12, జనవరి 2018, శుక్రవారం

అక్షరాగ్నికణం అలిశెట్టి

ద్యమానికి పర్యాయ పదం తెలంగాణ. తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి కరీంనగర్. కరీంనగర్‌కు జవం, జీవం జగిత్యాల. ఆ జగిత్యాలలో జన్మించిన అక్షరాల అగ్నికణమే అలిశెట్టి ప్రభాకర్.

తండ్రి చిన రాజం, తల్లి లక్ష్మి. అలిశెట్టి ఇదే రోజు(12.01.1954) భూమ్మీదకు వచ్చిపడ్డాడు. ఇదే రోజు జీవితం నుండి నిష్క్రిమించాడు. పుట్టిన రోజే మరణించడం. మరణించిన రోజే పుట్టిన రోజు కావడం యాదృచ్చికం. అందుకే ఆయనకు మరణం లేదు. ఆయన కవిత్వానికి అంతకన్నా లేదు.

ఏడుగురు అక్కాచెల్లెళ్ళు, ఇద్దరు అన్నాదమ్ములు వెరసి మొత్తం పది మంది సంతానం తండ్రికి. పది మందిలో ఒకడిగా జన్మించాడు. కాబట్టే పది మంది మేలు కోరే కవిత్వం రాశాడు.

అసలు అలిశెట్టి ఎవరు?
పెన్సిల్‌తో, సరదాగా చాలా బొమ్మలను గీశాడు.
కెమెరా కంటితో సామాజిక దృశ్యాలను తీశాడు.
పెన్నును గన్ను చేసుకొని అస్తవ్యస్థ సమాజంపై కవితాస్త్రాన్ని సంధించాడు.  ఆయనో చిత్రకారుడు. ఫోటోగ్రాఫర్, కవి. వెరసి ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి. కుంచె, కెమెరా బతకడానికి పనికొచ్చాయి. మూడోది జీవింపజేసింది.     

కవిత్వ భాషలో చెప్పాలంటే చెరబండరాజు తన గురించి తాను చెప్పుకున్న కవితను కొంచెం సరిజేసి చెప్తే అలిశెట్టికి అచ్చంగా సరిపోతుంది.

ఆకలి అతని పేరు
కలం అతని ఆయుధం
అభ్యుదయం అతని ఊరు.  

11 ఏళ్ళకే తండ్రి మరణిస్తే, కుటుంబ పోషణ భారాన్ని తలకెత్తుకున్నాడు. ఆ క్రమంలోనే  తలకెత్తుకున్న భారాన్ని తగ్గించుకోవడానికి బుజానికి కెమెరాను తగిలించుకున్నడు.

ఆదర్శాలను నేను, నీవు అందంగా వల్లిస్తాం. ఆచరణలో కొందరే పాటిస్తారు. ఈ రెండో కోవకు చెందినవాడే అలిశెట్టి. అందుకే భాగ్యం కన్నా మహాభాగ్యం ఏముంటుందని పేదింటి పిల్లైనా భాగ్యాన్ని తన ఇంటికి ఇల్లాలుగా తీసుకొచ్చాడు.  ఎందుకంటే అందరికి డబ్బు విలువ తెలుసు.  అలిశెట్టికి డబ్బుకు విలువ లేదని తెలుసు.  ఆయనెప్పుడు డబ్బు వెంట వెంపర్లాడలేదు. డబ్బు సంపాదించే మార్గాలు మస్తుగున్న వాటన్నిటిని కాలదన్నాడు. కలాన్ని మాత్రమే అందుకున్నడు, నమ్ముకున్నడు. కాని అమ్ముకోలేదు.

మాటలతో మంట పుట్టించడం, అక్షరాలను అస్త్రాలుగా సంధించడం ఒక శ్రీశ్రీకి తెలుసు, చెరబండకు తెలుసు, అలిశెట్టికి కూడా తెలుసు. జీవితంలో కొరతగా ఉన్న డబ్బు నేర్పిందేమో!  తక్కువ తక్కువగా వాడుకొమ్మని. అదే సూత్రాన్ని కవిత్వానికి వర్తింపజేశాడు. మిని కవితను అతను అందుకున్నడో!, మిని కవితే అతనల్లుకున్నదో! తెలువదు గానీ, అమ్మాకొడుకుల్లా అల్లుకపోయారు. ఎంతగా అంటే అలిశెట్టికి మిని కవిత తప్ప మరోటి రాదని విమర్శించెంతగా. అది తప్పని చెప్పడానికి ఆయన చురకలంటించాడులే గాని అది వేరే విషయం.

మూడు, నాలుగు పాదాలతో అద్భుత కవిత్వాన్ని సృస్టించడం అలిశెట్టికి మాత్రమే సాధ్యమైంది.బహుశా అది ఆకలి నేర్పిన పాఠం కావొచ్చు.
నిలబడు
బలపడు
సంతకాలపై కాదు
సొంతకాళ్ళపై అన్న కవితా ప్రేరణ కావొచ్చు.

లేకపోతే...
"తనువు పుండై..వేరొకరికి పండై
తను శవమై...వేరొకరికి వశమై
తను ఎడారై...వేరొకరికి ఒయాస్సిసై "  అంటు వేశ్యల దయనీయ, దుర్భర జీవితాలకు చిత్రిక పట్టేవాడా?  ఈ కవితెంత కరుణా సముద్రమో!, సంచలనమో! ఎన్ని వేదికల మీద ఎన్ని వేల గొంతుకలు    ఉటంకించాయో వేరే చెప్పనక్కర్లేదనుకుంటా. ఆ విషయం కాలానికి తెలుసు, దాన్ని మోస్తున్న  సాహిత్యానికి తెలుసు. కవిత్వాన్ని కోట్‌లా చేసి అభ్యుదయ తెలుగు సమాజం అత్యధికంగా ఉపయోగించుకున్నది శ్రీశ్రీ తరువాత అలిశెట్టినే అంటే అతిశయోక్తి కాదు.

జన్మించిన జగిత్యాలలో ఎర్రపావురాలు ఎగురవేశాడు.  నిర్భందం వెంటాడితే కరీంనగర్ కొచ్చాడు ఆకలి జీవులకోసం మాట్లాడే మనిషి మౌనంగా ఉండగలడా? తన మాటలతో మంటల జెండాలు ఎగిరేశాడు. కరీంనగర్ కాదంటే హైదరాబద్ కొచ్చిపడ్డడు. ప్రాంతాలెన్ని మారినా, దోపిడి సమాజానికి చురకలు వేయడం మాత్రం మానలేదు. తన జీవితం రక్తరేఖ మీద నడుస్తున్నా...ఎన్నికల ఎండమావులు దాటుకుంటు , సంక్షోభ గీతాన్ని పాడుకుంటు సిటీ లైఫ్ అనుభవించాడు.
నగరం అర్థం కాని రసాయన శాల
చిక్కు వీడని పద్మ వ్యూహం అని అతనికి అనతి కాలంలోనే తెలిసిపోయింది. అయినా సిటీని  వదల లేదు. సిటీలో తిరుగడం మానలేదు. సిటీపై రాయడం మానలేదు.
కాచీగూడా అంటే 
కాచి వడబోసిన
 కమ్మని కాఫీయే కదా! అంటు కాచిగూడాకు కవితొకటి కానుగ ఇచ్చాడు.

ఇరుకిరుకుగా ఉండే రేకుల సెడ్‌లో జీవితాన్ని నెట్టుకొచ్చాడు. అయితేనేం...
అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు/
 సంసారం బరువును సమీక్షించగలిగాడు.

ఆయన దోపిడీ సమాజంపై సంధించిన కవితాస్త్రాలు అన్నీ, ఇన్నీ కాదు. ముఖ్యంగా రాజకీయాలను చీల్చి చెండాడు. ఒక పార్టీలో ఉంటునే మరో పార్టీ వైపు చూసే జంపు జిలానీలకు చురకలేశాడు.
"వాడు
 ముందే వానపాము
ముడ్డెటో? మూతెటో? " అంటూ వాతలు పెట్టాడు.

"ఓ నక్క ప్రమాణ స్వీకారం చేస్తుంది 
ఇంకెవరిని మోసం చేయనని
ఓ పులి పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తుంది
తోటి జంతువులను సంహరించనని
ఈ కట్టుకథ విన్న గొర్రెలు పుర్రెలు ఊపుతూనే ఉన్నాయి." అంటూ మోసగించే నేతలను, అమాయకత్వాన్ని వీడని జనాన్ని ఎద్దేవా చేస్తాదు.  దురదృస్టమేమిటంటే అదే కట్టుకథలను నేతలు నేటికీ చెబుతున్న గొర్రెలు ఇంకా పుర్రెలు ఊపుతూనే ఉండటం. ఇంత పరిణాం చెందినా ఇంకా పరివర్తన చెందకపోవడం.

"గుడిసెలు
మేడల్ని కడతాయి
మేడలే 
గుడిసెల్ని కొడతాయి" ఎన్ని తక్కువ మాటలు ఎంత గొప్ప మాటలు. ధనవంతుల అభివృద్ది సోపాన నేపథ్యాన్ని, దాని వెనుకే దాగున్న దోపిడీ వ్యవస్థను ఎంత అద్భుతంగా కళ్ళకు కట్టాడు.
"పాల రాతి బొమ్మైన
పార్లమెంట్ భవనమైన
వాడు చుడితేనే శ్రీకారం
వాడు కడితేనే ఆకారం" అంటూ శ్రమజీవి త్యాగాన్ని కీర్తిస్తాడు కవి.

ఇట్లా ఇది అది అని ఏమీ.. ఏదీ రాసినా పేదల కోసమే రాశాడు. వాళ్ళ కన్నీళ్ళు తుడువడానికే రాశాడు.
రాయనైతే రాశాడు కానీ రాసిన దానితో సంపాదించినదేమీ లేదు కీర్తి తప్ప. ఎందుకంటే ఆకలిని జయించాలన్న ఆరాటమే గానీ, ఆస్తులను కూడ బెట్టాలన్న ఆలోచన ఆయనకెప్పుడు లేదు. అందుకే ఆయన కవిత్వాన్నైతే జయించగలిగాడు గానీ వ్యక్తిగత జీవితాన్ని రోగానికి అప్పగించి ఓడిపోయాడు. అయితేనేం తెలుగు కవిత్వం ఉన్నంత కాలం అలిశెట్టి జీవించే ఉంటాడు. తెలుగు కవిత్వ యవనిక మీద అలిశెట్టి అభ్యుదయ పతాకై రెపరెపలాడుతూనే ఉంటాడు. ఆ స్ఫూర్తిని మనలో నింపుకొని సాగడమే మన ముందున్న కర్తవ్యం.

-నాయుడి గారి జయన్న 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి