2, జూన్ 2021, బుధవారం

బాల్యంలో నా అమాయకత్వం

 నాకు ఊహా తెలియకముందే మా పెద్దమ్మ తెచ్చి పెంచుకుంది. నా చదువు అట్లా పెద్దమ్మ ఊరైన పల్లెపాడు(జో.గద్వాల)లో ప్రారంభమైంది. అదో చిన్న పల్లెటూరు. ఐదవ తరగతి వరకు మాత్రమే బడి ఉండేది. మా తరగతిలో ఐదుగురం ఉండేవారం. అందులో శ్యామసుందర్ రెడ్డి నాకు అత్యంత ప్రియమిత్రుడు. బడిలో చదువులు, మైదానాల్లో ఆటలు, వంకల్లో ఈతలు...ఏడున్న ఒకరి భుజం మీద మరొకరి చేయి ఉండాల్సిందే. అట్లా నాలుగేండ్లు గడిచిపోయాయి. ఐదో తరగతికి వచ్చాకా ఆలోచన మొదలైంది. 'ఇది చివరి సంవత్సరం. వచ్చే సంవత్సరం బడి వదలాలి. ఊరు విడువాలి. మరి ఎక్కడ చదవాలి?' ఎక్కడ చదివినా ఇద్దరం ఒకేచోట చదవాలని నిర్ణయించుకున్నాం. అప్పటికి మా ఊరి పిల్లలకు రెండు అవకాశాలు ఉండేవి. ఒకటి మా సొంతూరు జల్లాపురం. అక్కడ ఏడు వరకు మాత్రమే బడి ఉండేది. రెండు ధర్మవరం. అక్కడ పది దాకా బడి ఉండేది. కొంచెం దూరమెక్కువైనా రెండోదే ఎంపిక చేసుకునేవారు మా ఊరి పిల్లలు ఎక్కువ కాలం ఒకే దగ్గర చదువొచ్చని.

రెండ్లేండ్లకే మారాల్సి ఉంటుందని మొదటిది, దూరమెక్కువని రెండోది వద్దనుకున్నాం. మూడో ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మిత్రుడు చెప్పాడు..."మనం వనపర్తి దగ్గర ఉండే మా మేనమామ ఊరికి వెళ్దాం. అక్కడే ఉంటూ చదువుకుందాం. మనకే ఇబ్బంది రాకుండా వాళ్ళు చూసుకుంటారు" అని చెప్పేవాడు. పెద్దల నిర్ణయాల ప్రమేయం లేకుండా పిల్లల ఆలోచనలు కార్యరూపం దాల్చవన్న సత్యాన్ని గ్రహించకుండా అది నిజమైతదనే అమాయకంగా నమ్మాం. ఎన్నెన్నో కలలు కన్నాం. ఆనందంగా ఆ సంవత్సరం ఐదో తరగతి పూర్తి చేశాం. మనం ఒకటి తలిస్తే విధి ఒకటి చేస్తది కదా! పెద్దల నిర్ణయాల మేరకు ఆరవ తరగతికి నేను మా సొంతూరు జల్లాపూర్ కు, తాను వనపర్తికి వెళ్ళిపోయాం. పదేండ్లు గడిచిపోయాయి.

డిగ్రీ పూర్తయ్యాక...

తాను హైదరాబాద్ నగరానికి రమ్మని, తన రూంలోనే ఉండమని, పని కూడా చూసి పెడతానని మాటిచ్చి, బతుకుదారి చూపాడు. చిన్నప్పుడు ఇచ్చిన మాటను ఇలా నెరవేర్చుకున్నాడా అన్పించింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి