2, నవంబర్ 2014, ఆదివారం

కాణాదం పెద్దన

కాణాదం పెద్దన మహబూబ్ నగర్ జిల్లాలో ''విద్వద్గద్వాల '' గా విశిష్ట సాహిత్య పోషణా సంస్థానంగా పేరొందిన గద్వాల సంస్థానపు ప్రభువుల ఆస్థాన కవి. సాహిత్య పోషణలో గద్వాలరాయలుగా పేరు తెచ్చుకున్న రాజా చిన సోమభూపాలుడి ఆస్థాన అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడు. గద్వాల అల్లసాని పెద్దనగా భాసిల్లిన కవి. ఆశు, బంధ, గర్భ, చిత్ర వంటి కవిత్వంతో మెప్పించిన చతుర్విద కవితావిశారదుడు.
* వంశం
పెద్దన ''కాణాదం'' వంశం వాడు. నంద వరీక బ్రాహ్మణుడు. ఆత్రేయస గోత్రుడు. ఇతని పినతండ్రి తిమ్మనార్యుడు. భోజుని చంపూ రామాయణానికి వ్యాఖ్యానం రాసిన మల్లేశ్వర దీక్షితులు ఇతనికి విద్యాగురువు.
* గద్వాల సంస్థానానికి ఆగమనం 
పెద్దన పూర్వం సురపురం సంస్థానపు ఆస్థాన పండితులుగా ఉండి, ఆంధ్రమత్స్య పురాణాన్ని రచించిన చిన సోమభూపాలుడి పినతండ్రి ఐన రాజా రామరాయలు(క్రీ.శ. 1768-83) కాలంలో గద్వాల సంస్థానానికి విచ్చేసి, తర్వాత చిన సోమభూపాలుడి(క్రీ.శ. 1784-1815)అస్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడిగా ఘనతికెక్కాడు.
* పెద్దన రచనలు
1. ముకుందవిలాసం
2.ఆధ్యాత్మ రామాయణం
3.యధాశ్లోక తాత్పర్య రామాయణం ( బాలకాండం)
4.శేష శైలేశలీల
** ముకుందవిలాసం
ముకుందవిలాసం ఒక ప్రసిద్ధిచెందిన తెలుగు ప్రబంధం. ముకుందుడు అనగా శ్రీకృష్ణుడు. కృష్ణుడి అష్టమహిషులలో ఒకరైన భద్రాదేవితో శ్రీకృష్ణునికి జరిగిన వివాహం ఇందులోని ప్రధానమైన ఇతివృత్తం. అందువలన దీనికి '''భద్రాపరిణయం''', '''భద్రాపరిణయోల్లాసం''' అని నామాంతరాలు కలవు. ఇది మూడాశ్వాసాల ప్రబంధం. ఇది తొలిసారి క్రీ.శ. 1886లో గద్వాల సాహిత్య విద్యా ముకురం ముద్రాక్షరశాలలో ముద్రితమైంది. తరువాత తెలుగు విజ్ఞానపీఠం వారు ఈ ప్రబంధాన్ని 1985లో ముద్రించారు. చిన సోమభూపాలుడి కోరిక మేరకు ఈ గ్రంథాన్ని రచించి గద్వాలలోని కేశవస్వామికి అంకితం చేయబడింది. శ్లేష, శబ్దాలంకారాలు, బంధకవిత మొదలైన చిత్రకవితా విన్యాసాలు ఎన్నో ఈ కావ్యంలో కనిపిస్తాయి.
**ఆధ్యాత్మ రామాయణం
ఇది పెద్దన రెండవ రచన. ఈ గ్రంథం క్రీ.శ.1873లో గద్వాల సాహిత్య ముకుర ముద్రాక్షరశాలలో ముద్రితమైంది. ఈ గ్రంథానికి మూలం ఆగస్త్యుడు రచించిన ఆధ్యాత్మ రామాయణం. ఈ గ్రంథంలో పెద్దన గద్వాల ప్రభువుల ఇలవేల్పగు చెన్నకేశవస్వామిని కీర్తించాడు. ఈ స్వామికే ఈ గ్రంథం అంకితమిచ్చినట్లు తెలుస్తుంది. ఈ గ్రంథానికి, ఇతర రామాయణాలకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. సీతారామ హనుమత్సంవాద రూపమైన రామ హృదయాన్ని పరమశివుడు పార్వతికి తెలుపుట ఇందలి విశేషం. రామ హృదయాన్ని కవి రామగీత తత్వంగా ఇందులో పేర్కొన్నాడు. ఈ గ్రంథమునందు శబ్ధాలంకారాలు కోకొల్లలు.
**యధాశ్లోక తాత్పర్య రామాయణం ( బాలకాండం)
గద్వాల సంస్థానంలో వాల్మీకి రామాయణాన్ని ''యధాశ్లోక తాత్పర్య రామాయణం '' పేరుతో ఆరుగురు కవులు అనువాదం చేశారు. ఇది గద్వాల సంస్థానం వారి చెన్నకేశవ ముద్రాణాలయంలో రెండు సంపుటులుగా వెలువడింది. దీనిలో పెద్దన కవి ''బాలకాండ ''ను అనువాదం చేశాడు. తన రచనలో పెద్దన కవి గద్వాల సంస్థాన ప్రభువుల పూర్వపు స్థానమైన పూడూర్ చెన్నకేశవస్వామిని స్తుతించాడు. పెద్దన కవి బాలకాండను మూడాశ్వాసాల కావ్యంగా మలిచినాడు.

''అల కణాదము పెద్దనాధ్వరి దనరించు

పటు చమత్కృతులతో బాలకాండ '' అని రామాయణాన్ని అనువాదం చేసిన గద్వాల కవుల గురించి చెప్పన పద్యంలో ఉంది.

** పెద్దన రచనా రీతి
పెద్దన తన రచనా రీతిని తానే తెలుపుతూ '' విమత ప్రబంధ రీతుల నొనరింపుచు, గీత యోగ్య స్ఫూర్తిని గల్గించునట్టి రచన గావించెద, ప్రసంగ సంగత శృంగార చమత్కార రసానుబంధంబుగా నొనరింపబూనుదు'' అని చెప్పుకున్నాడు. రామరాజ భూషణుడు వసుచరిత్రలో చెప్పినట్లు గానయోగ్య కవిత చెప్పిన కవి.
**ఇతర కవులచే ప్రశంస
పెద్దన రచనా నైపుణ్యం గురించి వెన్నెలకంటి వెంకటపతి అను కవి ఈ కింది విధంగా చెప్పాడు...

''' ఇద్దరు జోడు నన్నకవి ఎర్రన తిక్కన సోమయాజి దా

నుద్దెగు వారికిన్ ముగ్గురి కొక్కడే దీటగు నల్లసాని మా

పెద్దన వారితోదుతను పెరు వహించిన శ్రీకాణాదమున్

పెద్దన సోమయాజి నిను పెద్దన బొల్చు కవిత్వ సంపదన్

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*




1, నవంబర్ 2014, శనివారం

పాలమూరు జిల్లా తొలి సంస్కృత కవి-మంథాన భైరవుడు



మంథాన భైరవుడు మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ ప్రాంతానికి చెందిన కవి. పాలమూరు జిల్లా సాహిత్య చరిత్రలో తొలి సంస్కృత కవి. క్రీ.శ. 10 వ శతాబ్ధికి చెందిన వాడు. జైన మతావలంభికుడు. ఈ కవి తంత్ర గ్రంథాలు రచించాడు.  ''భైరవతంత్రం'' పేరుతో ఇతను రచించిన గ్రంథం పలువురు పరిశోధకులచే ప్రశంసలందుకుంది. ఇది సంస్కృత గ్రంథం. 22 పత్రాలతో కూడిన తాళపత్ర గ్రంథమిది. సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ కవుల సంచికలో ఈ కవి గురించిన ప్రస్తావన ఉంది. ప్రముఖ కవి పండితులు, పరిశోధకులు మావవల్లి రామకృష్ణ కవి కుమార సంభవానికి రాసిన పీఠికలో వీరిని, వీరి గ్రంథాన్ని ప్రశంసించారు. భైరవుడు ''ఆనందకందకం'' అను మరో గ్రంథాన్ని రచించినట్లు శేషాద్రి రమణ కవులు పేర్కొన్నారు. ఆదిరాజు వీరభద్రరావు కూడా ఈ కవిని గురించి తమ రచనల్లో పేర్కొన్నాడు.

రచనలు
* భైరవ తంత్రం
* ఆనందకందకం

భైరవతంత్రంలోని శ్లోకాలు
గ్రంథం ప్రారంభంలో...
'' శ్రీహర మహాశాంతం భైరవం భీమనిగ్రహం


 సమస్కృత్వా ప్రవక్ష్యామి భూతంత్రం సుపాస(వ)నం''

గ్రంథాంతంలో....
 ''ఏతత్తంత్రం మాయా ప్రోక్తం గపనీయం ప్రయత్నతః

ప్రియశిష్యాయ ధాతవ్యం పుత్రాయచ విశేషితః
ఇతి భైరవాగమే భూత తంతే సప్తవింశతి పటలః''

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*