కావ్యాన్ని రచించాడు.

"శబ్దశాసనుండు లబ్ధ యశుండయ్యె

ఆంధ్ర భారతమ్ము  నల్లె మొదట

ఆదికవి యటంచు ఆరాధ్యుడయ్యెను

అక్షరముల రమ్య తలర గూర్చి "   అంటూ నన్నయ్యను కీర్తించాడు. 

ఈ వరుసలో నారాయణ భట్టు, భీమకవి, తిక్కన, ఎర్రన,   పోతన, శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులు,వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన మొదలగు ప్రాచీన కవులందరినీ కీర్తిస్తూ పద్యాలు రాశారు.

పదకవులను, అవధానులను ప్రవచన కారులను కూడా కీర్తిస్తూ ఇందులో పద్యాలను రాశారు. 

ఈ పుస్తకం అనుబంధంలో 'గండికోట గత ఘన వైభవం' పేరుతో గండికోట చరిత్రను కీర్తిస్తూ మరికొన్ని పద్యాలు ఉన్నాయి.  పద్య ప్రియులు చదువు దగ్గ పుస్తకం.

ప్రతులకు:

ఉమ్మడిశెట్టి లక్ష్మీదేవి -  99 854 920 49 , 9581774649

4, జూన్ 2025, బుధవారం

ఏప్రిల్, మే నెలల్లో చదివిన పుస్తకాలు

 ఏప్రిల్ 2025 లో చదివిన పుస్తకాలు 

1. చెన్నకేశవ శతకం - ఊర ఈశ్వర్ రెడ్డి 

2. గడ్డి పూలు (పిల్లల కవితలు)- సంపాదకుడు వెన్నెల సత్యం 

3. స్వప్న వీణ (మణిపూసలు) - వెన్నెల సత్యం 

4. వాసంతిక (గజళ్ళు) - వెన్నెల సత్యం 

5. జోగులాంబ దేవి శతకం - వారణాసి నాగేశ్వరరావు చారి 

6. పూలరేకులు (హైకూలు) - పొట్లూరి మోహన రామపసాద్

7. నీ ప్రేమ సాక్షిగా (మొగ్గలు) - పోలే వెంకటయ్య 

8. శ్రీ జమ్ములమ్మ శతకం - వారణాసి నాగేశ్వరాచారి 

9. మల్దకంటయ్య శతకం - వారణాసి నాగేశ్వరాచారి 


మే 2025 లో చదివిన పుస్తకాలు 

1. ఎర్రమల్లెలు (నవల)-  రోజా రాణి దాసరి 

2. మెమరీస్ ఆఫ్ మంగలిపల్లి (కథలు)- నరేష్ కుమార్ సూఫీ 

3. కశ్పి (వచన కవితలు)-  అవుసుల భాను ప్రకాష్ 

4. రేగడి విత్తులు (నవల) - చంద్రలత 

5. ట్రెండింగ్ పద్యాలు (శతకం) - అవుసుల భాను ప్రకాష్


22, మే 2025, గురువారం

సమాజహితకారకం-పవనపుత్ర శతకం

 

సమాజహితకారకం-పవనపుత్ర శతకం 

           సహృదయులు, ఉత్తమోపాధ్యాయులు, ధర్మపరులు, పరోపకారపరులు, దైవభక్తిపరులు, కవివరులు అగు శ్రీ నాయుడు గారి జయన్న గారు ప్రస్తుతం పవనపుత్ర శతకాన్ని సామాజిక అంశాలతో ఆటవెలది పద్యాలలో రమణీయంగా రచించి పద్యశతకకర్తగా కూడా కీర్తిని గడించారు.

          శతకం అంటే వంద పద్యాలతో ఉండే గ్రంథం. ప్రతిపద్యం ఒక ముక్తకంగా ఉంటుంది. పద్యాలకు అన్నింటికీ చివర ఒక పదం గానీ లేక కొన్ని పదాలు గానీ మకుటంగా ఉండటం శతక పద్యాలలో ఉండే నియమం. ఈ నియమాలను అనుసరించి రచింపబడిన ఈ పవనపుత్ర శతకం శ్రీ పవనకుమార….” అని దైవప్రార్థనతో ప్రారంభించబడింది. నేను కవిత చెప్పలేను…..” అని వినయంగా విన్నవించుకొంటూ, పవనపుత్రుడైన ఆంజనేయస్వామివారి దీవెనలను కోరుకోవడం ద్వారా శ్రీ జయన్న కవిగారు తన వినయాన్ని, హనుమద్భక్తిని ప్రకటించుకోవడం ఒక విశేషం. 

         ఈ శతకంలో జయన్న గారు ప్రధానంగా సామాజిక అంశాలను ప్రస్తావించారు. ధర్మమార్గాన్ని అనుసరిస్తూ ఉన్న తాను లోకం పోకడను చూచి ఆవేదనను వ్యక్తం చేశారు. సమాజ సంక్షేమాన్ని కోరుకొన్నారు. ప్రతియొక్కరూ తాము ఉన్న స్థితినుండి ఉన్నతస్థితికి చేరుకొనేందుకు యథాశక్తి ప్రయత్నం చేసేందుకోసం కొన్ని సూచనలను తమ పద్యాల ద్వారా తెలియజేశారు.  శ్రీ జయన్న గారి పద్యాలను చదువుతూ ఉంటే పాఠకులకు వేమన పద్యాలు తప్పనిసరిగా గుర్తుకు వస్తాయి.

       వేమన మహాకవి తాను రచించిన ఆటవెలది పద్యాలలో ఒకటవ, రెండవ పాదాలలో లోకస్థితిని వివరించి, మూడవపాదంలో పైపాదాలలో చెప్పిన విషయమునకు సంబంధించిన ఒక సామెత వంటి సూక్తిని తెలియజేసి, నాలుగవ పాదంలో మకుటాన్ని ఉంచి లోకప్రసిద్ధిని పొందినారు.

          శ్రీ జయన్న గారి పద్యరచన కూడా తేట తెలుగులో, అలతి అలతి పదాలతో ఉంటూ వేమన పద్య ధోరణిని కలిగి యుండడాన్ని మనం గమనించవచ్చు. 

     ఉదాహరణలు

                 వేమన పద్యం-

తల్లిదండ్రలందు దయలేని పుత్రుండు

పుట్టనేమి వాడు గిట్టనేమి

పుట్టలోన చెదలు పుట్టవా? గిట్టవా?

విశ్వదాభిరామ వినుర వేమ!

 

               జయన్న పద్యం-

తాను యెదుగు వరకు తల్లిదండ్రులు మేలు

యెరుక రారు వార లెదుగగానె

తలపగ నిటువంటి తనయులు భారమే

పల్లెపాటివాస! పవనపుత్ర!                  (62 వ పద్యం)

 

               జయన్న పద్యం -

వక్రబుద్ధి నీయ వద్దు తండ్రీ నాకు

మాట బడుదు నేను మంది చేత

మాట బడుట కన్న మరణంబె మేలుగా

పల్లెపాటివాస! పవనపుత్ర!             (92 వ పద్యం)

 

ఓ పవనపుత్రా!

కోరికలే లేని మనసును కానుకగా ఇయ్యవయ్యా! అని

కాంక్ష లేని మనసు కానుకగా నివ్వుఅని అంటూ 44 వ పద్యంలో కోరుకొన్న శ్రీ జయన్న కవి,  సిరి సంపదలను నాకు ఇవ్వవద్దు. విద్యను మాత్రం ప్రసాదించవయ్యా! చాలు అని 7 వ పద్యంలో

విద్య నొకటి నాకు విడువుమయా దయన్అని అర్థించారు.

        కామము క్రోధము లోభము అనే దుర్గుణాలకు వశమాపోయినవాడు మంచి మనిషి కాలేడు. అందువలన కరుణతో ఆ దుర్గుణాలను కాల్చివేయి అని

కరుణ జూపి వాటి కాల్చివేయుము తండ్రిఅని అంటూ 45 వ పద్యంలో ఆంజనేయస్వామిని ప్రార్థించారు. 53 వ పద్యంలో కూడా కోపం వలన కలిగే నష్టాన్ని విశదీకరించారు.

       లోకంలో ప్రస్తుత కాలంలో నీతి నియమాలను ఎక్కడా చూడలేకపోతున్నాము అని 55 వ పద్యంలో వర్ణించిన కవిగారు ఓ పవనపుత్రా! ఆనాడు సీత జాడను కనుగొన్నావు. ఈనాడు నీతి జాడను కనుగొనగలవా? నీతిని మాకు చూపగలవా? అని అంటూ

నేటి కాలమందు నీతి జూపగలవా?” అని 98 వ పద్యంలో ప్రశ్నిస్తూ ఉన్నారు.

      మద్యం తాగి వాగే వారికి అన్ని విధాలా దెబ్బలు పడగలవు అని

తాగి వాగి నాక తబల గాదా మేనుఅని అంటూ 58 వ పద్యంలో సెలవిచ్చారు.

        ప్రక్కనున్నవాడి బాధలను పంచుకోవాలి. వారికి సుఖాన్ని పంచాలి. అటువంటివాడే నిజంగా గొప్పవాడు అని

పక్కవాడి బాధ పంచుకొనెడివాడు

పరులకింత సుఖము పంచువాడు

నిజము గొప్పవాడె నిఖిల జగమ్ముల

అని అంటూ

69 వ పద్యంలో వివరించారు.

       పద్యకవిత, గద్యకవిత అనే రెండు కవితలలో దేని గొప్పదనం దానికి ఉంది. ఏదీ తక్కువైనది కాదు అని

దేని ఘనత జూడ దానిదే లోకానఅని 70 వ పద్యంలో నిష్పక్షపాతంగా తెలియజెప్పినారు.

             ప్రతి మనిషిలోనూ ఏదో ఒక గొప్పదనం తప్పనిసరిగా ఉంటుంది అని

మహిమ యుండు నేదొ మనుషులందరిలోనఅని అంటూ 73 వ పద్యంలో వివరించారు.

         నడక మేలు చేయు నరుని కద్భుతముగఅని 8 వ పద్యంలో నడక మనకు చేసే మేలును విశదీకరించారు

        అపనిందతో జీవింపగలమా? అని

నిందయగ్ని యందు నిలువగ తరమౌనె?” అని అంటూ

11 వ పద్యంలో ఆవేదన చెందినారు.

యముడి బాధకన్న నధికమ్ము గద నిందఅని అంటూ 21 వ పద్యంలో వాపోయారు.

        మనం చేసే పనులను బట్టి తిరిగి ఫలితం లభిస్తుంది అని

పనిని బట్టి తిరిగి ఫలిత ముండును గదా!అని అంటూ 12 వ పద్యంలో హితవు పలికినారు.

      కరుణతో పేదలను కాపాడు అని

కరుణ జూపి వాని కనులు తుడ్చుము దేవ!అని అంటూ 14 వ పద్యంలో పవనపుత్రుని ప్రార్థించారు.

              మంచితనము, కరుణ లేని మానవుడు శవంతో సమానము అని

మనిషి గాడు అతడు మాటాడు శవమేనుఅని అంటూ 18 వ పద్యంలో నిష్ఠూరమాడినారు.

       మంచిని పంచే మానవులు కొందరే అని

మంచి నట్లు పంచు మనుషులు కొందరేఅని అంటూ 27 వ పద్యంలో స్పష్టం చేశారు.

     గుడి బయట భిక్షాటన చేస్తున్న నిరుపేదలకు సహాయం చేయి. సముద్రానికి నీళ్లను ఇవ్వడం వృథా అని

గుడి బయలున నిలిచె గ్రుడ్డిఁ జూడు

నీటి నివ్వ నేమి నిండు సంద్రమునకు

అని అంటూ 31 వ పద్యంలో ఉపదేశం చేశారు.

        కుల మతాల చిచ్చు కాలకూట విషం కంటే భయంకరంగా ఉన్నది అని

కనగ కులము మతము కాలకూటవిషముఅని 32 వ పద్యంలో విశదీకరించారు.

       ఇంటి భవిత యంత యిల్లాలి మీదుండుఅని 38 వ పద్యంలో తెలియజేసిన కవిగారు ఆ ఇల్లాలిని కట్న కానుకలకోసం కష్టపెట్టే వాడు భర్త అనే పదానికి తగడు అని

ఒగుడు గాక వాడు మొగు డనంగనురాదు

అనిఅంటూ 82 వ పద్యంలో పరుషపదాలతో విశ్లేషించారు.

       ప్రస్తుత రాజకీయ నాయకులలో ధర్మాన్ని వెదకడం వృథా అని తెలుపుతూ

రవిని వెదికి నటుల రాతిరి సమయానఅని అంటూ 89 వ పద్యంలో వివరించినారు.

           ఓ ఆంజనేయ స్వామీ! మేము సుఖంగా ఉన్నామంటే అది మీ దయాఫలం. మేము కష్టంలో ఉన్నామంటే అది మా కర్మఫలం అని

సుఖము యేది కలుగ చూపు మీదే స్వామిఅని అంటూ 99 వ పద్యంలో తన దైవభక్తిని ప్రకటించారు.

       రూపము ధనము లేకున్నా ముఖంలో బాధను వ్యక్తం చేయకుండా, ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఆనందయోగంలో ఉండగలగడమే ఉత్తమం అని

హాసముంటె చాలు నంద మదేగదా!అని అంటూ 100 వ పద్యంలో అందరికీ హితాన్ని ఉపదేశించారు. ఈ విధంగా తన పవనపుత్ర శతకాన్ని పూర్తిచేసిన శ్రీ నాయుడుగారి జయన్న గారు ధన్యులు.

       ముఖపరిచయం కూడా లేని నేను వ్రాసిన రోజుకోపద్యం-శంకరాభరణం అనే గ్రంథంలోని సమస్యాపూరణ పద్యాలలో 100 పద్యాలకు, శ్రీ సీతారామకల్యాణం అనే గ్రంథంలోని పద్యాలలో ఇప్పటికి 200 పద్యాలకు ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వీడియో చిత్రీకరణ చేసి తన రామభక్తిని ప్రకటించుకొన్న శ్రీ నాయుడుగారి జయన్న కవివర్యులు ధన్యాత్ములు.

 

        శ్రీ నాయుడుగారి జయన్న గారికి 5-4-1975 తేదిన జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మీదేవి, శ్రీ గోపాలు నాయుడు దంపతులు ధన్యాత్ములు. శ్రీ జయన్న గారి జన్మస్థలం జల్లాపూర్, మానోపాడు మండలం, జోగులాంబ గద్వాల జిల్లా ధన్యమైనవి. పెంచిన తల్లిదండ్రులు శ్రీమతి శంకరమ్మ, శ్రీ గుండ్లకొండ నడిపి శేషన్న కృతార్థులు. ఎం. ఏ, బి. ఇడి విద్యార్హతలతో ఉత్తమ ఉపాధ్యాయుడుగా వృత్తి ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తూ, ప్రవృత్తి పరంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని సమర్థవంతంగా నడుపుతూ, దృక్కోణం (వ్యాససంపుటి) రచించి ముద్రించి, నడిగడ్డ (దీర్ఘకవిత), శ్రీ గడియారం రామకృష్ణశర్మ జీవితం-వ్యక్తిత్వం, కథలు, వచన కవితలు మొదలైన ఎన్నో రచనలను చేసి సమాజ శ్రేయస్సును కాంక్షించే మీ కలంనుండి ఇంకా ఎన్నో ఉత్తమ రచనలు వెలువడాలని, మీకు పరిపూర్ణంగా దైవానుగ్రహం సదా కలగాలని ఆకాంక్షిస్తున్నాను.

          శ్రీ నాయుడుగారి జయన్న కవివరా! సహధర్మచారిణి శ్రీమతి రామేశ్వరి గారు మీకు తోడుగా నీడగా ఉండగా, పుత్రికారత్నములు గౌతమి, ఆద్య సుగుణమణులై మహదానందమును కలిగించుచుండగా, శ్రీరామదూతయైన పవనపుత్రుడు మీకు ఆయురారోగ్య భోగభాగ్యములను అక్షయకీర్తి సంపదలను కలిగింపగా సమాజసేవలో యథాశక్తి తరిస్తూ నిండునూరేండ్లు వర్ధిల్లుదువు గాక! శ్రీరామజయం.

                                                                                                   శుభాశీస్సులతో

14-1-2025,                                                                                     భవదీయుడు

కోవూరు, నెల్లూరు జిల్లా.                                                               అవధాని కోట రాజశేఖర్

                                                                                          విశ్రాంత సంస్కృతోపన్యాసకులు                                                                                      

                                                                                               

 

దృక్కోణం - ముందుమాట

 

దృక్కోణంలోని మనోవీచికలు

 

     మిత్రులు నాయుడు గారి జయన్న రాసిన దృక్కోణంలో  21 వ్యాసాలు ఉన్నాయి. వీటిని వ్యాసాలు అనడం కన్నా వారి దృక్కోణంలోని మనోవీచికలు అనడం సబబు. ఈ వ్యాసాల్లో సమగ్రత, విశాల దృష్టి కనిపిస్తుంది. ముఖ్యంగా తాను నివసిస్తున్న పరిసర ప్రాంతాలలోని కవులు ప్రచురించిన కవితా సంకలనాల్ని పరిచయం చేశారు. కొన్ని కథలు తులనాత్మకంగా పరిశీలించారు. గద్వాల్జాతర కథా సంకలనాన్ని సమీక్షించారు. ఇంకా సాహిత్య భావనలను, సాహిత్యకారుల అభిలాషల్ని పరామర్శించారు.

          గద్వాల, అలంపూరు తాలూకాల ప్రాంతాన్ని నడిగడ్డ అని అలా పిలుస్తారు. ఈ ప్రాంతాలలోని నవల, కవిత్వ చరిత్రను సమగ్రంగా విశ్లేషించారు. నిజానికి ఈ రెండు వ్యాసాలు పరిశోధనాత్మకమైనవి. నవలలోని కథల్ని, కథా నిర్మాణాన్ని, కథా నేపథ్యాల్ని వివరించగల శక్తి జయన్న సంతరించుకున్నారు. అలాగే కవిత్వ చరిత్రను కూడా సమగ్రంగానే వివరించారు. కవిత్వ నేపథ్యపు చరిత్ర వివరించి ఉంటే ఇంకా బాగుండేది. ఈ వ్యాస సంకలనంలో గద్వాల సంస్థానం – సాహిత్య పోషణ అను వ్యాసం ఉన్నది. ఈ వ్యాసంలో జయన్నకు స్థానిక గద్వాల సంస్థానం పట్ల అవ్యాజమైన అనురాగం, ప్రేమ కనిపిస్తుంది. వీటి ప్రవాహంలో ఈ వ్యాసంలో కొంత విశ్లేషణ కొరవడింది. ఆయా రాజుల కాలంలో జరిగిన సాహిత్య కృషిని గొప్పగా వివరించారు. ఈ చరిత్ర ఈనాటి సాహిత్యకారులకు తెలియవలసిన అవసరం గుర్తించారు. అందుకే క్లుప్తంగా నైనా ఆయా రాజుల కాలంలోని సాహిత్య కృషిని పరిచయం చేశారు. నిజానికి కోస్తా ప్రాంతం నుంచి వచ్చిన కవుల నేపథ్యాన్ని వివరించాల్సి ఉండింది. బ్రిటిష్ కాలంలో అక్కడ సంస్థానాలు పల్చబడి పోవటం, కవులకు, కళాకారులకు ఆదరణ తగ్గిపోవడం వలన వారంతా ఆనాటి నైజాం పరిపాలనలోని సంస్థానాలలోకి బాట పట్టారు. ఆ విధంగా వచ్చిన కవులలో విశ్వనాథ, జాషువా వంటి ఉద్దండ పండితులు, కవులు, అక్కినేని నాగేశ్వరరావు వంటి కళాకారులు ఈ సంస్థాన సత్కారాన్ని పొందిన వాళ్లే. స్థానిక చరిత్ర తెలుసుకోకపోతే రచయితకు గానీ, పాఠకులకు గాని  భవిష్యత్తులో వర్తమానం అవగాహన కాదు. కాబట్టి ఈ వ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. జయన్న గారికి కేవలం కవిత్వం, కథ, చరిత్ర మీద ప్రేమనే కాకుండా ఈనాటి వాగ్గేయకారులపై కూడా మమకారం ఉంది. పల్లె కన్నీరు పెడుతుందో/ కనిపించని కుట్రల అన్న గేయం ప్రసిద్ధమైనది. ఈ గేయ రచయిత గోరటి వెంకన్నను, ఆయన గేయాల్ని జయన్న విశ్లేషించగలిగారు. అలాగే ఇంకా చరిత్ర గమనించని వాగ్గేయకారుడు కొండన్నను విశ్లేషించడం గమనించదగ్గది.

        ఈ వ్యాసాలలో వైవిధ్యం కూడా కనిపిస్తుంది. జయన్న గారు ఉపాధ్యాయులు. విద్యా రంగాన్ని గురించి రాసినటువంటి వ్యాసం ఒకే ఒక్కటి ఉంది. అది రామయ్య పాఠాలు గురించి. ఇందులో విద్యా విధానం ఏ కారణాలవల్ల కుంటుపడుతుందో. పాఠ్యాంశాలు ఏ విధంగా ఉంటే విద్యార్థిలో మనోవికాసం చెందుతుందో వివరించిన తీరును పాఠకులకు పరిచయం చేశారు. ఈ వ్యాసాలు ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి పనికొచ్చేవి. ఇందులో రామయ్య గారు వివరించిన అంశాల్లోని పాక్షికతను విశ్లేషించాల్సి ఉండింది. జయన్న గారు వివాదాస్పద అంశాల వైపు దృష్టి మళ్లించినట్లు లేదు.

   జయన్నలో విశాల దృష్టి ఉంది అని చెప్పడానికి ఈనాడు ఫేస్బుక్లో వస్తున్న కవిత్వాన్ని కూడా గమనిస్తున్నారని చెప్పడానికి ఇందులో ఒక వ్యాసం ఉంది. విమర్శకులైన వారికి చుట్టూ ఏం జరుగుతుందో గమనించే శక్తి కూడా ఉండాలి. ఆ శక్తిని ఆయన కలిగి ఉన్నారు. జయన్న దృష్టి వైశాల్యాన్ని ఈ వ్యాసాలు పట్టిస్తాయి. కవుల బిరుదునామాలను గురించి ఒక వ్యాసం ఉంది. ఈ వ్యాసం సీరియస్ గా గమనించదగింది. రచయితలు, కవులు  బిరుదుల కోసం ఎలా తాపత్రయపడతారో విశ్లేషిస్తాడు. నిజానికి ఇవాళ ప్రతి జిల్లాలో నాలుగైదు సాహితీ సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు కవితా సంకలనాలకు, కథా సంకలనాలకు అవార్డులు ప్రకటిస్తున్నాయి. ఈ సందర్భంగా అపాత్ర దానం, అపరిగ్రహం అన్న రెండు భావనలను మనం గుర్తు చేసుకోవాలి. దానం ఇచ్చేవాడు, అలాగే గ్రహించేవాడు కూడా పాత్రులై ఉండాలని భావన. ఈ స్పృహ లేని రచయితలకు, సామాజిక బాధ్యత ఉంటుందని, ఇటువంటి సంస్థలకు ఉత్తమ సాహిత్యాన్ని, ఉత్తమ విలువల్ని ప్రోత్సహించాలన్న తపన ఉంటుందని ఊహించలేము. ఇటువంటి భావనల్ని ఎవర్ని గాయపరచకుండా, అతి సున్నితంగా విశ్లేషించటం జయన్న కుండిన సున్నిత మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. తనకు నచ్చని విషయాన్ని రచయితను గాయపరచకుండా అతి సున్నితంగా అందులోని అనౌచిత్యాన్ని వివరించి, తన మర్యాదను, ఎదుటి వ్యక్తి మర్యాదను నిలబెడతారు.

ఈ వ్యాసాల్లో శైలి చాలా అందంగా ఉంది. అన్వయ కాఠిన్యం లేదు. సూటిదనం ఉంది. రచయితల మీద రాసిన వ్యాసాల కంటే స్వతంత్ర వ్యాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇతని ప్రతిపాదనలు, అభిప్రాయాలు గమనించదగ్గవి, గౌరవించదగ్గవి. ఈయనకు విమర్శనా బలం, విశ్లేషణాశక్తి రెండు ఉన్నాయి. లేనిదంతా నిరంతరం రాయకపోవడమే. నడిగడ్డ ప్రాంతం నుండి ఒక మంచి విమర్శకుడిగా, విశ్లేషకుడిగా ఎదగదగిన హంగులన్ని ఇతనిలో ఉన్నాయి.

 

ఇతనిలో ఒక ఆలోచన పరుడు ఉన్నాడని, ఆ ఆలోచనలకు ఒక శాస్త్రీయత ఉందని ఒక విశ్వాసం, భరోసా ఈ వ్యాసాలు అందిస్తున్నాయి. ఇంతకంటే కావలసింది ఏముంది?  నడిగడ్డ ప్రాంతం నుంచి ఒక గొప్ప విమర్శకుడు ముందుకొస్తున్నాడని అభినందిస్తున్నా. ప్రస్తుతానికి ఇంతకంటే ఏం చెప్పినా అది పొగడ్తవుతుందని నా భావన.


-        కె. నాగేశ్వరాచారి

కథకులు, విమర్శకులు

కర్నూలు

03-12-2024

పవనపుత్ర శతకం

 

 పవనపుత్ర శతకం 

         రచన : నాయుడు గారి జయన్న

   ప్రథమ ముద్రణ: ఫిబ్రవరి, 2025

                     పేజీలు: 48

                         వెల  :  రూ. 50/- లు.


ఆవిష్కరణ ఆహ్వానవీడియో

ఆవిష్కరణ చిత్రాలు

పుస్తకపరిచయ సభ ఆహ్వానం

అవధాని శ్రీకోట రాజశేఖర్ గారి ముందుమాట

లాయర్ పత్రికలో సమీక్ష

డా. చీమకుర్తి వేంకటేశ్వరరావు గారి సమీక్ష

ఎం.డి. ఉస్మాన్ గారి సమీక్ష