10, మే 2018, గురువారం

అవనిశ్రీవీరేష్-మట్టి కుదురు- అనుభవైక కవిత్వం



అవనిశ్రీవీరేష్
ఆయన నడిగడ్డ మట్టిబిడ్డ
ఉత్సాహం ఉరకలెత్తే యువకుడు
అన్యాయంపై పిడికిలెత్తే పిడుగు
ఆయన కలం కళ్ళెం లేని గుర్రం.
కవిత్వాన్ని ప్రవాహంలా పరుగులెత్తించే ప్రజ్ఞాశాలి
కవిత్వక్యాన్వాస్ మీద పల్లెజనజీవన సౌందర్యాన్ని అందంగా చిత్రీకరిస్తున్న కవి
సమాజపురోగమనంలో సబ్బండ జాతుల శ్రామికత్యాగాన్ని
చరిత్రపుటల్లో చేరుస్తున్న చరిత్రకారుడు

మట్టి కుదురు
అవనిశ్రీ వెలువరించిన మొదటి కవితా సంపుటి.

ఇది అనుభవైక కవిత్వం
మట్టి కుదురు కవితా సంపుటికి నేనందించిన  ఆత్మీయ పలుకులు.


గద్వాలది చరిత్రలో ఎప్పుడూ చెరగని ఓ అధ్యాయం. ఓ ప్రత్యేకమైన ఉనికి. రెండు నదులు, రెండు రాష్ట్రాలతో అనుబంధం. విభిన్న సంస్కృతులు, భిన్న మాండలికాలు, సంస్థాన రాజసం, అపార విద్వత్తు, అడుగడుగున విప్లవం. ఇదిగో వీటన్నిటి వారసత్వంతో...ఉదయించిన యువకవే 'అవనిశ్రీ ' వీరేష్. ఎదిగిన దానితో సంబంధం లేకుండా, అవని మీదే పాదాలను నిలిపెటోడు. అవనికి శిరస్సు వంచెటోడు. అడుగడుగున కవితతో అవనిని అమాంతం అల్లుకున్నోడు. అక్షరం అతని ప్రాణం. వాక్యం అతని నినాదం. నేనిట్లా పరిచయం  చేయడం బాగుండదు కాని, అతని మాటల్లోనే విందాం...
                                                                                              
"నేను
సమాజపు పాఠకుణ్ణి
జన ఆలోచనల భావకుణ్ణి"   అర్థమైంది కదా! ఈ కవెవరో! మరి ఇలాంటి కవి రాసేదేమిటి?ఎవరి కొరకు? అని ప్రశ్నిస్తే..."నా కవిత క్రాంతి పథం/ నా కవిత జనహితం" అని సమాధనమిచ్చాకా, మనకు ప్రశ్నలు మిగులుతాయా?!

ఈ కవి తానేమి రాయాలో, ఎవరి కొరకు రాయాలో స్పస్టమైన అవగాహానతో ఉన్న కవి. అంతే కాదు తన తోటి కవులకు మార్గ నిర్దేశం చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న కవి. కాబట్టే, కవులకు త్రికాలాలను సంధానం చేసే శక్తుండాలని, అక్షరాలతో విప్లవాన్ని తెప్పించగల పరిపూర్ణత ఉండాలని, ఆకలి బాధలను అక్షరాలలోకి వంపాలని,చెమట చుక్కల్లో పదాలను పులుమాలని, ఎక్కడే విపత్కర సంఘటన జరిగినా నిద్రలో ఉలికిపడి కలాన్ని కదిలించాలని మార్గనిర్దేశం చేస్తాడు. కవుల బాధ్యతను గుర్తు చేస్తాడు.  

ఈ కవికి తన ఊరంటే వల్లమాలిన అభిమానం. ఊర్లో జనాలు. జనాల్లో పిల్లలు. పిల్లల నవ్వులంటే మరీ ఇష్టం. ఆ నవ్వులు మామూలు నవ్వులు కాదని చందమామలో పూసిన కలువపువ్వులని, ఆకాశంలో తారలని పిల్లలను ఎదలకు హత్తుకుంటాడు.

ఈ కవి ఎవడెట్లా పోతే నాకేమి, లోకమెట్లుంటే నాకేమనే బాపతు కాదు. అట్లా మిన్నుకుండిపోయే మన్ను తిన్నపాములను ఊరికే వదిలిపెట్టడు. తాను లోకాన్ని గమనిస్తూ, తన కవిత్వంతో దాని గమనాన్ని సరిజేస్తాడు. తల్లిదండ్రులు, గురువులు, రైతులు, ప్రకృతి చేసే నిస్వార్థమైన సేవ నుండి ఏమైనా  నేర్వండ్రా!  కొద్దిగైనా లోకం కోసం చేసి చావండ్రా! అని వాతలు పెడతాడు.

నాకు ఈ కవిలో ఒక శ్రీశ్రీ, ఒక గోరటి కనిపిస్తాడు. వాళ్ళిద్దరూ ఆవహిస్తేనే రాసిన కవితేమో అనిపిస్తుంది- ఈ సంకలనంలో ఉన్న 'మేమే చరిత్ర పుటలం ' అన్న కవిత.  ఒక వెలుగు వెనుక దాగిన చీకటి రహస్యాన్ని, చెమట చుక్కలు సృష్టించిన చరిత్ర పాఠాన్ని, నాగరికత నేర్పిన వృత్తులను అమితమైన ప్రేమతో గుండెల కద్దుకుంటాడు ఈ కవి.

సామాజిక మాధ్యమాలలో ఈ కవి రాస్తున్న కవిత్వాన్ని నిశితంగా గమనిస్తూ వచ్చినప్పుడు, ఇది అనంత భావాలకొండ అని, ఈ కవికి కవిత్వం రాయడమంటే నీళ్ళు తాగినంత పనే అనుకున్నాను.  కానీ నా అంచనాలను తలకిందులు చేస్తూ ఈ కవి ఇట్లా అంటాడు..." ఒక కవిత రాయడమంటే/ ఒక మహా యుద్దం జరగటమే" నిజమే కదా! ఎంత అంతః సంఘర్షణా యుద్దం మెదడులో, హృదయంలో  జరిగితేనో ఒక కవిత పుట్టుకొస్తుంది. పురిటి నొప్పుల బాధ తల్లికే గానీ, తనువు పంచుకొని పుట్టిన వాళ్ళకేమి తెలుస్తుంది! పుట్టిన బిడ్డను చూసిన వాళ్ళకేమి తెలుస్తుంది. కవి కష్టం కవికే తప్పా, కవితకూ, పాఠకుడికి అర్థం కావు. అయినా అది అనుభూతే తప్పా, అనుభవం కాజాలదు. ఈ కవి కవిత్వమంతా ఎక్కువ భాగం అట్లా అనుభవం నుండి పుట్టుకొచ్చిన కవిత్వమే. అందుకే అది ఆకలి వేసినప్పుడు గొంతులో జారిపోయే సంకటిలా కమ్మగుంటది. దప్పికైనప్పుడు ఊరి నీటినిచ్చే చెలిమె అంత చల్లగుంటది. వాస్తవాలను కళ్ళ ముందు కవిత్వంగా ఉంచినప్పుడు గొంతుకడ్డం పడ్డ గొడ్డుకారం ముద్దలెక్క ఉంటది.

కవి కావాలని ఉత్త ఉబలాటం ఉంటే సరిపోదు. అదే చాలనుకుంటే పొరపాటు.  ప్రాంతం, పరిస్థితులు, అనుభవాలు, నిశిత దృష్టి, హృదయ మార్ధవ్యం ఇట్లా చాలా చాలా ఆవశ్యకాలతో పాటూ, కొంత సహజాతం, కొంత సాధన అవసరం. ఇవే కవికి ప్రాణం పోస్తాయనుకుంటా. ఇవే కవిని వెతికి పట్టుకుంటాయనుకుంటా. నేనైతే ఇట్లా తయారైన వాడేనేమో ఈ కవి అని నిర్ధారణకొస్తా. లేకపోతే సాగర కెరటమెందుకు ఎగసిపడుతుందో! పర్వతం మీది శిల ఎందుకు ఎదురుచూస్తుందో! ఈ కవి ఎట్లా పసి గట్టేవాడు?

ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గుణం ఈ కవిలో మస్తుగ కనిపిస్తది. కాబట్టే 'ఎక్కువైతే కాదు ' కవిత రాయగలిగాడు. మేము ఉద్యమాలు చేయవచ్చు. ఉద్యమాల కొరకు కవిత్వం రాయవచ్చు. ఇంకోటి...ఇంకోటీ...ప్రజల కొరకు ఏదైనా కావొచ్చు. కానీ అవన్ని గతంలో చేసిన వారికన్న గొప్పవైతే కాదు.  వారి దోవలో, వారి నీడలో చేసిన చిరు ప్రయత్నాలేనని కవి వినమ్రతను కనబరుస్తాడు.

కవి జన సమూహంలో చేరిపోవాలా. జన సమూహాన్ని తన లోకంలోకి లాక్కపోవాలా. ఈ రెండూ చేయగలవాడే అసలు కవి. 'యాదికుందా?'  కవిత ద్వారా కవి తన బాల్యపు గుర్తులను ఏరుకుంటూ వెళ్తూనే, మనల్ని మన బాల్యంలోకి నెట్టేస్తాడు. సంసార సాగరంలో యవ్వన, మధ్య, వృద్ధాప్య దశలతో వాటి వాటికి నిర్ధేశించిన లక్ష్యాల సాధనలో చతికిలపడి, ఒడ్డునపడ్డ చేపల్లా గిలగిలా కొన ఊపిరితో తనుకులాడుతున్న మనకు మళ్ళీ బాల్యంలోకి తొంగి చూడటమంటే తిరిగి చేపలను నీటిలోకి చేర్చడమే కదా. అదిగో ఆ అనుభూతినే కలిగిస్తాడు.  ఇట్లా చెప్పుకుంటూ పొతే ఇది అనంతం. తినే వాడికి రుచులు చెప్పడమెందుకు?  మీరే చవి చూడండి. చివరగా ఒక ఆశ. ఈ కవి తన కవిత్వాన్ని మరింత చిక్కబరిచి, మరింత వైవిధ్యమైన శిల్పంతో, భవిష్యత్తులో విస్తృతమైన సాహిత్యాన్ని సృష్టించి, నడిగడ్డ సాహిత్య సంపదను సుసంపన్నం చేయాలి. ఎన్నో పోరాటాల తర్వాత  ఆవిర్భవించిన జోగులాంబ గద్వాల జిల్లాలో తొలి వచన కవితా సంపుటిని తీసుకొస్తున్న సోదరుడు అవనిశ్రీ వీరేష్ ను ఈ సందర్భంగా  మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.

నాయుడి గారి జయన్న,
తెలుగు ఉపాధ్యాయుడు,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పూడూరు.
04.10.2017.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి